Begin typing your search above and press return to search.

సంచలన వ్యాఖ్యలు: చరణ్‌ కంటే దేవి బెటర్‌?

By:  Tupaki Desk   |   19 Jan 2016 6:41 PM GMT
సంచలన వ్యాఖ్యలు: చరణ్‌ కంటే దేవి బెటర్‌?
X
సీనియర్‌ రైటర్‌.. నవలా రచయిత.. యండమూరి వీరేంద్రనాథ్‌.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఒక టివి ఛానల్‌ ఇంటర్యూలో పవన్‌ కళ్యాణ్‌ కు పొలిటికల్‌ నాలెడ్జ్‌ అనేదే లేదు అంటూ కామెంట్లు చేసి మెగా ఫ్యాన్స్‌ ను ఆక్రోశానికి గురిచేసిన ఆయన.. ఇప్పుడు రామ్‌ చరణ్‌ పై తనదైన శైలిలో కొన్ని కామెంట్లు చేసి షాకిచ్చారు.

ఒక ఇంజనీరింగ్‌ కాలేజీలో విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడని యండమూరి వీరేంద్రనాథ్‌.. ఓ ఇద్దరు సెలబ్రిటీల గురించి చెప్పారు. ''చిరంజీవితో నేను అభిలాష చేస్తున్న రోజుల్లో.. చరణ్‌ వాళ్లమ్మ తన కొడుకును హీరో చేయాలని ఎంతో కష్టపడేది. డ్యాన్సులూ వగైరా నేర్పించేది. చరణ్‌ కు ఈ దవడ అదీ సరిగ్గా ఉండేది కాదు.. దానిని కూడా సరిచేయించారు. ఇక అదే సమయంలో మా రైటర్‌ కొడుకు సరస్వతీ ప్రసాద్‌.. తండ్రి టైపులో రైటింగ్‌ కాకుండా చిన్నతనంలోనే మ్యూజిక్‌ పై మక్కువ చూపించాడు. ఓసారి ఇళయరాజా కంపోజ్‌ చేసిన అబ్బనీ తీయనీ దెబ్బ ట్యూన్‌ విని.. ఇది శివరంజనీ రాగం అనేశాడు. దాంతో ఇళయరాజా మెచ్చకున్నారు. అతగాడే పేరు మార్చుకుని ఇప్పుడు దేవిశ్రీప్రసాద్‌ గా ప్రఖ్యాతులు సంపాదించాడు'' అని చెప్పుకొచ్చారు యండమూరి. అయితే అసలు పంచ్‌ ఆ తరువాతే వేశారు.

''చరణ్‌ పేరు చెప్పినప్పుడు మీరు చప్పట్లు కొట్టలేదు.. కాని దేవిశ్రీ ప్రసాద్‌ పేరు చెబితే కొట్టారు.. సో.. నువ్వు ఏంటి అన్నది ముఖ్యం.. మీ నాన్న ఎవరు అన్నది కాదు..'' అని సంచలన వ్యాఖ్యలు చేశారు యండమూరి. అంటే దేవిశ్రీ ప్రసాద్‌ సొంతంగా ఎదిగాడు, చరణ్‌ ఇంకా తండ్రి చాటు బిడ్డే అనే మీనింగులో ఆయన చెప్పారేమో తెలియదు కాని.. మెగా ఫ్యాన్స్‌ మాత్రం ఈ కామెంట్లపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు.