Begin typing your search above and press return to search.

మిస్ ఇండియాతో మహేష్ మేనల్లుడు..!

తాజాగా, ఈ మూవీ లో హీరోయిన్ ని పరిచయం చేశారు. మాజీ మిస్ ఇండియా(2020) మానస వారణాసిని హీరోయిన్ గా ఎంపిక చేశారు.

By:  Tupaki Desk   |   31 Aug 2023 12:04 PM GMT
మిస్ ఇండియాతో మహేష్ మేనల్లుడు..!
X

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా అందరికీ సుపరిచితమే. ఓ వైపు మహేష్ మేనల్లుడు అనే క్రెడిట్, మరోవైపు పొలిటికల్ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మొదటి సినిమా 'హీరో' తో ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో అశోక్ గల్లా సరసన నిధి అగర్వాల్ నటించింది. ఈ మూవీలో అశోక్ నటన పర్వాలేదనిపించింది. తొలి సినిమా అయినా చాలా ఈజ్ తో చేశాడు. అయితే, కథ రోటీన్ గా ఉండటంతో ఆకట్టుకోలేకపోయింది.


దీంతో, చాలా కాలం తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి రెండో సినిమాతో రెడీ అయ్యాడు. ఈ సినిమాకు సత్యభామ అనే టైటిల్ ని ఖరారు చేశారు. జాంబిరెడ్డి ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథను అందిస్తున్నారు. గుణ 369 ఫేం అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ ని విడుదల చేయగా, ఆకట్టుకుంటోంది. ఓ యాక్షన్ కూడా విడుదల చేశారు.

తాజాగా, ఈ మూవీ లో హీరోయిన్ ని పరిచయం చేశారు. మాజీ మిస్ ఇండియా(2020) మానస వారణాసిని హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించారు. హీరోయిన్ మానసి సత్యభామ టైటిల్ రోల్ ప్లే చేస్తుంది. ఆమెకు సినిమాల్లో స్వాగతం పలుకుతూ మూవీ టీమ్ ఓ పోస్టర్ విడుదల చేసింది.

ఇక, పోస్టర్ లో మానసి లంగా ఓణీలో చాలా అందంగా కనపడుతోంది. వెనకంతా మంచిగా పూలతో డెకరేట్ చేసి ఉంది. ఇక, అచ్చ తెలుగు ఆడ పిల్లలా పరికిణిలో నవ్వుతూ కనిపిస్తోంది. హైదరాబాద్ కి చెందిన మానస వారణాసి 2020 మిస్ ఇండియా విజేత గా నిలిచింది. 2021 మిస్ వరల్డ్ పోటీల్లోనూ భారత్ కి ప్రాతినిధ్యం వహించింది.

ఇదిలా ఉండగా, ఓ వైపు అశోక్ గల్లా రెండో సినిమాకు ప్రిపరేషన్లు చేసుకుంటుంటే, మరోవైపు అశోక్ గల్లా తమ్ముడు, జయదేవ్ గల్లా తన చిన్న కొడుకు సిద్ధార్థ్ గల్లా కూడా సినిమాల్లోకి అడుగుపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. సిద్ధార్థ్ గల్లా కోసం రాఘవేంద్రరావు ఓ లవ్ స్టోరీని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ సినిమాలోనూ శ్రీలీలను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.