ఈడీ నోటీసులు.. మహేష్ బాబు రిక్వెస్ట్ ఏమిటంటే..
సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు సంబంధించిన ఆర్థిక అక్రమాల కేసులో ప్రముఖ నటుడు మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి నోటీసులు వచ్చిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 27 April 2025 11:39 AMసురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు సంబంధించిన ఆర్థిక అక్రమాల కేసులో ప్రముఖ నటుడు మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి నోటీసులు వచ్చిన విషయం తెలిసిందే. సురానా గ్రూప్ సంస్థలపై ఇటీవల ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ దర్యాప్తులో భాగంగా మహేష్ బాబు కూడా విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసు అందింది. ఇక మహేష్ ఈ విషయంలో అధికారులకు ఒక వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ సంస్థలపై ఈడీ చేపట్టిన దర్యాప్తులో వేల కోట్ల రూపాయల బ్యాంకు మోసాలు బయటపడ్డాయి. పలు షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి, అక్రమ లావాదేవీలు జరిపినట్టు అధికారులు గుర్తించారు. నరేంద్ర సురానా, సతీష్ సురానా వంటి ప్రముఖుల ఇళ్లపై సోదాలు నిర్వహించగా, భారీగా నగదు, విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ముంబై, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో సంస్థల లింకులు వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసులో సాయిసూర్య డెవలపర్స్ సంస్థతో మహేష్ బాబు సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. అదే కారణంగా ఈడీ ఆయనను విచారణకు పిలవడం జరిగింది. అయితే మహేష్ బాబు ఇప్పటికే తన పాత్ర తక్కువగానే ఉందని, తన పేరును అనవసరంగా లాగొద్దని సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో విచారణ అనంతరం పూర్తి స్థాయి క్లారిటీ రానుంది.
అయితే, మహేష్ తన సినిమా షూటింగ్ షెడ్యూల్ కారణంగా రేపు (ఏప్రిల్ 28) హాజరుకాలేనని తెలియజేసి, మరో తేదీ మంజూరు చేయాలని ఈడీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మహేష్ బాబు ఈడీ అధికారులకు మెయిల్ ద్వారా సమాచారం పంపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు SSMB29 సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అందువల్ల విచారణకు హాజరు కావడానికి కొంత గడువు కోరినట్టు సమాచారం.
ఈడీ అధికారులు కూడా మహేష్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, కొత్త తేదీ ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా, మహేష్ బాబు ఈడీ విచారణకు హాజరు కావాల్సిన అంశం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఆయన సమాధానాలతో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయో చూడాల్సి ఉంది.