Begin typing your search above and press return to search.

చైతూ సినిమాని పట్టించుకోవడం లేదేంటి..?

By:  Tupaki Desk   |   11 July 2022 3:30 PM GMT
చైతూ సినిమాని పట్టించుకోవడం లేదేంటి..?
X
'బంగార్రాజు' సక్సెస్ జోష్ లో ఉన్న అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ''థాంక్యూ''. 'మనం' ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకున్నారు. విడుదలకు గట్టిగా పది రోజులే ఉండగా.. మేకర్స్ దూకుడుగా ప్రమోషన్స్ చేసుకోకపోవడం పై అక్కినేని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

'థ్యాంక్యూ' సినిమా నుంచి ఇప్పటి వరకు టీజర్ మరియు మూడు సాంగ్స్ వచ్చాయి. కానీ ఏమాత్రం సందడి చేయలేకపోయాయి. కాలేజీ ఈవెంట్స్ చేసి ఒకటీ రెండు ఇంటర్వ్యూలు ఇచ్చారు కానీ.. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి అలాంటి కార్యక్రమాలను కొనసాగించలేదు.

రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారనే దానిపై అప్డేట్ లేదు. అందుకే 'థాంక్యూ' సినిమాను సరిగ్గా ప్రమోట్ చేయడం లేదని అక్కినేని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ మరియు రచయిత బీవీఎస్ రవి తప్పితే ఈ మూవీ గురించి కనీసం ఒక ట్వీట్ కూడా వేయడం లేదని అంటున్నారు.

ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆలోచిస్తున్న రోజుల్లో.. అగ్రిసివ్ గా ప్రమోట్ చేస్తేనే మంచి ఓపెనింగ్స్ రావడం లేదు. అలాంటిది ప్రమోషన్స్ చేయకుండా సినిమాను రిలీజ్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

'థాంక్యూ' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. నిజానికి స్టార్ ప్రొడ్యూసర్ తన చిత్రాలకు జోరుగా ప్రమోషన్స్ చేస్తుంటారు. ఇప్పుడు జూలై 8న విడుదల కావాల్సిన చిత్రాన్ని వాయిదా వేసింది కూడా ప్రచారానికి తగినంత సమయం కోసమే. కానీ ఎందుకనో చైతూ సినిమాకి దూకుడుగా ప్రమోషన్స్ చేయడం లేదు.

దిల్ రాజు బ్యానర్ లోనే 'జోష్' సినిమాతో నాగచైతన్య హీరోగా లాంచ్ అయిన విషయం తెలిసిందే. మంచి కంటెంట్ తో వచ్చినా అప్పటి పరిస్థితుల్లో సరిగ్గా ఆడలేదు. ఇప్పుడు దాదాపు 13 ఏళ్ల తర్వాత యువ సామ్రాట్ తో దిల్ రాజు నిర్మించిన సినిమా 'థాంక్యూ'. ఈసారి సక్సెస్ అందించి బాకీ తీర్చుకుంటారని భావించగా.. మినిమమ్ ప్రమోషన్స్ కూడా చేయడం లేదని అక్కినేని అభిమానులు ఆవేదన చెందుతున్నారు.

రిలీజ్ డేట్ దగ్గర పడింది కాబట్టి ఇప్పటి నుంచైనా 'థాంక్యూ' ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలని.. అందుబాటులో ఉన్న ప్రతీ వేదికపై దూకుడుగా ప్రచారం చేయాలని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. మరి దిల్ రాజు అండ్ టీమ్ సినిమాకి బజ్ తీసుకురావడానికి ఎలాంటి ప్లాన్స్ తో వస్తారో చూడాలి.

కాగా, 'థ్యాంక్యూ' సినిమాలో నాగ చైతన్య సరసన రాశీ ఖన్నా - మాళవికా నాయర్ - అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. సుశాంత్ రెడ్డి - ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.