Begin typing your search above and press return to search.

ఈసారైనా చిరంజీవిని అధికారికంగా ఆహ్వానిస్తారా..?

By:  Tupaki Desk   |   27 Jan 2022 8:31 AM GMT
ఈసారైనా చిరంజీవిని అధికారికంగా ఆహ్వానిస్తారా..?
X
ఆంధ్రప్రదేశ్‌ లో సినిమా టిక్కెట్ ధరల అంశం మీద చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. టికెట్ రేట్లను తగ్గించడంపై పలువురు సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఓ కమిటీ ఏర్పాటు చేసింది. అధికారులు మరియు ఇండస్ట్రీ సభ్యులతో కూడిన ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే రెండుసార్లు సమావేశం జరిగింది. ఇందులో చిత్ర పరిశ్రమలోని సమస్యలను తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

ఏపీ హైకోర్టు ఆదేశాలతో సినిమా టిక్కెట్ ధరల అంశంపై సర్కారు నియమించిన కమిటీ మరోసారి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2వ తేదీన అమరావతిలో ఈ మీటింగ్ జరగనుందని సమాచారం. ఈ మేరకు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లుతో పాటు ప్రేక్షుకుల సంఘం తరపున కొంత మందికి ఆహ్వానం పంపనున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన టికెట్ రేట్ల వ్యవహారంపై హైకోర్టులో తదుపరి విచారణ జరగనున్న నేపథ్యంలో ఈలోపే కమిటీ నివేదిక ప్రభుత్వానికి సమర్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సినిమా టికెట్స్ ఇష్యూతో ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ కు మధ్య కోల్డ్ వార్ జరుగుతుందనే విధంగా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సీనియర్ హీరో చిరంజీవి భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టిక్కెట్ రేట్ల అంశంతో పాటు చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించినట్లుగా చిరు తెలిపారు. వారం పది రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన కొత్త జీవో వస్తుందని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు అక్కినేని నాగార్జున సైతం ఇండస్ట్రీలోని సమస్యలపై చర్చించేందుకు ఏపీ సీఎంతో తన మిత్రుడు చిరంజీవి భేటీ అయ్యారని పేర్కొన్నారు. చిరంజీవి వెళ్తే సమస్య పరిష్కారం అయినట్లేనని అన్నారు. కానీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మాత్రం సీఎంతో చిరంజీవి భేటీ కుశల ప్రశ్నల కోసమేనని అన్నారు. సీఎం భోజనానికి పిలిస్తే చిరంజీవి వెళ్లారని చెప్పిన మంత్రి.. సినిమా టికెట్లకు సంబంధించిన సంప్రదింపులు సచివాలయంలో జరుగుతాయి కానీ.. ఇంట్లో జరుగుతాయా అని ప్రశ్నించారు. దీంతో ఇండస్ట్రీలో కలకలం రేగింది.

జగన్ తో సమావేశం ఎంతో సంతృప్తికరంగా జరిగిందని.. అన్ని అంశాలపై సానుకూల నిర్ణయం వస్తుందనే భరోసా ఏర్పడిందని చిరంజీవి గొప్పగా చెప్పారు. దీంతో సీఎం జగన్ - చిరంజీవి భేటీ తర్వాత ఇండస్ట్రీలో సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అందరూ భావిస్తున్న సమయంలో మంత్రి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మెగాస్టార్ ని పిలిచి అవమానించారా? అని అభిమానులు కామెంట్స్ చేశారు.

ఏపీ ప్రభుత్వం ఆహ్వానం మేరకు సినిమా ఇండస్ట్రీలో సమస్యలపై మాట్లాడేందుకే చిరంజీవి వెళ్లారని ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన నాగార్జున సైతం.. మంత్రి వ్యాఖ్యల తర్వాత సైలెంట్ గా ఉన్నారు. మరో వారంలో ప్రభుత్వ కమిటీ టికెట్ ధరల విషయమై మళ్ళీ సమావేశం అవుతోంది. ఈ భేటీకి ఇండస్ట్రీ తరపున చిరంజీవిని అధికారికంగా ఆహ్వానం పంపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

కాకపోతే కరోనా సోకడంతో చిరు ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చినా హాజరవుతారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఏది ఏమైనా వీలైనంత త్వరగా ఈ సమస్య ఓ కొలిక్కి వస్తే విడుదలకు సిద్దమవుతున్న పెద్ద సినిమాలకు మేలు జరుగుతుందని సినీ అభిమానులు భావిస్తున్నారు