Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురు కలిసి జక్కన్న బ్యాడ్ సెంటిమెంటుని బ్రేక్ చేస్తారా..?

By:  Tupaki Desk   |   30 March 2022 3:30 AM GMT
ఆ ముగ్గురు కలిసి జక్కన్న బ్యాడ్ సెంటిమెంటుని బ్రేక్ చేస్తారా..?
X
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేసి హిట్ అందుకున్న హీరోలు ఎవరైనా.. ఆ తర్వాత సక్సెస్ రుచి చూడటానికి చాలా కాలం వేచి ఉండాలనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. దీన్ని నిజం చేస్తూ ఇప్పటి వరకు ఏ హీరో కూడా ఈ సెంటిమెంట్ నుంచి తప్పించుకోలేకపోయారు. ఇప్పుడు RRR సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో.. ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో తదుపరి సినిమాలు చేస్తున్న దర్శకనిర్మాతలు టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది.

రాజమౌళి డైరెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా 'స్టూడెంట్ నెం.1' తో హీరోగా తొలి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్.. వెంటనే 'సుబ్బు' సినిమాతో పరాజయం చవిచూశాడు. 'సింహాద్రి' తర్వాత 'ఆంధ్రావాలా' 'సాంబా' 'నా అల్లుడు' 'నరసింహుడు' 'అశోక్' లాంటి ప్లాప్స్ వచ్చి పడ్డాయి. అలానే 'యమదొంగ' సినిమా తర్వాత 'కంత్రి' లాంటి డిజాస్టర్ అందుకున్నాడు.

జక్కన్నతో 'ఛత్రపతి' సినిమా చేసిన తర్వాత ప్రభాస్ మరో విజయం సాధించడానికి చాలా కాలమే పట్టింది. 'బాహుబలి' సినిమాల అనంతరం వచ్చిన 'సాహో'.. ఇటీవల విడుదలైన 'రాధేశ్యామ్' మూవీ ఆడియన్స్ ని తీవ్రంగా నిరాశపరిచాయి. 'ఈగ' సినిమా తర్వాత నాని.. 'మర్యాద రామన్న' తర్వాత సునీల్ వరుసగా ఎన్ని ప్లాప్స్ అందుకున్నారో తెలిసిందే.

'మగధీర' చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత రామ్ చరణ్ వెంటనే 'ఆరెంజ్' వంటి డిజాస్టర్ అందుకున్నాడు. ఇవన్నీ గమనిస్తే జక్కన్న సినిమా సెంటిమెంట్ నిజమేనేమో అనే అనుమానం కలుగుతుంది. రాజమౌళి హీరోలు తమ తదుపరి సినిమాతో హిట్ కొట్టడం అంత ఈజీ కాదనే విషయం స్పష్టమవుతోంది.

అందుకే రాజమౌళి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇస్తాడని అభిమానులు ఎంత ధీమాగా ఉంటారో.. జక్కన్న సెంటిమెంటుకి తమ హీరోలు బలవుతారేమో అని అంతే కంగారు పడుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది.

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఇద్దరు కలిసి దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో చరణ్ - తారక్ ల నెక్ట్ సినిమాల పరిస్థితి ఏంటని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, RRR హీరోలిద్దరూ తమ రాబోయే సినిమాలను స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఆచార్య' సినిమాలో చరణ్ కూడా భాగమయ్యారు. ఇక ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల డైరెక్షన్ లో సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. రాజమౌళి హీరోలలో ఒకరిని హ్యాండిల్ చేయడమే కష్టం అనుకుంటుంటే.. ఇప్పుడు కొరటాల ఇద్దరిని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

అందులోనూ ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఇద్దరూ గతంలో జక్కన్న సెంటిమెంట్ చేతిలో దెబ్బ తిన్న వాళ్లే. వీరిద్దరూ ఆ దెబ్బ నుండి కోలుకోవడానికి చాలా ఏళ్ళే పట్టింది. అందుకే RRR సక్సెస్ చని ఎంజాయ్ చేస్తూనే.. మరోసారి బ్యాడ్ సెంటిమెంట్ కి బలవుతారేమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో కొరటాల శివ దీన్ని బ్రేక్ చేసి తమ హీరోలను బయట పడేస్తారని నమ్ముతున్నారు.

కొరటాల శివ సోషల్ మెసేజ్ తో పాటుగా ఎలివేషన్స్ మరియు ఎమోషన్స్‌ పై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సక్సెస్ అవుతూ వచ్చారు. ఏప్రిల్ 29న విడుదల కానున్న 'ఆచార్య' సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఎన్టీఆర్ తో ఓ రివేంజ్ డ్రామా ప్లాన్ చేసినట్లు ధ్రువీకరించారు.

ఈ రెండు సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో ఈ ప్రాజెక్ట్స్ ని శివ ఎలా హ్యాండిల్ చేస్తాడో అనే ఆసక్తి కూడా అందరిలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు RRR హీరోలకు హిట్లు అందించే బాధ్యత దర్శకుడిపై ఉంది. మరి కొరటాల శివ సహకారంతో తారక్ - చరణ్ ఇద్దరూ జక్కన్న సినిమా సెంటిమెంటుని బ్రేక్ వేస్తారేమో చూడాలి.