'విశ్వంభర' ఆ హైప్ని క్రియేట్ చేయడం కష్టమేనా?
`వాల్తేరు వీరయ్య` హిట్ తరువాత చిరు `భోళా శంకర్`తో భారీ డిజాస్టర్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 18 April 2025 9:30 AM`వాల్తేరు వీరయ్య` హిట్ తరువాత చిరు `భోళా శంకర్`తో భారీ డిజాస్టర్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తమిళ హిట్ ఫిల్మ్ `వీరం` ఆధారంగా మెహర్ రమేష్ రీమేక్ చేసిన ఈ మూవీ చిరుకు దారుణమైన ఫ్లాప్ని అందించి షాక్ ఇచ్చింది. అంతకు ముందు `ఆచార్య` షాక్ ఎదుర్కొన్న మెగాస్టార్ ఈసారి బిగ్ హిట్ని సొంతం చేసుకుని మళ్లీ ట్రాక్లోకి రావాలనే లక్ష్యంతో చేస్తున్న మూవీ `విశ్వంభర`. ఇదొక ఫాంటసీ యాక్షన్ డ్రామా.
`బింబిసార` ఫేమ్ మల్లిడి వశిష్ట ఈ భారీ క్రేజీ గ్రాఫికల్ యాక్షన్ డ్రామాకు దర్శకత్వం వహిస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్పై అత్యంత భారీ బడ్జెట్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. త్రిష, అషికా రంగనాథ్ నటిస్తున్నారు. గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే ఈ మూవీని `జగదేకవీరుడు అతిలోక సుందరి`కి సీక్వెల్గా చేస్తున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే టీమ్ మాత్రం ఈ వార్తలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
ఇక ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్పై ఇందులో ఉపయోగించి గ్రాఫిక్స్పై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.`విశ్వంభర` ప్రాజెక్ట్ ప్రకటించిన సమయంలో దీన్ని `జగదేకవీరుడు అతిలోక సుందరి`కి సీక్వెల్గా చేస్తున్నారనగానే ఈ మూవీపై అందరిలోనూ భారీ హైప్ ఏర్పడింది. కానీ ఆ హైప్ అంతా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కాగానే ఆవిరైపోయింది. గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో లేవని, చిరు సినిమాకు ఇలాంటి గ్రాఫిక్సా? అని అంతా కామెంట్ చేశారు.
దీంతో మళ్లీ వీఎఫ్ ఎక్స్ని మార్చేసే పనిలో పడిన టీమ్ మరో సారి ఆ తప్పులు జరగకుండా జాగ్రత్తలు పడటం మొదలు పెట్టింది.ఈ ఎఫెక్ట్ ఈ మూవీ ఓటీటీ రైట్స్పై కూడా పడటంతో చిత్ర బృందంలో టెన్షన్ మొదలైందట. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ మూవీపై హైప్ క్రియేట్ కావాలంటే `విశ్వంభర` ప్రమోషనల్ కంటెంట్ మరింత ఎఫెక్టీవ్గా ఉండాలని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
అలా లేకపోతే సినిమాపై హైప్ క్రియేట్ కావడం కష్టమని, అది సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని అభిమానులు కూడా టెన్షన్ పడుతున్నారు. మరి టీమ్ ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారా? లేక మళ్లీ అదే తప్పు చేస ఫ్యాన్స్ని నిరుత్సాహపరుస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.