Begin typing your search above and press return to search.

విడాకుల తర్వాత తొలిసారిగా ఒకే స్టేజి మీద చై-సామ్!

అయితే ఇప్పుడు ఈ మాజీ జంట తొలిసారిగా ఒకే వేదికను పంచుకున్నారు.

By:  Tupaki Desk   |   19 March 2024 11:38 AM GMT
విడాకుల తర్వాత తొలిసారిగా ఒకే స్టేజి మీద చై-సామ్!
X

అక్కినేని నాగచైతన్య - సమంత జంట విడిపోయి రెండున్నరేళ్లు గడిచిపోయింది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఈ సెలబ్రిటీ కపుల్.. నాలుగేళ్లు తిరక్కుండానే విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. అప్పటి నుంచీ ఇద్దరూ వేర్వేరు దారుల్లో ప్రయాణిస్తున్నారు. డివోర్స్ ప్రకటన తర్వాత వీరిద్దరూ మళ్లీ కలుసుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు. అయితే ఇప్పుడు ఈ మాజీ జంట తొలిసారిగా ఒకే వేదికను పంచుకున్నారు.


ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈరోజు (మార్చి 19) ముంబైలో గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. త్వరలో ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోయే 70 ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు, షోలను ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో ప్రకటించారు. దీనికి సౌత్ నుంచి చాలా మంది దర్శక నిర్మాతలు, కొందరు హీరో హీరోయిన్లు హాజరయ్యారు. వారిలో నాగచైతన్య - సమంత రూత్ ప్రభు కూడా ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది.


నాగ చైతన్య గతేడాది 'దూత' వెబ్ సిరీస్ తో ఓటీటీ వరల్డ్ లో అడుగుపెట్టారు. ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కాబడిన ఈ షో, బిగ్గెస్ట్ హిట్ అయింది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ విక్రమ్ కె కుమార్, నిర్మాత శరత్ మరార్ లతో కలిసి ముంబై ఈవెంట్ కు హాజరయ్యారు చైతూ. ఈ సందర్భంగా దూత అనేది అమెజాన్ తెలుగు ఒరిజినల్ సిరీస్ లలో మోస్ట్ సక్సెస్ ఫుల్ షోగా నిలిచిందని ప్రకటించారు. అలానే 'దూత 2' రాబోతోందని హింట్ ఇచ్చారు.

మరోవైపు అమెజాన్ ప్రైమ్ కోసం సమంత చేసిన 'సిటాడెల్‌' వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ టైటిల్ ను కూడా ఇదే వేదికగా ప్రకటించారు. ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లింగ్‌ షోకి 'సిటడెల్: హనీ-బన్నీ' అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఎప్పటినుంచి స్ట్రీమింగ్‌కు తీసుకొస్తారనే విషయం మాత్రం వెల్లడించలేదు. అయితే ఈ కార్యక్రమానికి బాలీవుడ్ హీరో వరుణ్‌ ధావన్‌, దర్శక ద్వయం రాజ్‌ & డీకే లతో కలిసి హాజరైంది సమంత.

ఇలా చై - సామ్ ఇద్దరూ అనుకోకుండా ఒకే వేదికను పంచుకున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం వారు నటించిన వెబ్ సిరీస్ లను ప్రమోట్ చేసుకున్నారు. ఈ ఈవెంట్ ను హోస్ట్ చేసిన బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ మాజీ కపుల్ ను వేర్వేరుగా స్టేజీ మీదకు ఆహ్వానించారు. ఇద్దరూ ఒకేసారి వేదిక మీద మాట్లాడనప్పటికీ, విడాకుల తర్వాత తొలిసారిగా ఒకే స్టేజీని పంచుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ గా మారింది. వీరికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి.

'ఏంమాయ చేసావే' సినిమాలో తొలిసారిగా కలిసి నటించిన నాగచైతన్య - సమంత.. కొన్నాళ్లపాటు డేటింగ్ చేసి 2017 అక్టోబర్ 6న వైభవంగా పెళ్ళి చేసుకున్నారు. 2021 అక్టోబర్ 21న పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రకటించారు. చైతన్యకు దూరమైన తర్వాత సామ్ తన ఇన్స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసింది. మాజీ భర్తకు సంబంధించిన ఫోటోలన్నీ ఒక్కటొక్కటిగా డిలీట్ చేసింది. చైతూ మాత్రం ఇంకా తన మాజీ భార్యను ఇన్స్టాలో ఫాలో అవుతూనే ఉన్నాడు.

విడిపోవడం గురించి సమంత పలు సందర్భాల్లో స్పందించారు. ఇద్దరి మధ్య ఏదో పెద్ద గొడవే జరిగిందనుకునేలా 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మాట్లాడింది. 'బంగార్రాజు' ప్రమోషన్స్ లో నాగచైతన్య సైతం విడాకులపై నోరు విప్పాడు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇద్దరం హ్యాపీగా ఉన్నామని అన్నాడు. 'లాల్ సింగ్ చడ్డా' ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. ఇప్పుడు ఎవరి దారి వారిదే, ఇంతకుమించి ఈ విషయంలో ప్రపంచానికి తానేం చెప్పాలనుకోవడం లేదని స్పష్టం చేశాడు.

ఇప్పుడు తన మాజీ భార్య కనిపిస్తే 'హాయ్ చెప్పి హగ్ చేసుకుంటాను' అని నాగచైతన్య అన్నారు. ఇన్నాళ్ళకు మాజీ కపుల్ తాజాగా ఒకే ఈవెంట్ కు అటెండ్ అయ్యారు. మరి అక్కడ చై - సామ్ ఒకరికొకరు ఎదురు పడ్డారా? లేదా ఎదురు పడకుండా జాగ్రత్త పడ్డారా? ఒకవేళ ఎదురు పడితే ఏం మాట్లాడుకొని ఉంటారు? అని నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.