Begin typing your search above and press return to search.

సంక్రాంతి పందెంలో గెలుపెవరిది..?

By:  Tupaki Desk   |   4 Aug 2021 11:04 AM GMT
సంక్రాంతి పందెంలో గెలుపెవరిది..?
X
సంక్రాంతి పండుగ వచ్చిందంటే టాలీవుడ్ లో ఉండే సినిమా పండుగనే చెప్పాలి. ఆ సమయంలో ఓవైపు సంక్రాంతి సంబరాలు మరోవైపు సినిమా సంబరాలు కనిపిస్తుంటాయి. ఏడాది ప్రారంభంలో వచ్చే పెద్ద పండుగ కావడంతో కొత్త సినిమాలన్నీ థియేటర్లకు క్యూ కడుతుంటాయి. ఈ సీజన్ లో విడుదలయ్యే చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్స్ కు డోకా ఉండదు. అందుకే స్టార్ హీరోలందరూ ఈ ఫెస్టివల్ సీజన్ లో బరిలో దిగాలని భావిస్తుంటారు. బెర్తుల కోసం పోటీ పడుతుంటారు.

2022 సంక్రాంతి కి ఇంకా ఐదు నెలల టైం ఉండగా.. అప్పుడే ఇండస్ట్రీలో రిలీజ్ డేట్ల కోసం పోటీ ఎక్కువైంది. ఇప్పటికే ముగ్గురు స్టార్ హీరోలు రేసులో పాల్గొంటున్నట్లు ప్రకటించగా.. మరో సీనియర్ స్టార్ హీరో కూడా బరిలో దిగుతానని హింట్ ఇచ్చారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'రాధే శ్యామ్' చిత్రాన్ని జనవరి 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించగా.. జనవరి 13న 'సర్కారు వారి పాట' తో వస్తున్నట్లు సూపర్ స్టార్ మహేష్ బాబు అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈసారి రానా తో కలిసి జనవరి 12న వస్తానని వెల్లడించారు. ఇక విక్టరీ వెంకటేష్ కూడా గ్యాప్ దొరికితే 'ఎఫ్ 3' ని తీసుకురావాలని చూస్తున్నారు.

మహేష్ బాబు ఇప్పటి వరకు ఆరు సార్లు సంక్రాంతి వార్ లో పోటీ పడ్డారు. ఫస్ట్ టైం 'టక్కరిదొంగ' చిత్రాన్ని పెద్ద పండక్కి రిలీజ్ చేసిన మహేష్.. ఆ తర్వాత 'ఒక్కడు' 'బిజినెస్‌ మ్యాన్' 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు' '1 నేనొక్కడినే' వంటి చిత్రాలు వచ్చాయి. గతేడాది 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలలో ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు 'సర్కారు వారి పాట' చిత్రంతో మరోసారి సంక్రాంతి వసూళ్ల వేట కోసం బరిలో దిగుతున్నాడు. పరశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. బ్యాంకుల కుంభకోణాల నేపథ్యంలో సామాజిక అంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో మహేష్ మెడపై రూపాయి టాటూ - ఫ్రీ హెయిర్ స్టైల్ తో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - జీఎంబీ ఎంటర్టైనెంట్స్ - 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' రీమేక్ చిత్రాన్ని సంక్రాంతి కి రిలీజ్ చేయనున్నారు. ఇంతకముందు 'గోపాల గోపాల' చిత్రాన్ని ఫెస్టివల్ సీజన్ లోనే తీసుకొచ్చిన పవన్.. 'అజ్ఞాతవాసి' ని కూడా పండుగ బరిలో నిలిపారు. ఇందులో ఒకటి పర్వాలేదనిపించగా.. మరొకటి డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇప్పుడు రానా తో కలిసి మలయాళ రీమేక్ తో మరోసారి రంగంలోకి దిగుతున్నాడు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. అహం ఆత్మాభిమానం వల్ల ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో ఏమి జరిగింది అనేది ఈ చిత్రంలో చూపించనున్నారు. భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనున్నారు. పవన్ కు జోడీగా నిత్యామీనన్.. రానా సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై '#PSPKRana' సినిమా రూపొందుతోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చాలా ఏళ్ళ తర్వాత సంక్రాంతి సీజన్ లో తన సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. 'వర్షం' సినిమాతో మొదటి సంక్రాంతి పందెంలో నిలిచి గెలిచిన ప్రభాస్.. 2008లో 'యోగి' చిత్రంతో పరాజయం అందుకున్నాడు. 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన డార్లింగ్.. ''రాధే శ్యామ్'' చిత్రాన్ని వచ్చే సంక్రాంతి పండక్కి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వింటేజ్ లవ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది పండుగ సీజన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ. పూజాహెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. కృష్ణంరాజు సమర్పణలో టీ సిరీస్ - యూవీ క్రియేషన్స్ - గీతాకృష్ణ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ''ఎఫ్ 3'' చిత్రాన్ని కూడా సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఇటీవల వెల్లడించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై దిల్ రాజు - శిరీష్ కలిసి నిర్మిస్తున్నారు. రెండేళ్ల క్రితం సంక్రాంతికి వచ్చిన 'ఎఫ్-2: ఫన్ అండ్ ఫస్ట్రేషన్' మంచి సక్సెస్ అవడంతో.. అదే ఫ్రాంచైజీలో రూపొందే 'ఎఫ్ 3' చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి పోటాపోటీగా సంక్రాంతి బరిలో దిగుతున్నట్లు ప్రకటించి ఈ సస్టార్ హీరోలలో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.