Begin typing your search above and press return to search.

దిల్ రాజు నిర్ణ‌యం.. ఇక‌పై వ్యూస్ కొనర‌ట‌

డ‌బ్బులు పెట్టి కొంటున్న వ్యూస్‌ను త‌మ సొంత మ‌నుషులే న‌మ్మ‌ట్లేదంటూ ఆయ‌న ఒక ఉదాహ‌ర‌ణ చెప్పారు.

By:  Tupaki Desk   |   11 Jun 2025 7:29 PM
దిల్ రాజు నిర్ణ‌యం.. ఇక‌పై వ్యూస్ కొనర‌ట‌
X

సినిమాకు హైప్ తీసుకురావ‌డం కోసం యూట్యూబ్‌లో వ్యూస్‌, లైక్స్ కొన‌డం టాలీవుడ్లో కొన్నేళ్ల నుంచి జ‌రుగుతున్న కామ‌న్ ప్రాక్టీస్. టీజ‌ర్‌కు ఇన్ని మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి.. ట్రైల‌ర్‌కు అన్ని లైక్స్ ప‌డ్డాయి.. పాట‌ను ఇంత‌మంది చూశారు అంటూ ఘ‌నంగా ప్ర‌క‌ట‌నలు ఇచ్చుకుని సినిమాకు హైప్ పెంచ‌డానికి చూస్తుంటారు మేక‌ర్స్. ఐతే ఈ ఫేక్ నంబ‌ర్స్ వ‌ల్ల నిజంగా ప్ర‌యోజ‌నం ఉందా అంటే ఔన‌ని చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇది గ్ర‌హించే అగ్ర నిర్మాత దిల్ రాజు.. ఇక‌పై వ్యూస్ కోసం డ‌బ్బులు ఖ‌ర్చు పెట్ట‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ విష‌యాన్ని త‌న ప్రొడ‌క్ష‌న్లో తెర‌కెక్కిన కొత్త చిత్రం త‌మ్ముడు ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్లో ఆయ‌న స్ప‌ష్టంగా చెప్పేశారు.

ఈ ట్రైల‌ర్‌తో పాటు ఇక‌పై త‌న సంస్థ నుంచి రిలీజ‌య్యే ఏ కంటెంట్‌కైనా ఒరిజిన‌ల్ వ్యూస్, లైక్సే ఉంటాయ‌ని దిల్ రాజు తేల్చి చెప్పాడు. ఇలా ఫేక్ వ్యూస్, లైక్స్ వ‌ల్ల ఎలాంటి లాభం ఉండ‌ద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. అందుకే ఇక‌పై వ్యూస్, లైక్స్ కోసం డ‌బ్బులు పెట్టొద్ద‌ని త‌న పీఆర్ టీంకు స్ప‌ష్టంగా చెప్పేసిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. మంచి కంటెంట్ ఇవ్వ‌డం మీద దృష్టిపెట్ట‌కుండా.. ఇలాంటి పీఆర్ జిమ్మిక్కులు చేయ‌డం వ‌ల్ల లాభం లేద‌ని ఆయ‌న‌న్నారు. దీని వ‌ల్ల ఒరిజిన‌ల్ ఫీడ్ బ్యాక్ నిర్మాత‌కు తెలియ‌కుండా పోతోంద‌ని.. జ‌నాలు ఏం కోరుకుంటున్నారో తెలియ‌కుండా మంచి సినిమాలు ఎలా తీస్తామ‌ని ఆయ‌న‌న్నారు.

డ‌బ్బులు పెట్టి కొంటున్న వ్యూస్‌ను త‌మ సొంత మ‌నుషులే న‌మ్మ‌ట్లేదంటూ ఆయ‌న ఒక ఉదాహ‌ర‌ణ చెప్పారు. త‌న ఇంట్లో వాళ్లే దీనికి నిజంగా ప‌ది మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయా అని ఇటీవ‌ల ఒక కంటెంట్‌కు సంబంధించి అడిగిన‌ట్లు దిల్ రాజు వెల్ల‌డించారు. అందుకే ఇలాంటివి ఇక‌పై ఆపేసి మంచి కంటెంట్ ఇవ్వ‌డం మీద ఫోక‌స్ చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని.. అలాంటి కంటెంట్ ఇచ్చిన‌పుడు మీడియా త‌మ‌కు స‌హ‌కారం అందించాల‌ని దిల్ రాజు కోరారు.

ఇక హీరోల పారితోష‌కాలు పెరిగిపోవ‌డం గురించి రాజు మాట్లాడుతూ.. త‌న‌కు మ‌హేష్, ఎన్టీఆర్, ప్ర‌భాస్ లాంటి హీరోలు ఈ విష‌యంలో ఎంతో స‌హ‌క‌రించి త‌మ‌తో చేసిన సినిమాల‌కు డ‌బ్బులు త‌గ్గించుకున్నార‌ని.. ప్ర‌స్తుత ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల దృష్ట్యా తాను హీరోలను క‌లిసి స‌మ‌స్య మీద మాట్లాడ‌బోతున్న‌ట్లు రాజు వెల్ల‌డించారు.