Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ మీద కమెడియన్ల దండయాత్ర!

టాలీవుడ్ లో వెండితెర మీద నవ్వులు పూయించిన ఎంతో మంది కమెడియన్స్.. మరో అడుగు ముందుకేసి హీరోలుగా ఆడియన్స్ ను అలరించారు.

By:  Tupaki Desk   |   21 Feb 2024 9:40 AM GMT
బాక్సాఫీస్ మీద కమెడియన్ల దండయాత్ర!
X

టాలీవుడ్ లో వెండితెర మీద నవ్వులు పూయించిన ఎంతో మంది కమెడియన్స్.. మరో అడుగు ముందుకేసి హీరోలుగా ఆడియన్స్ ను అలరించారు. ఇన్నాళ్లూ తమ కామెడీతో అందరినీ నవ్వించిన మరో నలుగురు హాస్య నటులు.. ఇప్పుడు హీరోలుగా అదృష్టాన్ని పరీక్షించుకోడానికి రెడీ అయ్యారు. వీరంతా కొన్ని రోజుల వ్యవధిలోనే బాక్సాఫీస్ బరిలో దిగుతుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా 'చార్లీ 111' అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తొలి చిత్రంలోనే స్టైలిష్ ఏజెంట్ గా దేశాన్ని కాపాడే బాధ్యత నెత్తిన వేసుకున్నాడు కిషోర్. అయితే ఇదంతా సీరియస్ మిషన్ లా కాకుండా, తనదైన కామెడీతో డీల్ చేయబోతున్నట్లు ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది. ప్రమోషన్ కంటెంట్ కు వచ్చిన రెస్పాన్స్ తో ఈ సినిమాపై జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై కామెడీ.. మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది.

‘సుందరం మాస్టర్’ అనే సినిమాతో కమెడియన్ హ‌ర్ష చెముడు (వైవా హర్ష) హీరో అవతారమెత్తుతున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఇంగ్లీష్ టీచర్ గా హర్ష నవ్వులు పూయించబోతున్నట్లు టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ మూవీలో కామెడీతో పాటుగా ఎమోషనల్ కంటెంట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 23న రిలీజ్ కాబోతోంది.

తన కామెడీ టైమింగ్ తో ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న అభినవ్ గోమటం.. ఇంతకముందు 'సేవ్ ది టైగర్స్' అనే వెబ్ సిరీస్ లో అభినవ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. తనని ఫేమస్ చేసిన 'మస్త్ షేడ్స్ ఉన్నాయి రా' అనే డైలాగ్ నే టైటిల్ గా పెట్టుకొని సినిమాని తెరకెక్కించారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కు తిరుప‌తి రావు ఇండ్ల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 24న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

వైవా హర్ష, వెన్నెల కిషోర్, అభినవ్ గోమఠంలతో పాటుగా జబరస్ధ్ కమెడియన్ రాకింగ్ రాజేష్ కూడా హీరోగా వస్తున్నాడు. తన స్వీయ నిర్మాణంలో 'కేసీఆర్‌' అనే సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తెలంగాణా ఎన్నికలకు ముందే రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు కానీ, కుదరలేదు. ఎలక్షన్ కోడ్ ఉండటంతో వాయిదా వేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇలా వరుసపెట్టి కమెడియన్లు అంతా హీరోలుగా మారి బాక్సాఫీసు మీద దండయాత్ర చేయడానికి వస్తున్నారు. వీళ్ళ కంటే ముందు హీరోగా మారిన 'కలర్ ఫోటో' సుహాస్.. ఇటీవల 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్' సినిమాతో మంచి హిట్టు కొట్టాడు. రాబోయే నెలల్లో 'ప్రసన్న వదనం', 'కేబుల్ రెడ్డి', 'గొర్రె పురాణం', 'ఆనంద్ రావ్ అడ్వెంచర్స్', 'శ్రీరంగ నీతులు' వంటి సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు సుహాస్.

ఇంతకముందు సప్తగిరి, ప్రియదర్శి, సత్య, ధన్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, రాహుల్ రామకృష్ణ, మధు నందన్ లాంటి కొందరు కమెడియన్లు హీరోలుగా సినిమాలు చేశారు. ఫుల్ టైమ్ హీరోలుగా మాత్రమే చేస్తామని కూర్చోకుండా, అవకాశం వచ్చినప్పుడు కామెడీ వేషాలు వేస్తున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను లాంటి జబర్దస్త్ కమెడియన్లు కూడా హీరోలుగా నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్నారు