Begin typing your search above and press return to search.

ఆ హీరోతో క‌లిసి ప‌ని చేసేది లేద‌ని తెగేసి చెప్పాడు కానీ..!

అత‌డు భవిష్య‌త్ లో కార్తీక్ ఆర్య‌న్ తో సినిమా చేసేందుకు ఆస్కారం లేక‌పోలేద‌ని తాజాగా మెల్ బోర్న్ సినిమా వేడుక‌ల‌ సాక్షిగా వెల్ల‌డించారు.

By:  Tupaki Desk   |   12 Aug 2023 4:08 AM GMT
ఆ హీరోతో క‌లిసి ప‌ని చేసేది లేద‌ని తెగేసి చెప్పాడు కానీ..!
X

కరణ్ జోహార్ వ‌ర్సెస్ కార్తీక్ ఆర్యన్ 'శ‌త్రుత్వ‌ ఎపిసోడ్' గురించి తెలిసిందే. క‌ర‌ణ్ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించిన‌- దోస్తానా 2లో కార్తీక్ క‌థానాయ‌కుడు కాగా జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టించింది. ఈ సినిమా కొంత భాగం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యాక కార్తీక్ ఆర్యన్ ని సినిమా నుంచి తొల‌గిస్తున్న‌ట్టు క‌ర‌ణ్ కి చెందిన నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించడం అంద‌రికీ షాకిచ్చింది. చాలా వ‌ర‌కూ కార్తీక్ పై స‌న్నివేశాల‌ను పూర్తి చేశాక ఇలా ఎందుకు చేస్తున్నారు? అత‌డితో క‌ర‌ణ్ కి వ‌చ్చిన విభేధాలు ఏమిటి? అంటూ చాలా చ‌ర్చ సాగింది. కానీ త‌న ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ నుంచి కార్తీక్ ని శాశ్వ‌తంగా తొల‌గిస్తున్నామ‌ని.. అత‌డితో భ‌విష్య‌త్ లో క‌లిసి ప‌ని చేసేది లేద‌ని తెగేసి చెప్పాడు క‌ర‌ణ్‌.. అయితే ఈ ప్ర‌క‌ట‌న‌తో దోస్తానా 2 పూర్తిగా అట‌కెక్కింది. కార్తీక్ స్థానంలో మ‌రో యువ‌హీరో ని ఎంపిక చేసుకున్నా ఇప్ప‌టికీ ఇది రిలీజ్ కాలేదు.

అదంతా అటుంచితే రాజ‌కీయాల్లో సినిమాల్లో శాశ్వ‌త శ‌త్రుత్వాలు ఉండ‌వ‌ని ఇప్పుడు ప్రూవ్ కాబోతోంది. క‌ర‌ణ్ జోహార్ మ‌న‌సు ఇప్పుడు మారింది. అత‌డు భవిష్య‌త్ లో కార్తీక్ ఆర్య‌న్ తో సినిమా చేసేందుకు ఆస్కారం లేక‌పోలేద‌ని తాజాగా మెల్ బోర్న్ సినిమా వేడుక‌ల‌ సాక్షిగా వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం మెల్‌బోర్న్‌లో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన కర‌ణ్‌- కార్తీక్ జోడీ మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు. ఆ ఇద్ద‌రూ ఒక‌రి ప‌క్క‌న‌ ఒక‌రు కూర్చుని మీడియా ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులివ్వ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ చిత్రనిర్మాత సత్యప్రేమ్ కి కథా స్టార్‌తో పోజులిచ్చిన ఫోటో ఒక‌టి ఇంత‌లోనే నెటిజ‌నుల్లో చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఈ క‌ల‌యిక‌తో కొన్ని విష‌యాల‌పైనా క్లారిటీ వ‌చ్చింది. కార్తిక్‌తో కలిసి పనిచేయడానికి తాను నిజంగా ఎదురు చూస్తున్నానని కరణ్ జోహార్ తాజా మీడియా మీట్ లో ధృవీకరించాడు.

దోస్తానా 2 చిత్రీక‌ర‌ణ‌ నిలిపివేశాక నిజానికి కరణ్ జోహార్ - కార్తీక్ ఆర్యన్ బహిరంగంగా ఎప్పుడూ కలిసి కనిపించలేదు. మెల్ బోర్న్ ఈవెంట్లో విలేకరుల సమావేశంలో కలిసి పోజులివ్వడమే కాకుండా విలేకరుల సమావేశానికి హాజరై ప్రేక్షకులను ఆశ్చర్యప‌రిచారు. విలేఖరులలో ఒకరు ఆ ఇద్దరు కలిసి పనిచేయడం గురించి ప్ర‌శ్నించారు. ఆ ప్ర‌శ్న‌కు కరణ్ ఇలా సమాధానమిచ్చాడు. "మేము ఒక ప్రయత్నం చేసాం. వివిధ కారణాల వల్ల అది ఫలించలేదు. ఇంకా ఏదో చేయాలని ముచ్చ‌టిస్తున్నాం. అది జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. నిజానికి మేమిద్దరం దాని గురించి చాలా సంతోషిస్తున్నాం" అని క‌ర‌ణ్ వ్యాఖ్యానించారు. ఇది దోస్తానా 2 గురించేనా? అని రిపోర్టర్ ప్ర‌శ్నించ‌గా... కరణ్ చమత్కారమైన సమాధానంతో ఆ ప్రశ్ననుంచి ఎస్కేప్ అయ్యాడు. "మమ్మల్ని ఏ రహస్యాలు అడగవద్దు.. మేము మీకు అబద్ధాలు చెప్పము" అని క‌ర‌ణ్ (న‌వ్వేస్తూ) వ్యాఖ్యానించాడు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... కరణ్ జోహార్ .. కార్తీక్ ఆర్యన్ ఇద్దరూ తమ ఇటీవలి విజయాల్ని ఆస్వాధిస్తున్నారు. రణ్‌వీర్ సింగ్ - అలియా భట్ జంట‌గా కరణ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' కొన్ని మూస పద్ధతులను బ్రేక్ చేసినందుకు దేశవ్యాప్తంగా ఆద‌రాభిమానాల్ని ద‌క్కించుకుంది. కార్తీక్ ఆర్య‌న్- కియారా అద్వానీ జంట‌గా నటించిన 'సత్యప్రేమ్ కి కథ' ఈ సీజ‌న్ లో బిగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఇందులో అసాధారణమైన, సున్నితమైన భర్త పాత్ర‌లో న‌టించిన కార్తీక్ కూడా ప్రేక్షకుల నుండి గొప్ప‌ ప్రశంసలు ద‌క్కించుకున్నాడు. భ‌విష్య‌త్ లో దోస్తానా 2 కోసం ఆ ఇద్ద‌రూ క‌లిసి ప‌ని చేస్తారా? లేక ఇంకేదైన కొత్త ప్రాజెక్ట్ ఈ క‌ల‌యికలో వ‌స్తుందా? అన్న‌ది వేచి చూడాలి.