Begin typing your search above and press return to search.

అక్కినేని కాంపౌండ్ లో ఏం జ‌రుగుతోంది?

By:  Tupaki Desk   |   8 April 2022 8:30 AM GMT
అక్కినేని కాంపౌండ్ లో ఏం జ‌రుగుతోంది?
X
అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ మూవీగా వారి కెరీర్ లో నిలిచిపోయిన చిత్రం 'మ‌నం'. దీనికి సీక్వెల్ ని చేయ‌బోతున్నారా? .. అక్కినేని కాంపౌండ్ లో ఏం జ‌రుగుతోంది? .. అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. 'మ‌నం' చిత్రంలో అక్కినేని మూడు త‌రాల హీరోలంతా క‌లిసి న‌టించారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌, అఖిల్ తో పాటు ఒక్క అమ‌ల త‌ప్ప స‌మంత కూడా న‌టించిన విష‌యం తెలిసిందే. 2014లో వ‌చ్చిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించి అక్కినేని ఫ్యామిలీకి మ‌ర్చిపోలేని సినిమాగా నిలిచింది.

ఫ్యాన్స్ అయితే ఈ సినిమాతో సంబ‌రాలు చేసుకున్నారు. ఒకే ఫ్రేమ్ లో అక్కినేని మూడు త‌రాల హీరోలు క‌లిసి న‌టించ‌డంతో ఆ ఆనందాన్ని సెల‌బ్రేట్ చేసుకున్నారు. సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. విక్ర‌మ్ కె. కుమార్ వినూత్న‌మైన ఆలోచ‌న‌కు స‌రికొత్త స్క్రీన్ ప్లేని జోడించి తెర‌కెక్కించిన ఈ చిత్రం రాజ్ క‌పూర్ ఫ్యామిలీ త‌రువాత ఆ త‌ర‌హాలో ఫ్యామిలీ హీరోలంతా క‌లిసి న‌టించిన సినిమాగా అక్కినేని వారి 'మ‌నం' రికార్డు సాధించింది. న‌టీన‌టుల ప‌రంగా, టెక్నిషియ‌న్ ల‌ప‌రంగా, పిక్చ‌రైజేష‌న్ ప‌రంగా ఈ మూవీ అక్కినేని ఫ్యామిలీకి, వారి ఫ్యాన్స్ కి ఓ మ‌ధురానుభూతిగా నిలిచింది.

ఈ మూవీ విడుద‌లై దాదాపు తొమ్మిదేళ్ల‌వుతోంది. మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌రువాత అక్కినేని ఫ్యామిలీ హీరోలు ఈ త‌ర‌హా క‌థ‌తో 'మ‌నం -2' సినిమాకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా? అంటే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. అంతే కాకుండా అన్న‌పూర్ణ స్టూడియోస్ కాంపౌండ్ మొత్తం ఈ వార్త వైర‌ల్ గా మారిన‌ట్టుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే 'మ‌నం 2' కోసం క‌థ‌లు వింటున్నార‌ట‌. ఇప్ప‌టికే చాలా క‌థ‌లు విన్నార‌ని, ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోస్ ఆవ‌ర‌ణ‌లో ద‌ర్శ‌కులు వ‌న్ బై వ‌న్ క‌థ‌లు వినిపిస్తున్నార‌ని ఇన్ సైడ్ టాక్‌.

గ‌త కొంత కాలంగా అక్కినేని హీరోలంతా క‌లిసి 'మ‌నం' త‌ర‌హాలో ఓ సినిమా చేయాల‌ని ఆలోచిస్తున్నార‌ట‌. ఆ ఆలోచ‌న‌ని కార్య‌రూపం ఇవ్వాల‌ని ఇటీవ‌ల ప్ర‌య‌త్నాలు ప్రారంభించార‌ని, ఇందులో భాగంగానే తామంతా క‌లిసి ఒకే ఫ్రేమ్ లో చూపించే స‌రికొత్త క‌థ కోసం అన్వేష‌ణ మొద‌లు పెట్టార‌ని, ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ స‌రిగ్గా సెట్ట‌య్యే క‌థ కోసం వ‌రుస‌గా క‌థ‌లు వింటున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. వ‌న్స్ అక్కినేని హీరోల‌కు సెట్ట‌య్యే క‌థ ఫిక్స్ కాగానే అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే ప్ర‌స్తుతం అక్కినేని హీరోలు వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో బిజీగా వున్నారు. కింగ్ అక్కినేని నాగార్జున 'ఘోస్ట్‌' చిత్రంలో న‌టిస్తున్నారు. ప్ర‌వీణ్ స‌త్తారు తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ చిత్రీకర‌ణ ప్రస్తుతం ఊటీలో జ‌రుగుతోంది. విక్ర‌మ్ కుమార్ డైరెక్ష‌న్ లో 'థాంక్యూ' మూవీని పూర్తి చేసిన నాగ‌చైత‌న్య ఇదే ద‌ర్శ‌కుడితో 'దూత‌' అఏ వెబ్ సిరీస్ చేస్తున్నాడు.

వెంక‌ట్ ప్ర‌భు తో తాజాగా మ‌రో చిత్రాన్ని కూడా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇక అఖిల్ అక్కినేని ప్ర‌స్తుతం స్పై థ్రిల్ల‌ర్ 'ఏజెంట్‌' లో న‌టిస్తున్నాడు. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీని సురేంద‌ర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఇవ‌న్నీ పూర్త‌యిన త‌రువాతే 'మ‌నం 2' వుండే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.