దోస్తానా 2 : కార్తీక్ ఆర్యన్ ఎందుకు స్కిప్ కొట్టాడు?
కానీ ఇప్పుడు దోస్తానా 2ని కరణ్ తిరిగి పట్టాలెక్కించాలని భావిస్తున్నా ఇందులో కార్తీక్ నటించడం లేదని సమాచారం.
By: Tupaki Desk | 17 May 2025 2:45 AMకార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్, లక్ష్య ప్రధాన పాత్రల్లో కరణ్ జోహార్ `దోస్తానా 2`ని ప్రారంభించి చాలా కాలమే అయిన సంగతి తెలిసిందే. అయితే కొన్నాళ్ల పాటు షూటింగ్ చేసాక కరణ్ సడెన్ గా ప్రాజెక్ట్ ని ఆపేసాడు. ఆ తర్వాత కార్తీక్ ఆర్యన్ అన్ ప్రొఫెషనల్ నటుడు అంటూ ముద్ర వేసి అతడిని ప్రాజెక్ట్ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించాడు. ఈ వివాదం తర్వాత చాలా కాలం కరణ్, కార్తీక్ ఒకరికొకరు దూరంగా ఉన్నారు. కానీ ఇటీవల పాత వివాదాల్ని పక్కన పెట్టి ఆ ఇద్దరూ మళ్లీ కలిసారు.
కానీ ఇప్పుడు దోస్తానా 2ని కరణ్ తిరిగి పట్టాలెక్కించాలని భావిస్తున్నా ఇందులో కార్తీక్ నటించడం లేదని సమాచారం. అంతేకాదు.. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ స్థానంలో `ట్వల్త్ పాస్` నటుడు విక్రాంత్ మాస్సే నటిస్తాడు. జాన్వీ స్థానంలో ఒక కొత్త నటిని ఎంపిక చేయాలని కరణ్ భావిస్తున్నాడట. అలాగే మరో వారం లేదా పక్షం రోజుల్లో దర్శకుడిని కూడా ఫైనల్ చేయనున్నాడని తెలుస్తోంది.
దోస్తానా 2 పనులు కొంతకాలంగా ధర్మలో జరుగుతున్నాయి. ఇప్పటికే పరిపూర్ణమైన స్క్రిప్ట్ను మేకర్స్ రూపొందించారని తెలిసింది. ఈ చిత్రాన్ని 2026 జనవరిలో ప్రారంభించి, వచ్చే ఏడాది చివరిలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సంగీతం, కామెడీ, రొమాన్స్, డ్రామాతో ఈ చిత్రాన్ని రూపొందిస్తారు. విక్రాంత్ మాస్సే ప్రస్తుతం శ్రీ శ్రీ రవిశంకర్ బయోపిక్ పనిని పూర్తి చేస్తున్నాడు. దాని తర్వాత డాన్ 3లో నటిస్తాడు. తర్వాత దోస్తానా 2 టీమ్ కి అందుబాటులోకి వస్తాడని తెలిసింది. మరోవైపు లక్ష్య దోస్తానా 2 కోసం ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నాడని కూడా తెలుస్తోంది.