Begin typing your search above and press return to search.

నిర్మాత‌గా బిజీ అవుతున్న టాలెంటెడ్ డైరెక్ట‌ర్..!

By:  Tupaki Desk   |   10 Jan 2022 11:30 PM GMT
నిర్మాత‌గా బిజీ అవుతున్న టాలెంటెడ్ డైరెక్ట‌ర్..!
X
టాలీవుడ్ లో హీరోలు - దర్శకులు - నిర్మాతలు వేర్వేరుగా లేరు. ప్రస్తుతం చాలామంది దర్శక హీరోలే నిర్మాతలుగా మారి సినిమాలు నిర్మిస్తున్నారు. వారిలో కొందరు సొంత సినిమాల నిర్మాణంలో భాగస్వాములుగా ఉంటే.. మరికొందరు మాత్రం బయటి బ్యానర్స్ లో తయారయ్యే ప్రాజెక్ట్స్ కు డబ్బులు పెడుతున్నారు.

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ నిర్మాతగా టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ 'ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌' అనే బ్యానర్ మీద సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. శేఖర్ కమ్ముల ఎప్పటి నుంచో తాను డైరెక్ట్ చేసే సినిమాలను హోమ్ ప్రొడక్షన్ లోనే రూపొందిస్తున్నారు.

'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్ లో సుకుమార్ చిన్న మీడియం రేంజ్ సినిమాలు నిర్మిస్తున్నారు. 'గాలి సంపత్' చిత్రంతో అనిల్ రావిపూడి ప్రొడ్యూసర్ అవతారమెత్తారు. ఇక సునీల్ ప్రధాన పాత్రలో తెరకెక్కే 'వేదాంతం రాఘవయ్య' అనే చిత్రానికి డైరెక్టర్ హరీష్ శంకర్ సమర్పకులుగా వ్యవహరించనున్నారు.

క్రిష్ జాగర్లమూడి ఎప్పటి నుంచో హోమ్ ప్రొడక్షన్ లో సినిమాలు నిర్మిస్తున్నారు. అప్పుడప్పుడు ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. డైరెక్టర్ మారుతి కూడా ప్రొడ్యూసర్ గా సినిమాలు రూపొందిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు సంపత్ నంది కూడా నిర్మాతగా మారుతున్నారు.

ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో పలువురు దర్శకులు సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటూ కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. దర్శకుడిగా అందుకునే పారితోషికాన్ని ప్రొడక్షన్ లో పెడుతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ జాబితాలో యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మహా కూడా చేరిపోయారు.

''C/O కంచరపాలెం' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన వెంకటేష్ మహా.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తొలి చిత్రంతోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో 'మహేషింతే ప్రతీకారం' చిత్రానికి రీమేక్ గా ఆయన తెరకెక్కించిన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమా కూడా ఓటీటీ ఆడియన్స్ ని అలరించింది.

అయితే ఇప్పుడు వెంక‌ట్ మ‌హా నిర్మాత‌గా మారుతున్నారు. ఓవైపు డైరెక్ష‌న్ చేస్తునే మరోవైపు ప్రొడ్యూసర్ గా మారి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు తీయ‌డానికి యువ దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే వెంకటేష్ మహా సమర్పణలో 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు' అనే మూవీ షూటింగ్ జరుపుకుంటోంది.

కమెడియన్ సుహాస్ హీరోగా తెరకెక్కే ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ 2 పిక్చ‌ర్స్ - స్వేచ్ఛ క్రియేష‌న్స్ సంస్థలతో కలిసి వెంకటేష్ నిమిస్తున్నారు. ఏ చిత్రంతో దుశ్యంత్ క‌టిక‌నేని అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. త్వరలోనే ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అలానే యాంగ్రీ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో తాను డైరెక్ట్ చేసే 'మర్మాణువు' సినిమా నిర్మాణంలోనూ వెంకటేష్ మహా భాగస్వామిగా ఉంటున్నారని టాక్ వినిపిస్తోంది. విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వెంకటేష్.. మరి నిర్మాతగా ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.