Begin typing your search above and press return to search.

థియేటర్లకు పూర్వవైభవం వచ్చేనా..?

By:  Tupaki Desk   |   13 Aug 2021 12:30 AM GMT
థియేటర్లకు పూర్వవైభవం వచ్చేనా..?
X
కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల ప్రభావం తర్వాత ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకున్నాయి. తెలంగాణలో ఎలాంటి ఆంక్షలు లేకుండా 100 శాతం ఆక్యుపెన్సీతో ఓపెన్ అయితే.. ఆంధ్రప్రదేశ్ లో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మూడు షోలకు మాత్రమే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో భారీ మీడియం రేంజ్ సినిమాలు థియేటర్లలోకి రావడానికి వెనకాడితే.. చిన్న చిత్రాలు మాత్రం వరుసగా క్యూ కడుతున్నాయి.

జులై 30న థియేటర్స్ తెరిచిన వెంటనే అర డజను సినిమాలు విడుదల అవ్వగా.. అందులో 'తిమ్మరసు' 'ఇష్క్' చిత్రాలు మాత్రమే జనాలకు తెలిసినవి. వాటిలో 'తిమ్మరుసు' హిట్ టాక్ తెచ్చుకోగా.. 'ఇష్క్' నిరాశ పరిచింది. ఓ మోస్తరు కలెక్షన్స్ తో రెండో వారంలోకి అడుగుపెట్టిన 'తిమ్మరసు' పర్వాలేదనిపించింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో జనాల నుంచి రెస్పాన్స్ రాలేదని చెప్పవచ్చు.

కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత సినిమాలు చూడటానికి వచ్చిన ప్రేక్షకులు, ఇప్పుడు రాకపోవడానికి కారణం ఏంటంటే.. అప్పుడు మహమ్మారి అంతరించి పోయిందనే భావన ఉండటం.. ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుందేమో అనే భయం ఉండటమే అని తెలుస్తుంది. అయినప్పటికీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో మరో అర డజను చిన్న చిత్రాలను థియేటర్లలో రిలీజ్ చేశారు. అందులో 'SR కళ్యాణమండపం' సినిమా ఒక్కటే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మిగతా సినిమాల వైపు జనాలు చూడకపోవడంతో సినిమా హాళ్లు వెలవెలబోయాయి. 'SR కళ్యాణమండపం' చిత్రం ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయినట్లు చిత్ర యూనిట్ చెబుతున్నారు.

ఈ వీకెండ్ లో 9 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'పాగల్' సినిమా మినహా మిగతా చిత్రాలేవీ హడావుడి చేయడం లేదు. ఈ మూవీతో థియేటర్లకు మళ్ళీ కళ వస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. ఇదిలా ఉండగా మహారాష్ట్ర ప్రభుత్వం సినిమా థియేటర్లు మరికొన్ని రోజులు క్లోజ్ చేసి ఉంచాలని నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రతో పాటు కేరళ లో కూడా సినిమా హాళ్లను మూసివేస్తున్నట్టు ప్రకటించినట్లు తెలుస్తోంది.

ఉత్తరాదిలో త్వరలోనే థియేటర్లు తెరుచుకుంటాయని భావించిన సినిమా వాళ్లకు, సినీ ప్రియులకు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇండిపెండెన్స్ డే తర్వాత అనేక హిందీ సినిమాలు విడుదల ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్ 'బెల్ బాటమ్' చిత్రాన్ని ఆగస్ట్ 19న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అమితాబ్ బచ్చన్ - ఇమ్రాన్ హస్మి నటించిన 'చెహ్రే' మూవీని ఆగస్ట్ 27న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కానీ ఇప్పుడు మహారాష్ట్ర నిర్ణయంతో బాలీవుడ్ పై పెద్ద దెబ్బ పడిందనే చెప్పాలి.