మడాక్ ఫిలింస్కు హైకోర్టు బిగ్ షాక్
అంతేకాదు.. తాము సినిమా ప్రచారం కోసం సుమారు కోట్లాది రూపాయలు ఖర్చు చేసామని కూడా పీవీఆర్ కోర్టులో వాదించడం చర్చనీయాంశమైంది.
By: Tupaki Desk | 10 May 2025 9:18 PM ISTమడాక్ ఫిలింస్ వరుస విజయాలతో జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది స్త్రీ 2, ఈ ఏడాది చావా లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ఈ సంస్థ అందించింది. ఇవి రెండూ భారీ వసూళ్లతో సంచలనం సృష్టించాయి. అయితే మడాక్ ఫిలింస్ ఇప్పుడు రాజ్ కుమార్ రావు నటించిన `భూల్ చుక్ మాఫ్`ని ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేయాలని నిర్ణయించడం వివాదాస్పదమైంది. అప్పటికే సినిమా టికెట్లను విక్రయించిన పీవీఆర్ మడాక్ ఒప్పందం మీరిందని, దీని వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హైకోర్టును ఆశ్రయించింది. అంతేకాదు.. తాము సినిమా ప్రచారం కోసం సుమారు కోట్లాది రూపాయలు ఖర్చు చేసామని కూడా పీవీఆర్ కోర్టులో వాదించడం చర్చనీయాంశమైంది.
అయితే కోర్టులో మడాక్ కి వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. శుక్రవారం బాంబే హైకోర్టు, థియేటర్లలో విడుదలకు ఒప్పందాన్ని నిర్మాతలు ఉల్లంఘించారని పేర్కొంటూ పివిఆర్ ఐనాక్స్ కు మధ్యంతర ఉపశమనం కల్పించింది. ఓటీటీలో స్ట్రీమింగు కాకుండా కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. మడాక్ సంస్థతో వివాదం కారణంగా, అత్యవసర పరిస్థితిని పేర్కొంటూ పివిఆర్ హైకోర్టును ప్రత్యేక విచారణకు ఆశ్రయించింది. అయితే మాడాక్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించిన ఇతరులు (పీవీఆర్ వాళ్లు కాకుండా) ఒక రోజు ముందే, అంటే 6 మే 2025 నాటికి ఒప్పందం ముగిసిందని వాదించినా కోర్టు అంగీకరించలేదు.
పీవీఆర్ ముందస్తుగా టికెట్లు సేల్ చేసిందని, అలాగే ప్రకటనల కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేసిందని కోర్టు పేర్కొంది. ఒప్పందం రద్దు పేరుతో చివరి నిమిషంలో థియేట్రికల్ రిలీజ్ ని దాటవేయడం కుదరదని కోర్టు తీర్పును వెలువరించింది. దీంతో ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఎనిమిది వారాలకు మాత్రమే ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేయాల్సి ఉంటుంది.
చివరి నిమిషంలో థియేట్రికల్ రిలీజ్ ని రద్దు చేయడం కుదరదు. సినిమా యజమాని ఏ వేదికపై ఎలా విడుదల చేయాలో నిర్ణయించుకోగలడనే వాదనలు ఆమోదయోగ్యం కాదు.. ఎందుకంటే వ్యక్తులకు ముగిసినా కానీ, ఒప్పందాన్ని ఉల్లంఘించే హక్కు లేదు. రెండు వారాల్లోగా మాడ్డాక్ నిర్మాతల నుండి కోర్టు సమాధానం కోరింది. జూన్ 16న ఈ కేసుపై తదుపరి విచారణ జరగనుంది.