మెగా వివాదం.. ఫైనల్ గా క్లారిటీ ఇచ్చిన భైరవం దర్శకుడు!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భైరవం'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
By: Tupaki Desk | 22 May 2025 6:30 PMబెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భైరవం'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 30న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలుగా కనిపించనుండగా, తమిళ బ్లాక్బస్టర్ 'గరుడన్'కు ఇది అధికారిక రీమేక్. ఒరిజినల్ కథను బేస్గా తీసుకుని తెలుగు ఆడియన్స్కు అనుగుణంగా అనేక మార్పులు చేసినట్లు ట్రైలర్, పోస్టర్లు చెబుతున్నాయి.
ముగ్గురు హీరోలకూ ఇది కమ్బ్యాక్ మూవీగా నిలుస్తుందనే భారీ పాజిటివ్ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించి ఇప్పుడు పెద్ద దుమారం రేగుతోంది. ఈ సినిమాను బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ మొదలైంది. మెగా అభిమానులు ఊహించని విదంగా బాయ్కాట్ ట్రెండ్లో చేరారు. కారణం.. డైరెక్టర్ విజయ్ కనకమేడల 2011లో చిరంజీవి, రామ్ చరణ్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారంటూ ఆరోపణలు వచ్చాయి.
అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో డైరెక్టర్పై ట్రోలింగ్ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు విజయ్ కనకమేడల సోషల్ మీడియా వేదికగా ఓ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. "భైరవం ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాతే కొంతమంది నన్ను ట్రోల్ చేస్తున్నారు. ఈరోజు మెగా అభిమానుల నుంచి కూడా ట్రోలింగ్ వస్తోంది. 2011లో నేను పెట్టిన ఓ ఫోటోపై ఈ విమర్శలు వస్తున్నాయి. కానీ అది నేను స్వయంగా పెట్టిన పోస్ట్ కాదు. హ్యాక్ అయి ఉండొచ్చు. నా సోషల్ మీడియా పేజీలో ఉన్నా కూడా అది నా బాధ్యత అని అంగీకరిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.
అతను మరోవైపు తనకు మెగా హీరోలతో ఎంతో సానిహిత్యం ఉందని గుర్తు చేశారు. "పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమాలో పని చేశాను. ఆయన నన్ను బాగా సపోర్ట్ చేశారు. సాయి ధరమ్ తేజ్ గారితో మంచి అనుబంధం ఉంది. ఆయన నన్ను అన్నా అన్నా అని పిలుస్తారు. అలాంటి అనుబంధం ఉన్నవాడిగా నేనే మెగా అభిమానులను దూరం చేసుకుంటానా?" అని ప్రశ్నించారు.
"ఇటువంటి తప్పు ఎలా జరిగిందో నాకే అర్థం కావడం లేదు. హ్యాక్ అయి ఉండొచ్చు. అయినా నా పేజీలో పోస్ట్ అయిందంటే నేను బాధ్యత వహిస్తాను. ఇకపై ఇలా జరగకుండా ప్రతి పోస్ట్కి ముందే చెక్ చేస్తాను. నా సినిమా మీద ట్రోలింగ్ జరుగుతున్న సమయంలో ఇలాంటి మళ్ళీ హ్యాకింగ్ జరిగిందేమోనని అనిపిస్తోంది. ఇకపై అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను" అని స్పష్టం చేశారు.
తమ అభిమానుల మనసుకు లోనవుతూ.. "నేను కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ ఇండస్ట్రీకి వచ్చాను. అలాంటిది వాళ్లను ఎందుకు దూరం చేసుకుంటాను..? మెగా అభిమానులు అందరికీ నా హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాను. ఇకపై ఇలాంటి తప్పులు జరగవు. మీలో ఒకడిగా హామీ ఇస్తున్నాను" అంటూ విజయ్ కనకమేడల తన వివరణను ముగించారు. ఈ వివరణతో ట్రోలింగ్ తగ్గుతుందా? సినిమా విడుదలపై ఈ వివాదం ప్రభావం చూపుతుందా అనేది చూడాలి. కానీ డైరెక్టర్ ఇచ్చిన క్లారిటీ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.