Begin typing your search above and press return to search.

వివాదాలు 'రిపబ్లిక్' చిత్రానికి కలిసొస్తాయా..?

By:  Tupaki Desk   |   29 Sep 2021 9:30 AM GMT
వివాదాలు రిపబ్లిక్ చిత్రానికి కలిసొస్తాయా..?
X
మెగా మేనల్లుడు సాయి తేజ్ - డైరెక్టర్ దేవకట్టా కాంబోలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ''రిపబ్లిక్''.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'వెన్నెల' 'ప్రస్థానం' 'ఆటోనగర్ సూర్య' వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దేవకట్టా.. మరోసారి పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాతో వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టుగా వచ్చిన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వేడి పుట్టించాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదాలు 'రిపబ్లిక్' చిత్రానికి హెల్ప్ అవుతాయా లేదా అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

'రిపబ్లిక్' సినిమా విడుదల తేదీని ప్రకటించిన కొన్ని రోజులకు హీరో సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసే బాధ్యతను మేనమామలు చిరంజీవి - పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. చిరు థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమాపై బబజ్ క్రియేట్ అవడానికి తనవంతు మద్దతు ఇచ్చారు. ఇక పవన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎపీ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మంత్రుల మీద తీవ్ర వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ మారింది.

సినిమా ఫంక్షన్ లో పవన్ రాజకీయాలు గురించి మాట్లాడటం ఏంటని కొందరు అంటే.. ఆయన మాట్లాడింది సినిమా ఇండస్ట్రీ కోసమే అని మరికొందరు అన్నారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే 'రిపబ్లిక్' సినిమా ఈవెంట్ లో పవన్ ఈ వ్యాఖ్యలు చేయడం అనేది సినిమాకు కలిసొస్తుందా లేదా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ సినిమా ఏపీలో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి.. విడుదలకు కొన్ని రోజుల ముందు పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రతికూల అంశంగా మారుతుందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం సినిమా కంటెంట్ బాగుంటే ఏవీ ఆపలేవని.. ప్రేక్షకులు అవేమీ పట్టించుకోకుండా ఆదరిస్తారని అంటున్నారు.

అంతేకాదు రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ మీద సానుభూతి పవనాలు కూడా ఉంటాయని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్లలోకి వచ్చే ప్రతీ సినిమా బాగా ఆడాలని ఇండస్ట్రీతో పాటుగా సినీ అభిమానులందరూ కోరుకుంటున్నారు. ఇటీవల విడుదలైన 'లవ్ స్టోరి' సినిమా సూపర్ హిట్ అవడంతో 'రిపబ్లిక్' చిత్రానికి కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి బుకింగ్స్ కాస్త తక్కువగానే ఉన్నా ఈ రెండు రోజుల్లో పుంజుకుంటాయని అంచనా వేస్తున్నారు.

కాగా, 'రిపబ్లిక్' చిత్రంలో స‌మాజంలోని వ్య‌వ‌స్థ‌లు - ప్రజల ఆలోచ‌న‌లు.. దాని వ‌ల్ల ప్ర‌భావిత‌మయ్యే అంశాల‌ను చూపించే ప్ర‌య‌త్నం చేశామని మేకర్స్ చెబుతున్నారు. అలానే బ్యూరోక్రాట్స్ మీద‌.. న్యాయ‌వ్య‌వ‌స్థ‌ పై రాజ‌కీయ ఒత్తిళ్లు ఉన్నాయ‌నే పాయింట్‌ ను ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది. శాసన, కార్య నిర్వాహక మరియు న్యాయ వ్యవస్థలను సక్రమంగా పని చేసేలా చూసే నిజాయితీ గల పంజా అభిరామ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో సాయి తేజ్ కనిపించనున్నారు.

ఇందులో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించగా.. రమ్యకృష్ణ - జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేసిన 'రిపబ్లిక్' ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ - టీజ‌ర్‌ - ట్రైలర్ - పాటలకు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాపై అంచనాలు కలిగించాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఎమ్ సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె. భగవాన్ - జె. పుల్లారావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.