Begin typing your search above and press return to search.

షర్మిలను టార్గెట్ చేసిన జగన్!!

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగాల్లో వాడీ, వేడీ పెరుగుతుందనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి

By:  Tupaki Desk   |   23 Jan 2024 9:38 AM GMT
షర్మిలను టార్గెట్  చేసిన జగన్!!
X

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగాల్లో వాడీ, వేడీ పెరుగుతుందనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. స్పందించాలనుకున్న ఏ విషయంపై అయినా... ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జగన్ స్పందించి తీరుతున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థులకు వారు రియాక్ట్ అవ్వలేని రేంజ్ లో చురకలు అంటిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పై ఏపీ ముఖ్యమంతి వైఎస్ జగన్ పరోక్షంగా చురకలు వేశారు.

అవును... తాను పీసీసీ చీఫ్ అవ్వగానే ఏపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా షర్మిల తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో అభివృద్ధి లేదని ఆమె విమర్శించారు. దీంతో మైకులముందుకు వచ్చిన వైసీపీ నేతలు... అభివృద్ధి అంటే ఏమిటో ఆమెకు చెప్పే ప్రయత్నం చేశారు. తమతో వస్తే ఏపీలో జరిగిన అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చూపిస్తామని తెలియజేశారు. గ్రామలకు వెళ్తే.. అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని సూచించారు.

ఈ సమయంలో ప్రస్తుతం అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండ‌లో వైఎస్సార్ ఆస‌రా నిధుల జ‌మ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌యిన వైఎస్ జ‌గ‌న్... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ప్రధానంగా "స్టార్ క్యాంపెయినర్స్" అంటూ వరుసపెట్టి వాయించే పనికి పూనుకున్నారు. ఈ క్రమంలో పవన్, పురందేశ్వరిలతో పాటు పరోక్షంగా షర్మిలకు కూడా జగన్ చురకంటించారనే చర్చ మొదలైంది.

ఈ క్రమంలో.. ప్రజలకు ఏ మంచీ చేయకపోయినా, ఏ స్కీములూ అమలు చేయకపోయినా, కేవలం మోసాలే చేసినప్పటికీ.. చంద్రబాబుకేమో స్టార్‌ క్యాంపెయినర్లు దండిగా ఉన్నారని జగన్ అన్నారు. చంద్రబాబును భుజానికెత్తుకొని మోసే ముఠా చాలా మంది ఉన్నారని.. అయితే వారెవరూ మన రాష్ట్రంలో ఉండరని.. వాళ్ల ఇళ్లు, కాపురాలు, సంసారాలు పక్క రాష్ట్రంలోనే ఉంటాయని జగన్ స్టార్ట్ చేశారు.

ఈ సందర్భంగా... పక్క రాష్ట్రంలో పర్మినెంట్‌ రెసిడెంట్ గా ఉన్న దత్తపుత్రుడు ఒక స్టార్‌ క్యాంపెయినర్‌ అయితే, చంద్రబాబు వదినగారు పక్కపార్టీలోకి వెళ్లి ఆయనకు మరో స్టార్‌ క్యాంపెయినర్‌ గా పనిచేస్తున్నారని జగన్ దెప్పిపొడిచారు. ఇదే సమయంలో పక్క రాష్ట్రంలో శాశ్వతంగా ఉంటున్న ముగ్గురు మీడియా అధిపతులు బాబుకు పక్క రాష్ట్రాలకు చెందిన స్టార్‌ క్యాంపెయినర్లే ఉన్నారని చెప్పారు.

ఇలా పదే పదే పక్కరాష్ట్రాలకు చెందిన స్టార్ క్యాంపెయినర్లు అని జగన్ చేసిన కామెంట్‌... త‌న చెల్లి, ఏపీసీసీ చీఫ్ ష‌ర్మిల‌ను దృష్టిలో పెట్టుకునే అయ్యి ఉంటుందని.. ఆమెకే జగన్ స్మూత్ గా చుర‌క‌లు అంటించార‌నే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. కాగా... తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని.. తాను తెలంగాణ లోకల్! అని షర్మిల గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే!