Begin typing your search above and press return to search.

బాలయ్య ఈసారి బాలీవుడ్ పై ఫోకస్ పెట్టనున్నారా..?

By:  Tupaki Desk   |   19 Oct 2022 3:30 PM GMT
బాలయ్య ఈసారి బాలీవుడ్ పై ఫోకస్ పెట్టనున్నారా..?
X
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటీటీలో హోస్టుగా అదరగొడుతున్నారు. గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలు చవిచూస్తూ వచ్చిన నటసింహం.. చివరగా 'అఖండ' సినిమాతో తన కెరీర్‌ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. ఈ ఉత్సాహంతో ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టుకుంటున్నారు.

బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌ అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. షైన్ స్క్రీన్ బ్యానర్‌ పై సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మించే ఈ సినిమాకి ఎస్ థమన్ సంగీతం అందిస్తారు.

బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ మరియు సక్సెస్ ట్రాక్ ఎక్కిన బాలయ్య కలిసి చేయనున్న NBK108 చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది. అందులోనూ బాలకృష్ణ ను ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త పాత్రలో చూపించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ నేపథ్యంలో వదిలిన అనౌన్స్ మెంట్ వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది.

మాస్‌ పల్స్‌ తెలిసిన దర్శకుడు అనిల్.. ఇప్పుడు గాడ్ ఆఫ్ మాస్సెస్ కోసం విభిన్నమైన మాస్‌ స్క్రిప్ట్‌ ని సిద్ధం చేశారని తెలుస్తోంది. తొలిసారి కామెడీకి ప్రాధాన్యత తగ్గించి ఓ పవర్‌ ఫుల్ సబ్జెక్టును రెడీ చేస్తున్నాడట. ఇది హీరో క్యారెక్టరైజేషన్ మీద కథ అని.. బాలయ్యతో సరికొత్త ప్రయోగం చేయబోతున్నట్లు.. ఎవ్వరూ చూడని కొత్త కోణంలో ఆయన్ని చూపించబోతున్నట్లు అనిల్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే ఇప్పటికే దీనికి సంబంధించి డైలాగ్ వెర్షన్‌ తో కూడిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తైనట్లు టాక్ వచ్చింది. ఈ క్రమంలో 'బ్రో.. ఐ డోంట్ కేర్' అనే వినూత్నమైన టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. అంతేకాదు ఇప్పటి వరకూ కేవలం తెలుగులోనే సినిమాలు చేస్తూ వచ్చిన నందమూరి బాలకృష్ణ.. అనిల్ రావిపూడి సినిమాతో బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

NBK108 చిత్రాన్ని దక్షిణాది భాషలతో పాటుగా హిందీలోనూ రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో.. పలువురు బాలీవుడ్ నటీనటులను భాగం చేయాలని చూస్తున్నారట. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీలా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. యాభై ఏళ్ల వయసున్న తండ్రి పాత్రలో బాలయ్య కనిపిస్తే.. ఆయన కూతురుగా శ్రీలీల నటించనుంది.

అలానే ముఖ్య పాత్రల కోసం అంజలి - ప్రియమణి లను సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పాన్ ఇండియా ఆలోచనలో భాగంగా ఇతర భాషల పాపులర్ స్టార్స్ ని తీసుకోవాలని చూస్తున్నారని.. ఇప్పటికే కొందరిని సెలెక్ట్ చేసారని టాక్. 'అఖండ' సినిమాతో బాలయ్య ఇప్పటికే ఉత్తరాది జనాల దృష్టిని ఆకర్షించాడు. మరి ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెడతారేమో చూడాలి. గోపీచంద్ మలినేని సినిమా పూర్తైన వెంటనే ఈ సినిమా సెట్స్ మీదకు వస్తుంది.

ఇకపోతే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న NBK107 సినిమా ఇటీవలే టర్కీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ లోగోను కర్నూల్ - కొండారెడ్డి బురుజు వద్ద అక్టోబర్ 21న లాంచ్ చేయనున్నారు. 'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపీచంద్.. 'అఖండ'మైన విజయం తర్వాత బాలయ్య కలిసి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ అనౌన్స్ మెంట్ తో రిలీజ్ డేట్ పైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.