Begin typing your search above and press return to search.

ఐకాన్ స్టార్ మైన‌పు విగ్ర‌హం కోసం కొల‌త‌లు ఇచ్చేశాడు

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మేడమ్ టుస్సాడ్స్- దుబాయ్ లోని మైనపు మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం కొలువు దీర‌నుంద‌ని ఇప్ప‌టికే క‌థ‌నాలొచ్చాయి.

By:  Tupaki Desk   |   6 Oct 2023 4:00 AM GMT
ఐకాన్ స్టార్ మైన‌పు విగ్ర‌హం కోసం కొల‌త‌లు ఇచ్చేశాడు
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు సిస‌లైన‌ ఐకాన్ స్టార్ గా ఎదిగాడు. టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ గానే కాదు, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గాను అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు. పుష్ప చిత్రంతో అత‌డు అసాధార‌ణ ఫీట్ ని త‌న సొంతం చేసుకున్నాడు. 90 ఏళ్ల తెలుగు సినిమా హిస్ట‌రీలో ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న తొలి తెలుగు హీరోగా ఘ‌నుతికెక్కాడు.

యాధృచ్ఛికంగా బ‌న్నీకి పెరిగిన ఇమేజ్ కి త‌గ్గ‌ట్టే ఒక్కొక్క‌టిగా త‌న వైపున‌కు న‌డిచి వ‌స్తున్నాయి. ఇందులో అత్యంత కీల‌క‌మైన‌ది మేడ‌మ్ టుస్సాడ్స్ మైన‌పు విగ్ర‌హం. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మేడమ్ టుస్సాడ్స్- దుబాయ్ లోని మైనపు మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం కొలువు దీర‌నుంద‌ని ఇప్ప‌టికే క‌థ‌నాలొచ్చాయి. ఇటీవల మేడమ్ టుస్సాడ్స్ అధికారిక X (గతంలో ట్విట్టర్) హ్యాండిల్ పుష్ప స్టార్ అల్లు అర్జున్ కొల‌త‌లు తీసుకుంటున్న వీడియోను విడుదల చేయడం ద్వారా అధికారికంగా దీనిని ధృవీకరించింది.

మేడ‌మ్ టుస్సాడ్స్ లో తన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గురించి ఇప్పుడు బ‌న్ని ఓపెన్ అయ్యాడు. మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్ రిలీజ్ చేసిన తాజా వీడియోలో 2023 చివరి నాటికి అల్లు అర్జున్ మైనపు విగ్రహం రెడీ కాబోతోంద‌ని నిర్వాహ‌కులు తెలిపారు. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో తొలిసారి జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డ్ అందుకున్న న‌టుడు.. డ్యాన్స్ మూవ్ ల‌తో ఐకాన్ స్టార్ అయిన అత‌డు త‌న మైన‌పు విగ్ర‌హంతో ముఖాముఖి కోసం సిద్ధంగా ఉన్నాడు. మునుపెన్నడూ లేని విధంగా ఈవెంట్ కోసం వేచి ఉండండి.. అని మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్ ప్ర‌క‌టించింది.

ఈ వీడియోలో బ‌న్ని కూడా త‌న సందేశం ఇచ్చాడు. "ఒక విధంగా ఇది నాకు ఊహ‌కంద‌ని అనుభవం. ఎందుకంటే నేను మేడమ్ టుస్సాడ్స్‌కి వెళ్ళినప్పుడు అక్క‌డ మైనపు బొమ్మగా కనిపిస్తానని నేను ఎప్పుడూ ఊహించను" అని అల్లు అర్జున్ వాయిస్‌లో చెప్పాడు. అతడి శ‌రీరాకృతికి సంబంధించిన ప్ర‌తి చిన్న డీటెయిలింగ్ తో మైనపు విగ్రహం కోసం కొలతలను తీసుకోవ‌డం ఈ వీడియోలో కనిపించింది. అల్లు అర్జున్ ఎప్పటిలాగే పూర్తిగా నలుపు రంగు సూట్ లో మేడ‌మ్ టుస్సాడ్స్ కి వెళ్లాడు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. సుకుమార్ దర్శకత్వంలోని 'పుష్ప 2' షూటింగ్‌లో బ‌న్ని బిజీగా ఉన్నారు. మోస్ట్ అవైటెడ్ పుష్ప 2 ఆగస్ట్ 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తర్వాత త‌న కెరీర్ 22వ సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయ‌నున్నాడు. దీనికి తాత్కాలికంగా AA 22 అని పేరు పెట్టారు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతోను ఓ సినిమా చేస్తాడు. ఇది పూర్తి మాస్ యాక్షన్ క‌థాంశంతో తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం.