Begin typing your search above and press return to search.

అదే రోజు ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో లండన్‌కి మంచు లక్ష్మి...!

సరిగ్గా అదే రోజు మంచు లక్ష్మి తన కూతురుతో కలిసి లండన్ వెళ్లింది. ఆ విషయాన్ని సన్నిహితులకు తెలియజేసింది. మంచు లక్ష్మి లండన్ ప్రయాణం గురించి చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   14 Jun 2025 6:28 AM
అదే రోజు ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో లండన్‌కి మంచు లక్ష్మి...!
X

అహ్మదాబాద్‌ ఎయిర్‌ క్రాష్‌ తో దేశం మొత్తం ఉలిక్కి పడింది. అదే విమానంలో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తూ మృతి చెందారు. ఇంకా ఎంతో మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ఆ రోజు లండన్‌ వెళ్లిన వారి కుటుంబ సభ్యులు, లండన్ వెళ్లేందుకు రెడీ అవుతున్న వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురి అయ్యారు. సరిగ్గా అదే రోజు మంచు లక్ష్మి తన కూతురుతో కలిసి లండన్ వెళ్లింది. ఆ విషయాన్ని సన్నిహితులకు తెలియజేసింది. మంచు లక్ష్మి లండన్ ప్రయాణం గురించి చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. లండన్‌ కు వెళ్లాల్సిన మంచు లక్ష్మి తన కూతురుతో కలిసి అదే ఫ్లైటలో ప్రయాణం చేసిందా ఏంటి అనే అనుమానాలు కొందరిలో ఉన్నాయి.

విమాన ప్రమాదం జరిగిన వెంటనే చాలా మంది మంచు లక్ష్మికి ఫోన్‌ చేసి, మెసేజ్‌లు చేసి ఆమె గురించి వాకబు చేశారట. లండన్ వెళ్తాను అన్నావు కదా.. ఏ ఫ్లైట్‌ లో వెళ్లావు, ఎలా ఉన్నావు అంటూ మెసేజ్‌లు చేశారట. అంతే కాకుండా చాలా మంది మంచు లక్ష్మికి పదే పదే ఫోన్‌ చేసి ఎలా ఉన్నావంటూ అడిగారట. దాంతో అసలు విషయాన్ని ఒక వీడియో ద్వారా మంచు లక్ష్మి షేర్ చేశారు. తాను క్షేమంగా ఉన్నాను అని, తన కూతురుతో కలిసి లండన్‌ వచ్చాను, ప్రస్తుతం మేము చాలా సేఫ్‌గానే ఉన్నామని చెప్పుకొచ్చింది. అదే రోజున నేను నా కూతురుతో కలిసి లండన్‌ ప్రయాణం చేసిన విషయం నిజమే. అయితే మేము ముంబయి నుంచి లండన్‌కి వచ్చాము.

మంచు లక్ష్మి వీడియోలో... చాలా మంది నేను ఎలా ఉన్నాను అంటూ మెసేజ్‌లు చేస్తున్నారు. ఆ ఘటన జరిగిన వెంటనే ఎన్నో ఫోన్లు, మెసేజ్‌లు నాకు వచ్చాయి. నేను, నా కూతురు అదే రోజున ఎయిర్ ఇండియా విమానంలో లండన్‌కు ప్రయాణం చేయడం వల్ల చాలా మందిలో ఆందోళన మొదలైంది. దేవుడి దయవల్ల మేము సేఫ్‌గా లండన్‌ చేరుకున్నాము. లండన్ చేరుకున్న తర్వాత విమాన ప్రమాదం గురించి తెలిసి షాక్‌ అయ్యాను. ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. విమాన ప్రమాదంలో విద్యార్థులు కూడా మృతి చెందారని తెలిసి మరింత బాధ కలిగిందని మంచు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో ఎప్పుడు, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మన ప్రాణాలు మన చేతిలో ఉండకుండా, ఏ క్షణంలో చనిపోతామో తెలియదు అనడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంది.

కొన్నాళ్ల క్రితం వరకు సినిమాల్లో నటిస్తూ, నిర్మిస్తూ బిజీగా ఉన్న మంచు లక్ష్మి ఈ మధ్య కాలంలో పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు. ఆమె ఇండియాలో కాకుండా ఎక్కువగా విదేశాల్లో ఉంటున్నారు. ముంబైకి మకాం మార్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. వ్యాపారాలు చూసుకుంటూ తన కూతురు బాధ్యతలను చూసుకుంటున్న మంచు లక్ష్మి ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటుంది. భవిష్యత్తులో ఏమైనా ఆమె టాలీవుడ్‌ లేదా బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. ఆ మధ్య మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవల నేపథ్యంలో మంచు లక్ష్మి యొక్క మద్దతు ఎవరికి అనే చర్చ జరిగింది. కానీ ఆ సమయంలో మంచు లక్ష్మి గొడవలో ఇన్వాల్వ్‌ కాలేదు. ఆమె సోషల్‌ మీడియాలో కూడా ఈ మధ్య ఎక్కువగా కనిపించడం లేదు. అందుకు కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి అహ్మదాబాద్‌ నుంచి కాకుండా ముంబై నుంచి మంచు లక్ష్మి, ఆమె కూతురు లండన్‌ వెళ్లడం వల్ల పెను ప్రమాదం తప్పించుకున్నారు.