Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో అసలేం జరుగుతోంది..??

By:  Tupaki Desk   |   28 July 2022 7:30 AM GMT
టాలీవుడ్ లో అసలేం జరుగుతోంది..??
X
తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా పాకిన తర్వాత భారీతనం మీదనే మేకర్స్ ఎక్కువ దృష్టి పెడుతున్నారనిపిస్తోంది. పాన్ ఇండియా మోజులో బడ్జెట్ లెక్కల గురించి పెద్దగా పట్టించుకోకుండా విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తున్నారు మన నిర్మాతలు. ఎటువంటి కమిట్‌మెంట్ లేకుండానే స్టార్ హీరోలకు కోట్ల రూపాయల అడ్వాన్సులు చెల్లిస్తున్నారు.

నిజానికి కరోనా పాండమిక్ కారణంగా సినీ ఇండస్ట్రీ కుదేలైపోయింది. రెండేళ్ల పాటు 24 క్రాఫ్ట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా నిర్మాతలు ఆర్థికంగా బాగా చితికిపోయారు. సినిమాలు థియేటర్లలో రిలీజ్ చేసుకోలేక.. షూటింగులకు వెళ్లలేక.. ఫైనాన్స్ కట్టుకోలేక నానా అవస్థలు పడ్డారు.

అయితే టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఎవరూ పాండమిక్ నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని అర్థం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ కంట్రోల్ అనేదే పట్టించుకోకుండా.. అవసరం లేకున్నా సినిమా కోసం అధికంగా ఖర్చు చేస్తున్నారు. నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు ఇంతకముందు కంటే అధిక మొత్తంలో రెమ్యునరేషన్స్ ఇస్తున్నారు.

అంత చేసి కూడా.. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలను సైతం నెల తిరక్కుండానే ఓటీటీలో రిలీజ్ చేస్తూ.. మొత్తం థియేట్రికల్ సిస్టమ్ పైనే ప్రభావం పడేలా నిర్ణయాలు తీసుకున్నారు. నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధర పలుకుతున్నాయని సంబర పడ్డారు కానీ.. థియేట్రికల్ మార్కెట్ తగ్గిపోతోందని ఆలోచించలేదు.

దీనికి తోడు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో టికెట్ రేట్లు విపరీతంగా పెంచేశారు. రెండు మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేలా అగ్రిమెంట్స్ చేసుకోవడం.. అధిక టికెట్ రేట్లు వంటి అంశాలు థియేట్రికల్ మార్కెట్‌ ను పూర్తిగా అణిచివేసే పరిస్థితి వచ్చింది.

ఓటీటీలకు అలవాటు పడిపోయిన జనాలు థియేటర్లకు వచ్చి సినిమా చూడటం తగ్గించేశారు. అంత రేటు పెట్టి సినిమా చూడలేమంటూ.. ఇంట్లోనే హోమ్ స్క్రీన్ లో సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో గత కొన్ని నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడే కనిపించడం లేదు.

పాండమిక్ తర్వాత ప్రేక్షకుల అభిరుచి, ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయాయనేది వాస్తవం. ట్రైలర్ - పాటలు ఆకట్టుకుంటుంటే థియేటర్లలో సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. లేదంటే స్టార్ హీరోల సినిమాలు కూడా జనాలను థియేటర్లకు రప్పించలేకపోతున్నారు.

ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నా.. వసూళ్ళు రాబట్టలేకపోయిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. మా సినిమాకు సరసమైన ధరలకే అందిస్తున్నాం అంటూ పోస్టర్స్ వదిలి, ప్రకటనలు ఇవ్వాల్సిన వచ్చిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇండస్ట్రీలో నెలకొన్న విషయాలపై కాస్త ఆలస్యంగా కళ్ళు తెరిచిన యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్.. టాలీవుడ్ సమస్యలపై చర్చించడానికి.. తదుపరి చర్యలపై నిర్ణయాలు తీసుకోడానికి సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ఆగస్ట్ 1 నుంచి నిర్మాణాలను ఆపేయాలని.. స్ట్రైక్ చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే నిర్మాతల గిల్డ్ తీసుకున్న నిర్మాణాల బంద్ నిర్ణయానన్ని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి - తెలుగు నిర్మాతల మండలి - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి మూడు సంఘాలు వ్యతిరేఖించాయి. ఇలా ఏకాభిప్రాయం లేకపోవడంతో టాలీవుడ్ లో ఇప్పుడు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

దీంతో జూనియర్ ఆర్టిస్టులు - సాంకేతిక నిపుణులు - రోజువారీ వేతన కూలీలు మరియు ఇతర క్రాఫ్ట్స్ వారికి ఇండస్ట్రీలో ఏమి జరుగుతుందో తెలియని అయోమయంలో ఉన్నారు. కొంతమంది సమ్మె అంటుంటే.. మెయిన్ అసోసియేషన్స్ మాత్రం ఎటువంటి సమ్మె లేదని అంటుండటంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మరి త్వరలోనే ఈ గందరగోళం నుంచి బయటపడి అంతా నార్మల్ అవుతుందేమో చూడాలి.