Begin typing your search above and press return to search.

మహేశ్- రాజమౌళి.. ఓ రెండు టైటిల్స్

తెలుగు చిత్ర స్టామినాను విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళితో సినిమాలు చేయాలని టాలీవుడ్‌లోని హీరోలందరూ కోరుకుంటారు

By:  Tupaki Desk   |   16 Feb 2024 7:03 AM GMT
మహేశ్- రాజమౌళి.. ఓ రెండు టైటిల్స్
X

తెలుగు చిత్ర స్టామినాను విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళితో సినిమాలు చేయాలని టాలీవుడ్‌లోని హీరోలందరూ కోరుకుంటారు. ఈ టాప్ డైరెక్టర్ ఆర్ఆర్ఆర్ తర్వాత తన కొత్త చిత్రాన్ని సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేస్తున్నట్లు చాలా రోజుల క్రితమే వెల్లడించారు. అప్పటి నుంచే ఈ కాంబినేషన్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

ఇక అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా కథను తయారు చేసినట్లు తెలిసింది. దీని బాధ్యతను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు అప్పగించడంతో ఆయన చాలా రోజులు ఈ మూవీ కథపై పని చేశారు. ఈ క్రమంలోనే ఇటీవలే స్క్రిప్టును పూర్తి చేసినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. హై రేంజ్ కాంబినేషన్ కావడంతో మహేశ్.. రాజమౌళి ప్రాజెక్టు గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని లైన్లు తెరపైకి వచ్చాయి. అయితే ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీతో రాబోతుందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇటీవలే వెల్లడించారు. త్వరలోనే దీన్ని అధికారికంగా మొదలు పెట్టబోతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా టైటిల్ గురించి కూడా చాలా చర్చలే జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి రెండు టైటిళ్లలో ఏదో ఒకటి పెట్టాలనుకుంటున్నారట.

ఈ మూవీకి మహారాజా/ చక్రవర్తి టైటిళ్లను పరిశీలిస్తున్నారట. అన్ని భాషలకూ సెట్ అయ్యేలా ఉంటుందన్న కారణంతోనే వీటిలో ఏదో ఒకటిని ఫైనల్ చేయనున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం. టైటిళ్ల విషయంలో రాజమౌళి రూటే వేరని మనకు తెలిసిందే. సింహాద్రి, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి యూనిక్ టైటిల్స్ పెడుతుంటారు.

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్, రిచ్ ప్రెజెన్స్ ఉండేలా ఈ సినిమా కోసం ప్రముఖ హాలీవుడ్ స్టూడియోతో చేతులు కలిపేందుకు రాజమౌళి ఎదురుచూస్తున్నట్లు చాలా రోజుల క్రితం వార్తలు వచ్చాయి. తాజాగా ఫేమస్ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ ఫ్లిక్స్.. జక్కన్నకు సహకరించడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ బృందం రాజమౌళి, మహేశ్ ను కలిసిందట. ఇదే కనుక నిజమైతే ఈ మూవీకి హాలీవుడ్ లో భారీగా మార్కెటింగ్ జరుగుతుంది.

రాజమౌళి - మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా, కమల్ కన్నన్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా, మోహన్ బింగి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.