ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్ ప్లాన్.. కొత్త ట్రెండ్ సెట్ అవుతుందా?
అభిమానుల కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించారు.
By: Tupaki Desk | 5 Feb 2025 11:10 AM ISTసినీ నటులకు అభిమానులంటే ఎనలేని ప్రేమ, భక్తి ఉంటుంది. కానీ వారిని కలవడానికి ప్రత్యేకంగా సమయం కేటాయించేది చాలా అరుదు. రజనీకాంత్ మాత్రం ఎప్పుడూ తన అభిమానులను కలిసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. సాధారణంగా సినిమా ప్రమోషన్స్ సమయంలో హీరోలు అభిమానులను కలుస్తారు కానీ, రజనీకాంత్ మాత్రం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అభిమానులతో సమావేశమవుతారు. చెన్నైలో ఆయన నిర్వహించే ఈ ఫ్యాన్స్ మీటింగ్లు ప్రతిసారీ ఒక సెన్సేషన్గా మారతాయి.
ఇప్పుడు అదే దారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా అడుగులు వేస్తున్నాడు. తనను కలవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించారు. అభిమానులు ఎక్కడ పడితే అక్కడ తారక్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఎన్టీఆర్ కెరీర్లో కొత్త ట్రెండ్గా మారనుందని, రజనీకాంత్ స్టయిల్లో తన అభిమానులను కలవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
తాజాగా ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు సందేశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, "అభిమానుల ప్రేమను గౌరవిస్తూ, వారికి ఓ ప్రత్యేకమైన అనుభూతిని కలిగించేలా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. కానీ దీనికి సంబంధించిన అన్ని అనుమతులను పొందడానికి కొంత సమయం పడుతుంది. అందుకే అందరూ ఓపిగ్గా వేచి ఉండాలని కోరుతున్నాను" అంటూ వెల్లడించారు. అంతేకాదు, తనను కలవడానికి అభిమానులు చేసే ర్యాలీలు, పాదయాత్రలు అవసరం లేదని, ఎవరికీ ఇబ్బంది కలగకుండా, సమర్థవంతమైన ప్లాన్ ప్రకారం అభిమానులందరినీ కలిసేందుకు ప్రయత్నిస్తానని ఎన్టీఆర్ అన్నారు.
ఇటీవల ఎన్టీఆర్ తన సినిమాల ప్రాజెక్ట్స్తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, అభిమానులను ప్రత్యేకంగా కలవాలని నిర్ణయించడం విశేషం. ప్రస్తుతం ఆయన NTR31 ప్రీ-ప్రొడక్షన్ పనులు కొనసాగిస్తున్నారు. అలాగే బాలీవుడ్ చిత్రమైన వార్ 2 లో కూడా నటించనున్నారు. ఇలాంటి బిజీ షెడ్యూల్ మధ్య ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ఒక మీట్ ప్లాన్ చేయడం ఆయన అభిమానులకు నిజంగా గొప్ప వార్తే.
ఇప్పటికే చాలా మంది హీరోలు తమ అభిమానుల కోసం సోషల్ మీడియాలో సందేశాలు పంపిస్తూ ఉంటారు. కానీ వీటితోనే సరిపెట్టకుండా, రజనీకాంత్ మాదిరిగా అభిమానులతో ప్రత్యక్షంగా సమావేశమయ్యే ప్రయత్నం చేయడం ఎన్టీఆర్ ప్రత్యేకత. ఇది ఓ కొత్త ట్రెండ్గా మారతుందా? మరికొంతమంది హీరోలు కూడా ఈ విధంగా అభిమానులను కలిసే కార్యక్రమాలను ప్లాన్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పట్లో ఈ మీట్కు సంబంధించి మరిన్ని వివరాల కోసం వేచి చూస్తున్నారు. అయితే తారక్ చెప్పినట్లు, ఇది పెద్ద స్థాయిలో ప్లాన్ చేయాల్సిన విషయం కాబట్టి, పోలీసులు, సంబంధిత అధికారులతో సమన్వయం చేయాల్సి ఉంటుంది. అందుకే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఓపికగా ఉండాలని అభిమానులకు సూచించారు. త్వరలోనే ఈ మీట్ గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
