Begin typing your search above and press return to search.

మెగాస్టార్‌ కి వాళ్లంటే చాలా భయం!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్‌ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్‌ 15 కు హోస్టింగ్ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   22 Aug 2023 9:12 AM GMT
మెగాస్టార్‌ కి వాళ్లంటే చాలా భయం!
X

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్‌ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్‌ 15 కు హోస్టింగ్ చేస్తున్నారు. ఈ షో జరుగుతున్నన్ని రోజులు కూడా అమితాబ్ ఏదో ఒక వార్తతో మీడియాలో ఉంటూనే ఉంటారు. సోషల్‌ మీడియాలో అమితాబచ్చన్‌ వైరల్‌ అవుతూనే ఉంటారు. షో లో అమితాబ్‌ హాట్ సీట్‌ లో ఉన్న వారికి ప్రశ్నలు వేస్తూనే వారి నుండి పలు ఆసక్తికర విషయాలు రాబడుతూ ఉంటాడు.

హాట్ సీట్‌ లో ఉన్న వారితో బచ్చన్‌ మాట్లాడే విధానం, వారితో సంభాషణ కొనసాగించే విధానం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అవతలి వ్యక్తి తో మాట్లాడుతున్న సమయంలో తన గురించి కూడా అమితాబచ్చన్‌ మాట్లాడటం, తన కుటుంబం గురించి కూడా మాట్లాడుతూ సరదా సంభాషణ కొనసాగించడం, సీరియస్ చర్చ సాగించడం చేస్తూ ఉంటారు.

తాజా ఎపిసోడ్‌ లో కునాల్ సిన్ దోడియా అనే వ్యక్తి హాట్‌ సీటుకు వచ్చాడు. ఆయన అహ్మదాబాద్ కు చెందిన పోలీస్ ఫోర్స్ లో విధులు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా మానవ హక్కుల విభాగంలో కూడా విధులు నిర్వహిస్తున్నారు. కునాల్‌ హాట్ సీట్‌ కు వచ్చిన వెంటనే అమితాబచ్చన్‌ సరదాగా వ్యాఖ్యలు చేశారు.

అమితాబచ్చన్ మాట్లాడుతూ సార్ మిమ్మల్ని చూస్తే నాకు భయంగా ఉంది. పోలీసులను చూసినప్పుడు నాకు భయంగా ఉంటుందని అమితాబ్ సరదాగా అన్నారు. అప్పుడు కునాల్‌ స్పందిస్తూ మీకు ఎందుకు పోలీసులు అంటే భయం. మేము కూడా మీ లాగే సాధారణ మనుషులం కదా అన్నాడు.

పోలీసు వారు ఎప్పుడు రోడ్డు మీద కారు ఆపుతారో అని, కారు ఆపి నీ పేరు ఏంటి, బయటకు రా అంటారేమో అని భయపడుతున్నాను. నోరు తెరిచి ఊదమంటారని భయం. మీరు తాగి ఉన్నారని ఎక్కడ అంటారో అని నాకు భయం అంటూ అమితాబచ్చన్ సరదాగా సమాధానం ఇచ్చారు.

అమితాబ్ మరియు కునాల్‌ ల సంభాషణలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆ సమయంలో సెట్‌ లో ఉన్న వారు అంతా కూడా పెద్దగా నవ్వేయగా, టీవీలో చూసిన వారు కూడా ఆ సందర్భంను బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో కూడా క్లిప్పింగ్‌ బాగా వైరల్ అవుతోంది.