Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ వద్ద పైచేయి ఎవరిది..??

By:  Tupaki Desk   |   14 March 2022 9:30 AM GMT
బాక్సాఫీస్ వద్ద పైచేయి ఎవరిది..??
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పీరియాడికల్ లవ్ డ్రామా 'రాధేశ్యామ్' గ‌త శుక్ర‌వారం విడుదలైంది. కరోనా పాండమిక్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ఇది. భారీ అంచ‌నాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు డివైడ్ టాక్ తెచ్చుకుంది. రివ్యూలు కూడా ఆశాజ‌న‌కంగా లేవు.

అయినప్పటికీ డార్లింగ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్ సాధించింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా కేంద్రాలలో 'రాధేశ్యామ్' సినిమా వసూళ్ళు వారాంతంలో నిలకడగా ఉన్నాయి. తొలి రోజు టాక్ తో సంబంధం లేకుండా త‌ర్వాతి రెండు రోజుల కలెక్షన్స్ ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రభాస్ సినిమా కోసం నిర్మాతలు యువి క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్ కలిసి దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు టాక్. అందులో డిజిటల్‌ మరియు శాటిలైట్‌ రైట్స్‌ రూపంలో ఇప్పటికే రూ. 200 కోట్లు రాబట్టారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వారు అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

మిగిలిన రూ.50 కోట్లను థియేట్రికల్ రిటర్న్స్ నుండి రాబట్టాల్సి ఉండగా.. ఈ చిత్రం ఓపెనింగ్ వీకెండ్ లోనే 151 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీని ప్రకారం 'రాధేశ్యామ్' నిర్మాతలు ఇప్పటికే సేఫ్ జోన్‌ లో ఉన్నట్లే పరిగణించవచ్చు. మిశ్రమ స్పందన తెచ్చుకున్న సినిమాకు ఈ రేంజ్ వసూళ్ళు రావడం విశేషమే.

కాకపోతే బ‌య్య‌ర్ల పెట్టుబ‌డుల లెక్క‌లు చూస్తే మాత్రం.. రాబోయే రోజుల్లో ప్రభాస్ మూవీ కలెక్షన్స్ నిలకడగా ఉంటేనే వాళ్ళు గట్టెక్కగలరని చెప్పాలి. నార్త్ లో 'రాధేశ్యామ్' చిత్రానికి "ది కాశ్మీర్ ఫైల్స్" సినిమా నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ మూవీ.. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి వసూళ్ళు రాబడుతుంది.

నిజానికి 'రాధే శ్యామ్' వంటి పాన్ ఇండియా మూవీ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన తరుణంలో.. 'కాశ్మీర్ ఫైల్స్‌' కు అంతగా ప్రీ-రిలీజ్ బజ్ ఏర్పడలేదు. అయితే రిలీజ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మొదటి రోజుకు మించి రెండు మూడు రోజుల కలెక్షన్స్ ఉండటం విశేషం.

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించిన 'కాశ్మీర్ ఫైల్స్' సినిమా మొదటి రోజు రూ. 4.25 కోట్లు రాబట్టింది. అయితే ఆశ్చర్యకరంగా 2వ రోజు 10.10 కోట్లు మరియు 3వ రోజు రూ. 17.25 కోట్లు అందుకుంది. మొత్తం మీద మేకర్స్ అధికారిక లెక్కల ప్రకారం మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 31.6 కోట్లు సాధించింది. ఇప్పుడు చాలా ఏరియాలలో ఈ సినిమాకు అదనపు షోలు వేస్తున్నారు.

'రాధే శ్యామ్' కు డివైడ్ టాక్‌ రావడంతో హైదరాబాద్‌ లో కూడా 'కాశ్మీర్ ఫైల్స్‌' చిత్రానికి కొత్త షోలు వేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 25న 'ఆర్.ఆర్.ఆర్' మూవీ రిలీజ్ ఉన్న నేపథ్యంలో.. అప్పటి వరకు ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ళు రాబడతాయనేది ఆసక్తికరంగా మారింది.