సినిమా చూసి మాజీ భార్యకు క్షమాపణ చెప్పిన స్టార్ డైరెక్టర్
తాప్సి, దియా మీర్జా, కముద్ మిశ్రా, రత్నా పాఠక్ షా ప్రధాన పాత్రల్లో అనుభవ్ సిన్హా దర్శకత్వంలో వచ్చిన 'థప్పడ్' సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి.
By: Tupaki Desk | 5 April 2025 9:00 PM ISTతాప్సి, దియా మీర్జా, కముద్ మిశ్రా, రత్నా పాఠక్ షా ప్రధాన పాత్రల్లో అనుభవ్ సిన్హా దర్శకత్వంలో వచ్చిన 'థప్పడ్' సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. 2021లో ఏకంగా ఏడు ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఆడవారిని గౌరవించడం తో పాటు, వారికి సమాజంలో దక్కాల్సిన గుర్తింపును గురించి తెలియజేస్తూ సాగే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ సినిమా గురించి ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా మాట్లాడుతూ గొప్ప సినిమా అన్నారు. అంతే కాకుండా సినిమా చూసిన తర్వాత తన జీవితంలో ఉన్న మహిళలు అందరికీ క్షమాపణలు చెప్పాడు.
ముఖ్యంగా తన మాజీ భార్యకు హన్సల్ మెహతా క్షమాపణలు చెప్పాడు. తాను ఎప్పుడూ ఆమెకు క్షమాపణలు చెప్పాలని అనుకోలేదు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత నా జీవితంలో ఉన్న మహిళలు అందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని భావించినట్లు మెహతా అన్నాడు. ఆ సినిమా తనను చాలా ప్రభావితం చేసిందని, మహిళల గొప్పతనం తెలియజేసిందని ఆయన చెప్పుకొచ్చాడు. ప్రతి సన్నివేశం లోతుగా ఆలోచించే విధంగా ప్రేరేపించింది. తాను ఇప్పుడు గొంతు విప్పి నిజాలు మాట్లాడటానికి కారణం ఈ సినిమా అని కూడా మెహతా చెప్పుకొచ్చాడు. థప్పడ్ వంటి జీవితాలు లైఫ్ చేంజింగ్ మాత్రమే కాదని, సొసైటీ చేజింగ్ సినిమాలు అనే అభిప్రాయంను ఆయన వ్యక్తం చేశారు.
2020 సంవత్సరంలో కరోనా సమయంలో 'థప్పడ్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా ప్రభావం ఇంకా అప్పటికీ తీవ్ర రూపం దాల్చక పోవడంతో థియేటర్లో ఒక మోస్తరు వసూళ్లు నమోదు అయ్యాయి. చిన్న బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాకు తగ్గట్లుగా వసూళ్లు నమోదు అయ్యాయి. అయితే ఓటీటీలో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. కరోనా సమయంలో ఓటీటీలో ఈ సినిమాను ఎక్కువ మంది చూశారు అనేది టాక్. ఆడవారి పట్ల ప్రతి ఒక్కరూ గౌరవంగా ఉండాలి అనే మెసేజ్తో కూడిన కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించడం జరిగింది. తాప్సి అద్భుతంగా నటించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న విషయం తెల్సిందే.
థప్పడ్ కథ విషయానికి వస్తే... పావిల్, తాప్సి దంపతులు. తమ వైవాహిక జీవితంలో పావిల్ తన ఆధిపత్యం కొనసాగాలని బలంగా కోరుకుంటాడు. పావిల్కి ప్రమోషన్ వచ్చి ఫారిన్ వెళ్లి సెటిల్ అవ్వాలని నిర్ణయించుకుంటాడు. అందుకు కొన్ని రోజుల ముందు ఒక ఇంట్లో జరిగే కార్యక్రమంకు తాప్సి, పావిల్ వెళ్తారు. అక్కడ కొన్ని కారణాల వల్ల తాప్సిపై పావిల్ చేయి చేసుకుంటాడు. అంతమంది ముందు పావిల్ చేయి చేసుకోవడంతో తాప్సి ఆత్మగౌరవ విషయంగా భావిస్తుంది. తన ఆత్మగౌరవంకు భగం కలిగించాడని పావిల్కు విడాకులు ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. దాంతో తాప్సిని సమాజంలో జనాలు ఏమన్నారు, చివరకు ఏం జరిగింది అనేది కథ.