Begin typing your search above and press return to search.

సినీ అవార్డుల విషయంలో నిరాదరణకు గురవుతున్నాం: చిరంజీవి

By:  Tupaki Desk   |   29 April 2022 8:30 AM GMT
సినీ అవార్డుల విషయంలో నిరాదరణకు గురవుతున్నాం: చిరంజీవి
X
హైదరాబాద్ లో గురువారం జరిగిన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ హెల్త్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి మరియు తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమక్షంలో ఎప్పుడున్నా కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు అత్యంత దగ్గర వ్యక్తుల మధ్య ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుందన్నారు. తన సినీ జీవితంలో జర్నలిస్టుల పాత్ర మరియు వారితో ఉన్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ కు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు చిరు. అసోసియేషన్ కోసం సినిమాకు ఓ లక్ష రూపాయిలు కేటాయిస్తే బాగుంటుందంటూ తలసాని శ్రీనివాస్ తీసుకొచ్చిన ప్రతిపాదనను ముందుకు తీసుకెళతామని అన్నారు.

సొంతంగా అసోసియేషన్ ను ప్రారంభించి.. హెల్త్ కార్డులు పంపిణి చేయడం గొప్ప విషయమని కొనియాడారు. నవంబర్ లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ పేరుతో నిర్వహించబోయే అవార్డుల కార్యక్రమానికి తనవంతు సహకారాన్ని అందించనున్నట్లు హామీ ఇచ్చారు.

నిజానికి తెలుగు రాష్ట్రాలు విడిపోయాక అవార్డులు విషయంలో నిరాదరణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చిరంజీవి. సినీ అవార్డుల విషయంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించాలని కోరారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో నిబద్ధతతో పనిచేసే జర్నలిస్టులు ఉన్నారని.. తెలుగు సినిమాకు ప్రపంచ గుర్తింపు దక్కడంలో జర్నలిస్టుల పాత్ర కీలకంగా నిలిచిందన్నారు. అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం తనవంతుగా రూ.5 లక్షలు అందించనున్నట్లు తలసాని ప్రకటించారు.

తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులకు ఈ సందర్భంగా హెల్త్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా హాజరయ్యారు. తెలుగు ఫిలిం జర్నలిస్టులకు ఎల్లప్పుడూ తన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.