Begin typing your search above and press return to search.

న‌ట‌శిఖ‌రం ANRకి జాతీయ అవార్డ్ రాక‌పోవ‌డానికి కార‌ణం?

చిరంజీవి 1988లో తన రుద్రవీణ చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్నప్పుడు ఢిల్లీలో మ‌న ప‌రిశ్ర‌మ‌కు జరిగిన అవమానకరమైన సంగ‌తుల్ని గుర్తుచేసుకున్నారు.

By:  Tupaki Desk   |   20 Sep 2023 8:28 AM GMT
న‌ట‌శిఖ‌రం ANRకి జాతీయ అవార్డ్ రాక‌పోవ‌డానికి కార‌ణం?
X

100 ఏళ్లు పైబ‌డిన‌ భార‌తీయ సినిమా ప్ర‌స్థానంలో 90 సంవ‌త్స‌రాలు పైబ‌డిన‌ చ‌రిత్ర టాలీవుడ్ కి ఉంది. ఇందులో లెజెండ‌రీ హీరోలకు కొద‌వేమీ లేదు. ఎన్టీఆర్ -ఏఎన్నార్- కృష్ణ‌- శోభ‌న్ బాబు- చిరంజీవి ఇలా దిగ్గ‌జాలంటి స్టార్లు మ‌న‌కు ఉన్నారు. ద‌శాబ్ధాల పాటు కెరీర్ ని కొనసాగించి స్టార్లుగా హృద‌యాల‌ను ఏలారు. కానీ ఇన్నేళ్ల‌లో జాతీయ ఉత్త‌మ న‌టుడు పుర‌స్కారం ద‌క్క‌లేదు. క‌నీసం దిల్లీలో తెలుగు సినిమాకి క‌నీసం గౌర‌వం అయినా ద‌క్క‌లేదు. జాతీయ (భార‌తీయ‌) సినిమా అంటే హిందీ సినిమా మాత్ర‌మే.. సౌత్ సినిమా కానే కాదు అన్న అవ‌మానం ఎదురైంది.

ముఖ్యంగా నేడు శ‌త‌జ‌యంతి జ‌రుపుకుంటున్న లెజెండ‌రీ న‌టుడు ఏఎన్నార్ కి జాతీయ అవార్డ్ రాక‌పోవ‌డానికి కార‌ణ‌మేమిటీ? అంటే దానికి స‌మాధానం యాధృచ్ఛికంగానే మెగాస్టార్ చిరంజీవి నాటి వ్యాఖ్య‌ల‌ నుంచి అర్థం చేసుకోవాలి .చిరంజీవి 1988లో తన రుద్రవీణ చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్నప్పుడు ఢిల్లీలో మ‌న ప‌రిశ్ర‌మ‌కు జరిగిన అవమానకరమైన సంగ‌తుల్ని గుర్తుచేసుకున్నారు. నిర్వాహకులు కేవలం హిందీ సినిమానే భారతీయ సినిమాగా ప్రొజెక్ట్ చేశారని, సౌత్ సినిమాలకు, స్టార్లకు సమానమైన గుర్తింపు ఇవ్వలేద‌ని కూడా ఆవేద‌న వ్య‌క్తం చేసారు. భాష ప్రాంతం అడ్డంకులను బ్రేక్ చేసినందుకు SS రాజమౌళి RRR ను ప్ర‌శంసించారు. తన చిత్రం రుద్రవీణ‌ను నర్గీస్ దత్ అవార్డుతో సత్కరిస్తున్నప్పుడు ఢిల్లీలో జరిగిన సంఘటనను చిరు గుర్తు చేసుకున్నారు.

అవార్డు ప్రదానోత్సవానికి ఒకరోజు ముందు ప్రభుత్వం సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు హై టీ ఏర్పాటు చేసింది. భారతీయ సినిమా చరిత్రను చాటిచెప్పే ఒక పోస్ట‌ర్లతో నిండిన‌ గోడను ప‌రిశీల‌న‌గా చూసాన‌ని చిరంజీవి తెలిపారు. పృథ్వీరాజ్ కపూర్ నుండి అమితాబ్ బచ్చన్ వంటి హిందీ చిత్ర పరిశ్రమ ప్ర‌ముఖుల‌కు మాత్ర‌మే ఆ గోడ‌పై స్థానం ఉంది. కానీ దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన ఐకాన్‌లు ఎవ‌రూ అక్క‌డ లేరు. ముఖ్యంగా ఏఎన్నార్ , ఎన్టీఆర్ లాంటి దిగ్గ‌జాల ఫోటోలు అక్క‌డ క‌నిపించ‌లేదు. నేను దక్షిణాది సినిమాల్లో ఎవ‌రో ఒక ప్ర‌ముఖుడి ఫోటో ఒకటి చూడాలనే ఆశతో నడుస్తూనే ఉన్నాను. అయితే అందులో జయలలితతో ఎంజీఆర్ ఉన్న స్టిల్, ప్రేమ్ నజీర్ ఫోటో మాత్రమే ఉంది అని చిరంజీవి అన్నారు.

ఈ గోడ‌పై న‌ట‌దిగ్గ‌జం ఏఎన్నార్ లాంటి వారి పోస్ట‌ర్ ని కూడా చూడ‌లేక‌పోయాన‌ని చిరు అన్నారు. ఎన్‌టీ రామారావు, నాగేశ్వరరావు, రాజ్‌కుమార్‌, విష్ణువర్ధన్‌, శివాజీ గణేశన్‌ వంటి దిగ్గజాలకు అక్క‌డ గౌర‌వం ద‌క్క‌లేదు. తెలుగు పరిశ్రమలోని దిగ్గజ సినీ నిర్మాతలు కూడా గుర్తింపు పొందలేదని చిరంజీవి గుర్తు చేశారు. ఆ సమయంలో నేను చాలా అవమానంగా భావించాన‌ని ఆయన గుర్తు చేసుకున్నారు. హిందీ సినిమాను భారతీయ సినిమాగా చిత్రీకరిస్తున్నారని ఇతర చిత్రాలను 'ప్రాంతీయ చిత్రాలు'గా వర్గీకరించారని వాటికి గౌరవం ఇవ్వలేదని మెగాస్టార్ అన్నారు.

ప్రాంతీయ - హిందీ సినిమాల మధ్య విభజనను తొలగించడంలో బాహుబలి కీలక పాత్ర పోషించింద‌ని భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అందరూ భాగమేనని నిరూపించినందున బాహుబలి తనను గర్వించేలా చేసిందని ఆ త‌ర్వాత ఆర్.ఆర్.ఆర్ తో మ‌ర్ స్థాయికి ఎదిగామ‌ని మెగాస్టార్ అన్నారు. చిరంజీవి ఈ వ్యాఖ్య‌లు చేసిన కొంత కాలానికే నేడు అన్ని అడ్డంకుల‌ను అధిగ‌మించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి తెలుగు జాతీయ ఉత్త‌మ న‌టుడిగా చ‌రిత్ర సృష్టించాడు. అయితే అల్లు అర్జున్ కంటే ముందు ఏఎన్నార్, ఎన్టీఆర్, చిరంజీవి అలాంటి గొప్ప ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వలేదా? అన్న‌దే ప్ర‌శ్న‌.