Begin typing your search above and press return to search.

జీకే టీమ్ కు మహేశ్ పార్టీ.. ఆ ఇద్దరు ఎక్కడ మరి?

హైద‌రాబాద్‌లోని త‌న ఇంట్లో జీకే టీమ్ కు స‌క్సెస్ పార్టీ ఇచ్చారు మ‌హేశ్‌. ఈ పార్టీలో శ్రీలీల‌, మీనాక్షితో పాటు మ‌హేశ్ భార్య న‌మ్ర‌త‌, కూతురు సితార కూడా మెరిశారు.

By:  Tupaki Desk   |   16 Jan 2024 5:59 AM GMT
జీకే టీమ్ కు మహేశ్ పార్టీ.. ఆ ఇద్దరు ఎక్కడ మరి?
X

గుంటూరు కారం సినిమాలో ఫుల్ మాస్ యాక్షన్ రోల్ లో క‌నిపించి అభిమానుల‌ను ఖుషీ చేశారు సూపర్ స్టార్ మ‌హేశ్‌బాబు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిందీ చిత్రం. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీకి త‌మ‌న్ సంగీతం అందించారు. బాక్సాఫీస్ వ‌ద్ద మిక్స్‌డ్ టాక్ అందుకున్న ఈ చిత్రం.. రిలీజైన మూడు రోజుల్లోనే రూ.164 కోట్ల మేర రాబ‌ట్టింది.


దీంతో సంక్రాంతి పండ‌గ రోజే స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకుంది గుంటూరు కారం టీమ్. హైద‌రాబాద్‌లోని త‌న ఇంట్లో జీకే టీమ్ కు స‌క్సెస్ పార్టీ ఇచ్చారు మ‌హేశ్‌. ఈ పార్టీలో శ్రీలీల‌, మీనాక్షితో పాటు మ‌హేశ్ భార్య న‌మ్ర‌త‌, కూతురు సితార కూడా మెరిశారు. అందుకు సంబంధించిన ఫోటోల‌ను మ‌హేశ్ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా వైర‌ల్‌గా మారాయి. శ్రీలీల, మీనాక్షి క్యూట్ లుక్స్ తో అట్రాక్ట్ చేస్తున్నారు.


ఈ పార్టీకి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, మహేశ్ సన్నిహితుడు మెహర్ రమేశ్ తమ సకుటుంబ సపరివార సమేతంగా హాజరయ్యారు. వీరితోపాటు దిల్‌ రాజు సోదరుడు శిరీష్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈరోజు కూడా పార్టీ కంటిన్యూ కానుందట. గుంటూరు కారం మూవీ టెక్నీషియన్లు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు పార్టీ ఇవ్వనున్నారట మహేశ్.

నిన్న జరిగిన పార్టీలో సెల‌బ్రిటీలంద‌రూ సంక్రాంతి పండుగను పుర‌స్క‌రించుకుని సంప్ర‌దాయ దుస్తుల్లో మెర‌వ‌డం విశేషం. అయితే ఈ పార్టీకి త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, త‌మ‌న్ ఇద్ద‌రూ డుమ్మా కొట్టిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఇద్ద‌రు ఎక్క‌డ‌? అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఫొటోల్లో వారిద్దరు ఎక్కడా కనిపించడం లేదు.

మహేశ్- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా కంటే కూడా భారీ ఓపెనింగ్స్‌ ను రికార్డ్ చేసింది గుంటూరు కారం. మహేశ్ కు మంచి పట్టు ఉన్న నైజాం ఏరియాలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. తొలిరోజు 16.09 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. రెండో రోజు- 5.70 కోట్లు, మూడో రోజు- 5.82 కోట్లు, నాలుగో రోజు 6.90 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

నాలుగో రోజు కలెక్షన్లు భారీగా పెరగడం మహేశ్ సత్తాకు అద్దం పట్టింది. ఏపీలో ఈ నాలుగు రోజుల్లో 50 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్‌ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల మార్క్‌ను దాటాయి గుంటూరు కారం కలెక్షన్స్. వరల్డ్ వైడ్ రూ.164 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత మహేశ్.. రాజమౌళి దర్శకత్వంలో మూవీ చేయనున్నారు.