శత్రువుతో మళ్లీ హృతిక్ ఢీ
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ క్రిష్ 4కి దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ ఇటీవలే దీనిని అధికారికంగా ప్రకటించారు.
By: Tupaki Desk | 10 April 2025 5:27 PMబాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ క్రిష్ 4కి దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ ఇటీవలే దీనిని అధికారికంగా ప్రకటించారు. ఆదిత్య చోప్రాతో కలిసి రాకేష్ రోషన్ ఈ సినిమాకి అత్యంత భారీ బడ్జెట్ ని ఖర్చు చేయనున్నారు. సాధారణ బడ్జెట్లతో సూపర్ మేన్ సినిమాలు తెరకెక్కించినా ప్రజలు చూడరని భావించడం వల్ల తాను ఇంతకాలం వేచి చూసానని తెలిపిన రాకేష్ రోషన్ క్రిష్ 4 కోసం 1000 కోట్లు అంతకుమించి బడ్జెట్ ఖర్చు చేస్తారని అంచనా వేస్తున్నారు.
ఆసక్తికరంగా ఈ సినిమాలో నటించే తారల ఎంపిక ఉత్కంఠను పెంచుతోంది. ఈ సినిమాలో రేఖ, ప్రీతి జింతా, ప్రియాంక చోప్రా లాంటి ఫ్రాంఛైజీ నాయికలు తిరిగి నటిస్తారని కథనాలొస్తున్నాయి. అంతేకాదు.. క్రిష్ 3లో విలన్ గా నటించిన కంగన రనౌత్ క్రిష్ 4లోను నటించనుందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. బద్ధ శత్రువుల మధ్య ఆన్ స్క్రీన్ వైరం రక్తి కట్టించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. క్రిష్ 3 చిత్రీకరణ సమయంలోనే హృతిక్ తో గొడవలు పెట్టుకున్న కంగన ఆ తర్వాత చాలా రచ్చ చేసింది. ఇప్పుడు మళ్లీ గొడవలు వదిలేసి, అదే పంచన చేరడం ఆశ్చర్యపరిచేదే. ఈ చిత్రంలో నోరా ఫతేహి కీలక పాత్రలో నటించే వీలుందని చెబుతున్నారు.
అయితే ఇప్పటివరకూ కాస్టింగ్ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ సినిమాని అవెంజర్స్ ఎండ్ గేమ్ రేంజులో భారీ వీఎఫ్ఎక్స్ తో తెరకెక్కించనున్నారు. సినిమా కాన్సెప్ట్ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రక్తి కట్టిస్తుందని, ప్రపంచంతో పాటు, మానవ మనుగడ ప్రమాదంలో పడినప్పుడు కాపాడేందుకు వచ్చే సూపర్ మేన్ గా క్రిష్ 4 కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ సినిమాలో హృతిక్ మూడు పాత్రలు పోషిస్తారు. హీరోగా, హీరో తండ్రిగా, విలన్ గాను నటిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.