అదే నిజమైతే టాలీవుడ్లో బేబమ్మ మళ్లీ బిజీ..!
వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన 'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్కి హీరోయిన్గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి.
By: Tupaki Desk | 29 March 2025 5:26 AMవైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన 'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్కి హీరోయిన్గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈ ఉత్తరాది ముద్దుగుమ్మ చిన్న వయసులోనే స్టార్డం దక్కించుకుంది. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో ఎక్కువ సినిమాలు చేసింది. అంతే కాకుండా ఎక్కువ విజయాలను సొంతం చేసుకుంది. మొదటి సినిమాతోనే వంద కోట్ల వసూళ్ల క్లబ్లో చేరిన హీరోయిన్గా అరుదైన ఘనత దక్కించుకుంది. ఉప్పెనలో బేబమ్మగా నటించి అలరించిన కృతి శెట్టి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్లో సందడి చేసింది. వరుసగా మూడు విజయాలను సొంతం చేసుకున్న కృతి ఆ తర్వాత సినిమాలతో ఫ్లాప్స్ను చవిచూసింది.
టాలీవుడ్లో వరుసగా నాలుగు ఐదు ఫ్లాప్స్ పడటంతో ఆఫర్లు కరువయ్యాయి. కృతి టాలీవుడ్లో చివరగా శర్వానంద్తో కలిసి మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కూడా కమర్షియల్గా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ను సొంతం చేసుకోలేక పోయింది. టాలీవుడ్లో కృతి శెట్టికి ఇక ఆఫర్లు దక్కడం కష్టమే అనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తమిళ్ సినీ ఇండస్ట్రీలో మూడు సినిమాల్లో నటిస్తుంది. గత ఏడాది ఈమె మలయాళంలో చేసిన ఏఆర్ఎం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో మలయాళంలో మరో ఆఫర్ను దక్కించుకుంది. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతర భాషల్లోనే ఈమె బిజీ కావాల్సిందే కానీ టాలీవుడ్లో ఆఫర్లు దక్కించుకోవడం కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఇలాంటి సమయంలో సినీ వర్గాల్లో కృతి శెట్టికి ఓ తెలుగు సినిమాలో నటించే అవకాశం వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. అది కూడా నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందబోతున్న 'ది ప్యారడైజ్' సినిమాలో అనే ప్రచారం జోరుగా సాగుతోంది. దసరా సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉన్నాడు. ఆ మధ్య సినిమా నుంచి వచ్చిన టీజర్ అంచనాలను అమాంతం పెంచేసింది. ముఖ్యంగా నాని పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. నానిని మరీ అంత బోల్డ్ పాత్రలో చూడగలమా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ సినిమాలో నానికి జోడీగా కృతి శెట్టిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.
నానితో కృతి శెట్టి గతంలో శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించగా కృతి శెట్టి సైతం మరో హీరోయిన్ రోల్లో నటించింది. నాని, కృతి శెట్టి మధ్య కెమిస్ట్రీకి మంచి స్పందన దక్కింది. అందుకే ది ప్యారడైజ్ సినిమాలో కృతి శెట్టిని ఎంపిక చేసే విషయమై శ్రీకాంత్ ఓదెల చర్చలు జరుపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు దర్శకుడు శ్రీకాంత్ తుది నిర్ణయం తీసుకోలేదు. షూటింగ్ ప్రారంభంకు ఇంకాస్త సమయం ఉన్న కారణంగా అప్పటి వరకు హీరోయిన్ విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశాలు లేవు.
ఒకవేళ నాని సినిమాలో కనుక కృతి శెట్టికి అవకాశం దక్కితే కచ్చితంగా టాలీవుడ్లో మరోసారి బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాంత్ ఓదెలకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో కృతి శెట్టికి ది ప్యారడైజ్ సినిమా విడుదలకు ముందే ఒకటి రెండు తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి నిజంగానే కృతి శెట్టికి ది ప్యారడైజ్ సినిమాలో అవకాశం ఉంటుందా అనేది చూడాలి.