Begin typing your search above and press return to search.

వ‌రుస‌గా ఐదు ఫ్లాపులు.. ఒక్క ఛాన్స్ ప్లీజ్!

తేజస్ చిత్రం పరాజయం పాలైనప్పటికీ కంగనా రనౌత్ గ్యాప్ లేకుండా కొత్త ప్రాజెక్ట్‌కి సంత‌కం చేసేందుకు సిద్ధ‌మైంద‌ని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   11 Nov 2023 6:03 AM GMT
వ‌రుస‌గా ఐదు ఫ్లాపులు.. ఒక్క ఛాన్స్ ప్లీజ్!
X

వ‌రుస‌గా ఐదు భారీ ఫ్లాప్‌ల‌ను ఎదుర్కొంది క్వీన్ కంగ‌న‌. ఇటీవ‌లే విడుద‌లైన తేజ‌స్ వ‌ల్ల ఏకంగా 50కోట్ల న‌ష్టం త‌ప్ప‌లేద‌ని ట్రేడ్ విశ్లేషించింది. దీంతో కంగ‌న బాలీవుడ్ కెరీర్ పూర్తిగా ఇబ్బందుల్లో ఉంద‌ని కొన్ని మీడియాలు క‌థ‌నాలు అల్లుతున్నాయి. అయితే క్వీన్ కంగ‌న మాత్రం త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఖాతారు చేయ‌క‌, ఇటీవ‌ల సౌతిండియన్ సినిమాల‌పై దృష్టి సారించింది. తేజస్ చిత్రం పరాజయం పాలైనప్పటికీ కంగనా రనౌత్ గ్యాప్ లేకుండా కొత్త ప్రాజెక్ట్‌కి సంత‌కం చేసేందుకు సిద్ధ‌మైంద‌ని తెలుస్తోంది.

సర్వేష్ మేవారా దర్శకత్వం వహించిన 2023 హిందీ-భాష యాక్షన్ థ్రిల్లర్ తేజస్ దుర‌దృష్టవశాత్తూ విమర్శకుల నుండి ప్రతికూల సమీక్షలను అందుకుంది. విడుదలైన మొదటి రెండు రోజుల్లోనే బాక్స్-ఆఫీస్ వ‌ద్ద తీవ్ర నిరాశ‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సినిమా ఓపెనింగ్ డే రోజున‌ చాలా థియేటర్ ప్రదర్శనలు రద్దు చేసారు. అయితే కంగ‌న‌కు ఎన్ని ఎదురుదెబ్బ‌లు త‌గిలినా కానీ, దక్షిణాన తన తదుపరి పెద్ద ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. భైరవి అనే కొత్త చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఇది కూడా భారీ బ‌డ్జెట్ తో నిర్మించే సినిమా.. పి.వాసు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

భైరవి ప్రతీకార నేప‌థ్య కథ. పెంపుడు తండ్రి త‌న‌ తల్లిని వేధించి, హత్య చేయడం గురించిన సంచ‌ల‌న‌ నిజాన్ని కనుగొనడానికి క‌థానాయిక ఏం చేసింద‌న్న‌దే ఈ సినిమా క‌థాంశం. క‌థ‌లో డెప్త్ కి త‌గ్గ‌ట్టే ఎమోష‌న్స్ పండ‌నున్నాయ‌ని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి నిర్మాత‌లు ఎవ‌రు? అన్న‌ది ఇంకా తేల‌లేదు కానీ సౌత్ ఇండస్ట్రీ కంగనాకు మద్దతు ఇస్తోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం చంద్రముఖి 2 దర్శకుడు పి. వాసుతో కంగనా మళ్లీ కలుస్తుందనే అంచ‌నాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.

ద‌క్షిణాదిన అంతంత మాత్ర‌మే:

క్వీన్ కంగ‌న వ‌రుస ప‌రాజ‌యాల నేప‌థ్యంలో ఉత్త‌రాది ప‌రిశ్ర‌మ‌లో త‌న హ‌వాను కోల్పోయింది. అదే క్ర‌మంలో ద‌క్షిణాది చిత్రాల‌పై దృష్టి సారించింది. కానీ ఇటీవ‌ల ఇక్కడ నటించిన భారీ సినిమాలేవీ విజ‌యాలు సాధించ‌లేదు. దీంతో ఇక్క‌డా అవ‌కాశాలు మృగ్యం అయ్యాయి. చాలా అరుదుగా మాత్ర‌మే నిర్మాత‌లు కంగ‌న‌కు అవ‌కాశాలిస్తున్నారు. ప్ర‌స్తుతానికి వాటితో క్వీన్ బ‌తికిపోతోంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కంగ‌న న‌టించే త‌దుప‌రి ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. త‌దుప‌రి కంగ‌న స్వ‌యంగా నిర్మించిన ఎమ‌ర్జెన్సీ చిత్రం విడుద‌ల కావాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం కంగ‌న త‌న ఆస్తుల‌ను అమ్ముకున్నాన‌ని తెలిపింది.