రాజమౌళి టీమ్ నన్ను సంప్రదించలేదు
దాదా సాహేబ్ ఫాల్కే. సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులకు ఇచ్చే అవార్డు. అయితే ఈ అవార్డు ఇవ్వడం వెనుక ఎంతో చరిత్ర ఉంది.
By: Tupaki Desk | 17 May 2025 4:50 AMదాదా సాహేబ్ ఫాల్కే. సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులకు ఇచ్చే అవార్డు. అయితే ఈ అవార్డు ఇవ్వడం వెనుక ఎంతో చరిత్ర ఉంది. ప్రముఖుడు దాదా సాహేబ్ ఫాల్కే జీవిత కథపై ఇప్పుడు బయోపిక్ తీస్తున్నారనే వార్త గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. అయితే ఈ బయోపిక్ కోసం రెండు టీమ్స్ పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది.
దర్శకధీరుడు రాజమౌళి సమర్పణలో ఎస్.ఎస్ కార్తికేయ, వరుణ్ గుప్తా నిర్మాతలుగా నితిన్ కక్కర్ దర్శకత్వంలో ఈ బయోపిక్ ను రానుందని టాలీవుడ్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ హీరోగా నటిస్తాడని కూడా టాక్. ఇదే బయోపిక్ ఆమీర్ ఖాన్- రాజ్ కుమార్ హిరాణీ కాంబినేషన్ లో రూపొందనుందని బాలీవుడ్ నుంచి వార్తలు అందుతున్నాయి.
అయితే ఈ రెండు టీమ్స్ లో ఈ బయోపిక్ ఎవరు తీస్తారనే విషయంపై ఇప్పుడో స్పష్టత వచ్చింది. దాదా సాహేబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ రీసెంట్ గా ఈ విషయంపై మాట్లాడి క్లారిటీ ఇచ్చారు. ఈ బయోపిక్ రాజమౌళి సమర్పణలో వస్తుందనే వార్తలు తాను కూడా విన్నానని, కానీ ఇప్పటివరకు ఆయన నుంచి ఎవరూ తనతో మాట్లాడింది కానీ, సంప్రదించింది కానీ లేదని తెలిపారు.
ఆమీర్- రాజ్ కుమార్ హిరాణీ టీమ్ తమతో ఎన్నోసార్లు డిస్కషన్స్ చేసిందని, వారు ఈ బయోపిక్ ను చేయాలనుకుని ముందుకు రావడం తనకెంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని, గత మూడేళ్లుగా వాళ్ల అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తనకు కాంటాక్ట్ లోనే ఉంటూ, ఎన్నోసార్లు కలిసి వివరాలన్నీ తెలుసుకున్నారని, రాజ్ కుమార్ టీమ్ చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తుండటంతో ఈ బయోపిక్ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని చంద్రశేఖర్ శ్రీకృష్ణ అన్నారు.
ఆమీర్ లాంటి గొప్ప నటుడు దాదాసాహేబ్ ఫాల్కేగా నటించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పిన ఆయన, ఆమీర్ పక్కన దాదాసాహేబ్ భార్య సరస్వతిబాయ్ ఫాల్కే పాత్రలో విద్యాబాలన్ ను తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన మాటల్ని బట్టి చూస్తుంటే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ సుమారు నాలుగేళ్లుగా జరుగుతుందని అర్థమవుతుంది. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని బాలీవుడ్ లోని ప్రముఖులు అంటున్నారు.