Begin typing your search above and press return to search.

అన్నీ వ‌దిలి ఎటో వెళ్లిపోవాల‌నుంద‌న్న స్టార్ డైరెక్ట‌ర్

గత ఆరేళ్లుగా ఈ సినిమా అనేక వాయిదాలు పడుతూ వస్తోంది. ఇది తన హృదయాన్ని కల‌చివేస్తోంది. స్థిరంగా మునిగిపోతున్న వేద‌న‌తో ఉన్నాన‌ని కూడా చెప్పాడు.

By:  Tupaki Desk   |   29 Feb 2024 4:34 AM GMT
అన్నీ వ‌దిలి ఎటో వెళ్లిపోవాల‌నుంద‌న్న స్టార్ డైరెక్ట‌ర్
X

త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ గౌతమ్ మీనన్ తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. ఆయ‌న తెర‌కెక్కించిన ధృవ‌న‌క్ష‌త్రం (ధృవ‌న‌చ్చ‌తిరం) చాలా కాలంగా రిలీజ్ కి నోచుకోక పెండింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. 24 నవంబర్ 2023న విడుదల కావాల్సిన 'ధృవ నచ్చతిరమ్' మళ్లీ వాయిదా పడింది. ఇటీవలి ఇంటర్వ్యూలో, గౌత‌మ్ మాట్లాడుతూ.. ఈ చిత్రం ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనేక సంవత్సరాలుగా రిలీజ్ కాక‌పోవ‌డం క‌ల‌చివేస్తోంద‌ని అన్నారు.

గ‌త ఏడాది నవంబర్‌లో విడుదలకు కొన్నిరోజుల ముందు గౌతమ్ మీనన్ ఆర్థిక ఇబ్బందులు తొల‌గిపోయాయ‌ని.. ఈ చిత్రం క‌చ్ఛితంగా థియేటర్లలోకి వస్తుందని హామీ ఇచ్చారు. అయితే సమస్యలు అంతంత మాత్రంగానే ఉండడంతో మళ్లీ వాయిదా వేయాల్సి వచ్చింది. గత ఆరేళ్లుగా ఈ సినిమా అనేక వాయిదాలు పడుతూ వస్తోంది. ఇది తన హృదయాన్ని కల‌చివేస్తోంది. స్థిరంగా మునిగిపోతున్న వేద‌న‌తో ఉన్నాన‌ని కూడా చెప్పాడు.

ఇది హృదయ విదారకంగా ఉంది. నాలో ఒక అశాంతి ఉంది. అది నిజంగా నా కుటుంబాన్ని ఆందోళనకు గురిచేసింది. నా పని గురించి ఎప్పుడూ చింతించని నా భార్య 20-25 రోజులు నాతో ఉండటాన్ని గ‌మ‌నించాను. ఎందుకంటే ఆమె నిజంగా (నాలో) ఏదో ఒత్తిడిని గ‌మ‌నించింది అని అన్నారు. త‌న‌కు ఎటో వెళ్లిపోవాల‌నుంద‌ని, అయితే కొత్త పెట్టుబడిదారులకు జవాబుదారీగా ఉండడం వల్ల అలా చేయ‌లేద‌ని చెప్పాడు. ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్ల జాబితాలోకి వారిని చేర్చాల్సి వచ్చిందని.. అది పీడకలగా అనిపించిందని.. కానీ మరికొద్ది రోజుల్లో నా సినిమా (జాషువా) ప్రేక్షకుల ముందుకు వ‌స్తుంద‌ని, అందుకోసం ఎదురు చూస్తున్నానని ఆయన అన్నారు.

ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న 'జాషువా..' కంటే ముందే చియాన్ విక్రమ్ 'ధృవ నచ్చతిరమ్' విడుదల చేయాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. వరుణ్ కమల్ క‌థానాయ‌కుడిగా గౌత‌మ్ మీన‌న్ తెర‌కెక్కించిన 'జాషువా ఇమై పోల్ కాఖా' మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో కృష్ణ, రాహేయ్ త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.