Begin typing your search above and press return to search.

'శివగామి' ఆ బోల్డ్ క్యారక్టర్ లో నటించనుందా..?

By:  Tupaki Desk   |   7 April 2020 7:30 PM GMT
శివగామి ఆ బోల్డ్ క్యారక్టర్ లో నటించనుందా..?
X
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు రీమేక్ ల పరంపర కొనసాగుతోంది. మన సౌత్ ఇండియా సినిమాల కోసం బాలీవుడ్ కాచుకొని కూర్చొని ఉంటే అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలను మన వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యం లో బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన ‘అంధాదున్' మూవీ తెలుగు లో రిమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో నితిన్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ ప్రియా వారియర్ తదితరులు హీరోయిన్లుగా నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఎన్, నికిత రెడ్డిలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రం హిందీలో విజయం సాధించడానికి గల ప్రధాన కారణాల్లో స్టోరీ, స్క్రీన్ ప్లే, హీరో ఆయుష్మాన్ ఖురాన్ నటనతో పాటుగా నెగెటివ్ రోల్ చేసిన టబు పెర్ఫార్మెన్స్ కూడా కీలకమైనదే. ఈ బోల్డ్ క్యారెక్టర్ లో టబు నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇక తెలుగు రీమేక్ లో ఈ పాత్రను ఎవరు చేస్తారన్న విషయం ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో మొదట టబుయే ఈ పాత్రలో నటిస్తుందనే వార్తలు వచ్చాయి. ఆ తరువాత యాంకర్ కమ్ ఆర్టిస్ట్ అనసూయ పేరు కూడా తెరపైకొచ్చింది. టబు ఎలాగూ భారీ పారితోషకం డిమాండ్ చేస్తుంది కాబట్టి అనసూయను తీసుకోవాలనుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా ఈ పాత్రకి సంబంధించి మరో న్యూస్ బయటకి వచ్చింది. తాజాగా రమ్యకృష్ణను ఆ పాత్రలో తీసుకోవాలనే యోచనలో ఉన్నారట నిర్మాతలు. ఈ మూవీలో అత్యంత కీలకమైన పాత్ర అదే కావడంతో, ఆ పాత్రకి రమ్యకృష్ణ అయితేనే బాగుంటుందని భావించి చిత్ర బృందం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం. మరి ఈ బోల్డ్ క్యారెక్టర్ లో రమ్యకృష్ణ నటించడానికి ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి. ఇదిలా ఉండగా 'భీష్మ' సినిమా సక్సెస్ తో జోష్ మీదున్న నితిన్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం నటిస్తున్న 'రంగ్ దే' చిత్ర అనంతరం 'అంధాదున్' రీమేక్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి.