Begin typing your search above and press return to search.

సల్మాన్‌పై ఫైరింగ్ కేసు: ఐదో వాడు ఏం చేశాడో తెలుసా?

తాజాగా రాజస్థాన్‌కు చెందిన ఐదో నిందితుడిని ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ మంగళవారం అరెస్టు చేసింది. అరెస్టు చేసిన నిందితుడి పేరు రఫీక్ చౌదరిగా గుర్తించారు.

By:  Tupaki Desk   |   9 May 2024 2:45 AM GMT
సల్మాన్‌పై ఫైరింగ్ కేసు: ఐదో వాడు ఏం చేశాడో తెలుసా?
X

బాలీవుడ్ కండ‌ల హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల ఘటన క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఇప్ప‌టికే న‌లుగురిని అరెస్ట్ చేసారు. తాజాగా రాజస్థాన్‌కు చెందిన ఐదో నిందితుడిని ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ మంగళవారం అరెస్టు చేసింది. అరెస్టు చేసిన నిందితుడి పేరు రఫీక్ చౌదరిగా గుర్తించారు. ఏప్రిల్ 12న స‌ల్మాన్ ముంబై అపార్ట్‌మెంట్ ప‌రిస‌రాల్లో అత‌డు రెక్కీ చేసాడు.

అరెస్టు అయిన‌ నిందితుడు ర‌ఫీక్‌ని మే 13 వరకు రిమాండ్ విధించారు. రఫీక్ చౌదరి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు.. కాల్పుల ఘటనలో పాల్గొన్న షూటర్‌లకు ఆర్థిక సహాయం అందిస్తున్నాడ‌ని ఆరోపణలు ఉన్నాయి. ర‌ఫీక్ స్వ‌యంగా తుపాకీ కాల్పుల్లో నిందితుల రెక్కీని వీడియో తీసి అన్మోల్ బిష్ణోయ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 8 - ఏప్రిల్ 11 తేదీల్లో కుర్లా ప్రాంతంలో నిందితులు ఇద్దరు షూటర్లను కలిశారని ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ ఉటంకించింది.

ఏప్రిల్ 14న ముంబై బాంద్రా ప్రాంతంలో సల్మాన్ ఖాన్ నివాసం వెలుపలకు మోటార్‌బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పుల ఘటనకు సంబంధించి షూటర్లు సాగర్ పాల్, విక్కీ గుప్తా సహా నలుగురిని ముందుగా అరెస్టు చేశారు. కాల్పుల ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించడంతో లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఈ దాడికి పాల్పడినట్లు క్లారిటీ వ‌చ్చింది.

అరెస్టయిన నిందితుల్లో ఒకరైన అనూజ్ థాపన్ ముంబై పోలీసు కస్టడీలో ఆత్మహత్యకు పాల్పడ‌టం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. థాపన్ కాల్పుల ఘటనకు తుపాకీలు బుల్లెట్లను సరఫరా చేశాడని ఆరోపించారు. సోను బిష్ణోయ్‌తో పాటు పంజాబ్ నుండి ఏప్రిల్ 26న అరెస్టు అయ్యాడు. ఏప్రిల్ 30 వరకు అత‌డిని పోలీసు కస్టడీకి పంపారు. ఏప్రిల్ 29న పోలీసులు థాపన్‌ సహా నలుగురు నిందితులను ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. అనంత‌రం కోర్టు వారిని మే 8 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. అయితే మే1న‌ క్రాఫోర్డ్‌లోని కమిషనరేట్ కాంప్లెక్స్‌లోని క్రైమ్ బ్రాంచ్ లాకప్‌లోని టాయిలెట్‌లో థాపన్ శవమై కనిపించాడు.

అనూజ్ థాపన్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ఆయన కుటుంబం బాంబే హైకోర్టును ఆశ్రయించింది. లాకప్‌లో థాపన్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు పేర్కొంటుండగా, అతని కుటుంబం ఫౌల్ ప్లే ఆరోపించింది. అతడిని చంపేశార‌ని కుటుంబీకులు ఆరోపించారు.

కస్టడీలో ఉన్న పోలీసులు థాపన్‌పై శారీరకంగా దాడి చేసి చిత్రహింసలకు గురిచేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని, థాపన్‌ను ఉంచిన లాకప్‌ను ప‌రిశీలించాల్సిందిగా పోలీసులను ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించింది.