Begin typing your search above and press return to search.

క‌మ‌ల్‌హాస‌న్‌పై లింగుస్వామి ఫిర్యాదు

ఇలాంటి స‌మ‌యంలో ఇప్పుడు అత‌డి పేరు రాంగ్ రీజ‌న్స్ తో చ‌ర్చ‌ల్లోకొచ్చింది.

By:  Tupaki Desk   |   3 May 2024 7:23 PM GMT
క‌మ‌ల్‌హాస‌న్‌పై లింగుస్వామి ఫిర్యాదు
X

విక్ర‌మ్ లాంటి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత విశ్వ‌న‌టుడు కమల్ హాసన్ అప్పుల ఊబి నుంచి బ‌య‌ట‌ప‌డ్డ ఆనందంలో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ల‌లో న‌టిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. భార‌తీయుడు 2 -థగ్ లైఫ్ -కల్కి 2898 AD లాంటి భారీ చిత్రాలు విడుద‌ల‌ల‌కు రెడీ అవుతున్నాయి.

ఇలాంటి స‌మ‌యంలో ఇప్పుడు అత‌డి పేరు రాంగ్ రీజ‌న్స్ తో చ‌ర్చ‌ల్లోకొచ్చింది. విశ్వ‌న‌టుడిపై నిర్మాతల మండలికి ఫిర్యాదు అందింది. ప్ర‌ముఖ‌ నిర్మాతలు లింగుసామి, సుభాష్ చంద్రబోస్ ఈ ఫిర్యాదు చేశారు. 2015లో ఉత్తమ విలన్ చిత్రం కోసం కమల్ హాస‌న్- లింగుసామి -సుభాష్ కలిసి పనిచేశారని, అయితే ఈ ప్రాజెక్ట్ తమను అప్పుల్లోకి నెట్టిందని నిర్మాతల‌ ద్వయం పేర్కొంది. ఆ సినిమా పరాజయం పాలవ్వడంతో కమల్ వారితో కలిసి మరో సినిమా చేయడానికి అంగీకరించినట్లు సమాచారం.

30 కోట్ల బడ్జెట్‌తో మరో సినిమా చేయడం ద్వారా నష్టాన్ని భర్తీ చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ క‌మల్ హాస‌న్ తొమ్మిదేళ్లుగా ఎలాంటి ప్రాజెక్ట్‌ను చేయ‌లేద‌ని ఆరోపించిన‌ట్టు తెలిసింది. లింగుసామి - సుబాష్ (తిరుప‌తి బ్ర‌ద‌ర్స్) ల‌కు చెందిన‌ ప్రొడక్షన్ హౌస్ అధికారిక సోషల్ మీడియా ఖాతా లింగుసామి ఇంటర్వ్యూలలో ఒకదానిని షేర్ చేసింది. దీనిలో కమల్ `ఉత్త‌మ విల‌న్` చిత్రం స్క్రిప్ట్‌ను చాలాసార్లు మార్చారని, బాక్సాఫీస్ వైఫల్యానికి అది కార‌ణ‌మైంద‌ని అతడు వెల్లడించాడు. ఆ త‌ర్వాత `దృశ్యం` రీమేక్ కోసం క‌మ‌ల్‌ని సంప్రదించినా కానీ ఆయ‌న‌ వేరే నిర్మాతతో సినిమా చేశార‌ని లింగు స్వామి ఆరోపించారు.

`ఉత్తమ విలన్` ఫ్లాప్ సినిమా అని చెప్పడానికి ప్రొడక్షన్ హౌస్ గత నెలలో యూట్యూబ్ ఛానెల్‌ని కూడా పిలిచింది. ఈ చిత్రం వల్ల కంపెనీకి నష్టం క‌లిగింది. తీవ్ర‌ ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, దాని గురించి కమల్‌కు తెలుసునని వారు అధికారికంగా వెల్ల‌డించారు.

కమల్ హాస‌న్ రచించిన ఉత్త‌మ విల‌న్ కి రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. ఉత్తమ విలన్ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఒక నటుడి చుట్టూ న‌డిచే కామెడీ-డ్రామా. కమల్‌తో పాటు, ఈ చిత్రంలో కె విశ్వనాథ్, కె బాలచందర్, జయరామ్, ఆండ్రియా జెరెమియా, పూజా కుమార్, నాసర్ మరియు పార్వతి తిరువోతు కూడా నటించారు. ఇది 2015లో విడుద‌లైంది.

అంత‌కుముందు ఆ త‌ర‌వాత‌:

నిర్మాత‌ల మండ‌లికి స‌మ‌ర్పించిన ఫిర్యాదులో `ఉత్త‌మ విల‌న్` విడుదలకు ముందు, ఆ తర్వాత జరిగిన వరుస సంఘటనల వివరాలు ఉన్నాయి. 2013లో తిరుపతి బ్రదర్స్ కమల్ హాసన్‌తో 50 కోట్ల బడ్జెట్‌తో ఒక సినిమా కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. కమల్ ఓవర్సీస్ - నార్త్ ఇండియన్ రైట్స్ 15 కోట్లకు దక్కించుకున్నారు. అయితే, కమల్ హాసన్ కి ప్రారంభ స్క్రిప్ట్ న‌చ్చ‌క‌పోవ‌డంతో దానిని మార్చార‌ని అది త‌మ‌కు తీవ్ర న‌ష్టాలు క‌లిగించింద‌ని తిరుప‌తి బ్ర‌ద‌ర్స్ ఆరోపించారు. అలాగే దృశ్యం రీమేక్ ప్ర‌య‌త్నాలు చేస్తే, దానికి త‌మ‌తో అంగీక‌రించ‌కుండా వేరొక బ్యాన‌ర్‌లో ఆ చిత్రం చేశార‌ని వారు ఆరోపించారు. ఉత్త‌మ విల‌న్ నష్టాన్ని పూడ్చుకోవడానికి, తిరుపతి బ్రదర్స్ ఎంచుకున్న స్క్రిప్ట్ ఆధారంగా 30 కోట్ల బడ్జెట్‌తో కొత్త చిత్రంలో నటించడానికి కమల్ హాసన్ మాటల సంద‌ర్భంలో అంగీకరించారని... దీనికి లిఖితపూర్వక ఒప్పందం ఉన్నప్పటికీ, తొమ్మిదేళ్ల తర్వాత కూడా ఈ చిత్రం కార్యరూపం దాల్చలేదని వారు ఆరోపిస్తున్నారు.

నిర్మాతల మండలి జోక్యం చేసుకొని నష్టపరిహారంగా.. కమల్ హాసన్ తన కమిట్ మెంట్ నెరవేర్చేలా చూడాలని తిరుపతి బ్రదర్స్ అభ్యర్థించారు. ఈ పరిణామం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. ప్ర‌స్తుతం మండలి స్పందనపైనే అందరి దృష్టి నిలిచి ఉంది.