Begin typing your search above and press return to search.

ఇద్దరు ముద్దుగుమ్మల్లో విజయ్ జోడీకట్టేదెవరు?

By:  Tupaki Desk   |   3 Oct 2021 11:30 PM GMT
ఇద్దరు ముద్దుగుమ్మల్లో విజయ్ జోడీకట్టేదెవరు?
X
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల జాబితాలో వంశీ పైడిపల్లి పేరు తప్పకుండా కనిపిస్తుంది. అయితే ఆయన నుంచి ఒక సినిమా తరువాత మరో సినిమా రావడానికి చాలా సమయం పడుతూ ఉంటుంది. "త్రివిక్రమ్ .. కొరటాల .. అనిల్ రావిపూడి తమ సినిమాలకి సంబంధించిన కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు తామే రెడీ చేసుకుంటారు. కానీ నేను రచయితలపై ఆధారపడతాను అని ఇటీవల ఒక సందర్భంలో ఆయనే చెప్పారు. ఒక హీరోకి తాను కథ వినిపించిన్నప్పుడు ఆ హీరో మార్పులు .. చేర్పులు చెబుతాడు. ఆ సమయానికి రచయిత నాకు అందుబాటులో లేకపోతే ఆలస్యమవుతూ ఉంటుంది" అని అన్నారు.

దర్శకత్వం విషయానికి వస్తే వంశీ పైడిపల్లి ప్రతిభకు వంకబెట్టవలసిన అవసరం లేదు. యాక్షన్ .. ఎమోషన్ .. డ్రామాను ఆయన గొప్పగా రక్తి కట్టిస్తారు. 'బృందావనం' .. 'ఎవడు' .. 'ఊపిరి' .. ' మహర్షి' సినిమాలను అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఒక సినిమాకు .. మరో సినిమాకు సంబంధం లేని కథలను ఎంచుకోవడమే ఆయన ప్రత్యేకత. అలాంటి వంశీ పైడిపల్లి తన తదుపరి ప్రాజెక్టును సెట్ చేసుకునే పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ సారి ఆయన తన హీరోగా తమిళ స్టార్ హీరో విజయ్ ను ఎంచుకోవడం విశేషం.

తమిళనాట మాస్ ఆడియన్స్ లో విజయ్ కి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. అందువలన ఆయన తన సినిమాల్లో మాస్ అంశాలు ఉండేలా చూసుకుంటారు. అలాగే హీరోయిజాన్ని బిల్డప్ చేసే అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెడుతూ ఉంటారు. ఇక నిర్మాణపరంగా భారీతనం ఎక్కడ ఎంత మాత్రం తగ్గకూడదు. ఆయనను ఒప్పించడం కూడా అనుకున్నంత తేలికేం కాదు. అయినా మొత్తానికి వంశీ పైడిపల్లి ఆయనతో ఓకే చెప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన నాయికలుగా అందాల సందడి చేసేది ఎవరు? అనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ నేపథ్యంలో కియారా అద్వాని - రష్మిక పేర్లు తెరపైకి వచ్చాయి. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచన ఉంది. అందువలన ఈ మూడు భాషల ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉన్న నాయికను సెట్ చేయవలసి ఉంటుంది. అందువలన వంశీ పైడిపల్లి .. రష్మికను గానీ .. కియారాను గాని తీసుకోవాలనే ఉద్దేశంతో సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఇద్దరూ కూడా ఎవరి ప్రాజెక్టులతో వారు బిజీగా ఉన్నారు. కియారా విషయానికొస్తే ఓ మూడు నాలుగు భారీ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. తాజాగా శంకర్ - చరణ్ ప్రాజెక్టు కూడా వచ్చిన చేరిన సంగతి తెలిసిందే.

ఇక రష్మిక విషయానికి వస్తే, ప్రస్తుతం తెలుగులో 'పుష్ప' చేస్తోంది. ఈ సినిమా రెండు పార్టులుగా తీస్తుండటం వలన, అదనంగా ఆమె డేట్లు కేటాయించవలసి వచ్చింది. శర్వానంద్ జోడీగా చేస్తున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా సెట్స్ పైనే ఉంది. రీసెంట్ గా హిందీలో 'మిషన్ మజ్ను' పూర్తి చేసిన ఆమె, 'గుడ్ బై' సినిమా షూటింగులో బిజీగానే ఉంది. ఇక తమిళ సినిమాలు చర్చల దశలో ఉన్నట్టుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. దాంతో ఈ సినిమాలో ఈ ఇద్దరూ చేయడం సాధ్యం కాదా? అని అభిమానులు టెన్షన్ పడవలసిన పనిలేదు.

తమిళనాట విజయ్ కి ఉన్న క్రేజ్ సామాన్యమైనది కాదు. ఒక్కో భాషల్లో ఒక్కో సినిమా ఒప్పేసుకుని, ఎక్కే ఫ్లైటు .. దిగే ఫ్లైటు అన్నట్టుగా హైరానా పడవలసిన పనిలేదు. ఆయనతో ఒక సినిమా చేస్తే అదే అన్ని భాషల నుంచి కావాసినంత క్రేజ్ ను రాబడుతుంది. ఈ విషయం హీరోయిన్లకే ఎక్కువ తెలుసు. అందువలన ఈ ఇద్దరినీ వంశీ పైడిపల్లి సంప్రదించడం నిజమే అయితే, ఇద్దరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోరు. తమ తెలివితేటలు పూర్తిస్థాయిలో ఉపయోగించి మరీ డేట్లు సర్దుబాటు చేస్తారు. 'ఇద్దరూ ఓకే అనేశారు గనుక .. ఇద్దరినీ తీసేసుకుందాం' అని వంశీ పైడిపల్లి అనుకునే పరిస్థితి కూడా రావొచ్చునేమో .. ఎవరికి తెలుసు?