ఘాటీ రిలీజ్ ఆలస్యం.. మేకర్స్ ఏమంటున్నారంటే..
‘ఘాటీ’ కేవలం ఒక సినిమా కాదని, ఇది పర్వతాల ప్రతిధ్వని, అడవుల గాలి, రాళ్లు, నేలలతో ముడిపడిన కథ అని పేర్కొన్నారు.
By: Tupaki Desk | 5 July 2025 6:28 PM ISTపాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా 'ఘాటీ'. ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తుండటం, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండటం వలన ఈ సినిమాపై మొదటినుంచి భారీ అంచనాలున్నాయి. అయితే గతంలో ప్రకటించిన విడుదల తేదీలు వాయిదాపడుతూ రావడం వల్ల అభిమానుల్లో కొంత అసహనం మొదలైంది. తాజాగా జూలై 11 విడుదల తేదీగా ప్రకటించినా, ఇప్పుడు మరోసారి సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటి వరకు ట్రైలర్ విడుదల కాకపోవడం, ప్రమోషన్లలో ఏ విధమైన ఊపు కనిపించకపోవడంతో సినిమాపై మళ్లీ డౌట్లు మొదలయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో మేకర్స్ ఓ ఎమోషనల్ నోట్ రిలీజ్ చేశారు. యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా ఈ ప్రకటనను షేర్ చేశారు. ‘‘సినిమా ఓ ప్రవహించే నది లాంటిది. ఒక్కోసారి పరుగులు తీస్తుంది, ఒక్కోసారి లోతు కోసం ఆగుతుంది,’’ అంటూ ప్రారంభమైన ఈ ప్రకటన కాస్త వైరల్ అవుతుంది.
‘ఘాటీ’ కేవలం ఒక సినిమా కాదని, ఇది పర్వతాల ప్రతిధ్వని, అడవుల గాలి, రాళ్లు, నేలలతో ముడిపడిన కథ అని పేర్కొన్నారు. ప్రతి ఫ్రేమ్ను, ప్రతి శ్వాసను గౌరవించేందుకు కొంత సమయం పట్టవచ్చని, కానీ ఇది చివరికి ప్రేక్షకులకు మరింత మధుర అనుభవం అందిస్తుందని వారు పేర్కొన్నారు.
ఈ ఆలస్యం వల్ల చిత్రం మీద ఉన్న బజ్ తగ్గిపోతుందా అనే సందేహాలు ఉన్నప్పటికీ, మేకర్స్ చెప్పిన భావోద్వేగ నోట్ కొంత భరోసా కలిగించింది. "మీ ప్రేమ, ఓర్పుకు ధన్యవాదాలు. ఈ కఠినమైన మార్గాల్లో మా వెంట నడిచినందుకు కృతజ్ఞతలు. మళ్లీ పర్వతాలు పిలిచే దాకా... మేము మీవారమే" అని ముగించిన ఈ సందేశం... చిత్ర బృందం సినిమా మీద ఎంత ప్రేమగా పని చేస్తుందో చూపుతోంది.
ఈ సందర్భంగా ‘ఘాటీ’ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు, విడుదల తేదీపై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశముందని సమాచారం. కాగా, అనుష్క ఈ సినిమాతో దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత స్క్రీన్పై కనిపించనుండటంతో అభిమానులలో మళ్లీ ఆసక్తి పెరిగింది. మొత్తానికి, మేకర్స్ శాంతంగా, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాను రూపొందిస్తున్నారని ఈ ఎమోషనల్ నోట్ స్పష్టం చేసింది. మరి ఇది అనుకున్నట్టే విజయాన్ని అందుకుంటుందో లేదో వేచి చూడాలి.
