Begin typing your search above and press return to search.

చిరు Vs బాలయ్య: తగ్గేదే లే..!

By:  Tupaki Desk   |   9 Nov 2022 2:30 PM GMT
చిరు Vs బాలయ్య: తగ్గేదే లే..!
X
మెగాస్టార్ చిరంజీవి మరియు నటసింహం నందమూరి బాలకృష్ణ చాలా ఏళ్ళ తర్వాత బాక్సాఫీస్ ఫైట్ కు రెడీ అయ్యారు. 'వాల్తేరు వీరయ్య' మరియు 'వీర సింహా రెడ్డి' సినిమాలు 2023 సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి రాబోతున్నాయి. ఫెస్టివల్ సీజన్ లో మూడు నాలుగు చిత్రాలు వచ్చినా ఇబ్బందేమీ ఉండదు కాబట్టి.. ఈసారి రసవత్తరమైన పోరు చూడొచ్చని సినీ అభిమానులు భావిస్తున్నారు.

బాలయ్య - చిరు సినిమాలు ఒకేసారి రావడం వరకూ బాగానే ఉంది కానీ.. ఈ రెండూ ఒకే బ్యానర్ లో రూపొందుతున్న చిత్రాలు కావడమే ఇప్పుడు సమస్యగా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇద్దరు సీనియర్ హీరోలతో ప్రాజెక్ట్స్ సెట్ అవ్వడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిసున్నారు. అయితే రెండు సినిమాలను ఒకే సీజన్ లో రిలీజ్ చెయ్యాల్సి వస్తుందని నిర్మాతలు ఊహించలేకపోయారు.

'వాల్తేరు వీరయ్య' మరియు 'వీర సింహా రెడ్డి' చిత్రాల మధ్య క్లాష్ ని నివారించడానికి.. ఒకేసారి విడుదల కాకుండా చూడాలని మేకర్స్ తమ శాయశక్తులా ప్రయత్నించారు. కానీ అవి ఫలించకపోవడంతో సంక్రాంతి సీజన్ లో రెండు చిత్రాలను ఒకటీ లేదా రెండు రోజులు గ్యాప్‌ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే థియేటర్స్ కేటాయించడం దగ్గర నుంచి.. ప్రమోషన్స్ వరకూ రెండు సినిమాలను బ్యాలన్స్ చేయడం మేకర్స్ కు కష్టతరంగా ఉందని తెలుస్తోంది.

చిరంజీవి - బాలకృష్ణ ఇద్దరూ సంక్రాంతికి రాబోతున్నారనేది స్పష్టమైంది కానీ.. ఎవరు ముందు ఎవరు వెనుక అనేదే ఇంకా క్లారిటీ రావడం లేదు. అదే ఇప్పుడు మైత్రీ టీమ్ కి పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు. ఇద్దరు హీరోలు కూడా తమ సినిమాలనే ముందుగా విడుదల చేయాలని నిర్మాతలను ఆదేశిస్తున్నారట. మామూలుగా ముందుగా రిలీజ్ అయ్యే సినిమాకి అధిక స్క్రీన్స్‌ ప్రయోజనం ఉంటుంది. అలానే ముందుగా థియేటర్లలోకి వచ్చే సినిమాపైనే సాధారణ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తుంటారు.

ఒకవేళ ఫస్ట్ రిలీజైన సినిమాకు మంచి టాక్ వస్తే.. తర్వాతి రోజు విడుదలయ్యే చిత్రం తక్కువ స్క్రీన్‌లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అదే టాక్ బాగాలేకపోతే మాత్రం ఆశించిన థియేటర్లు వచ్చే అవకాశం ఉంటుంది. 'ఆది పురుష్' సినిమా వాయిదా పడటం కూడా కలిసొస్తుంది. కాకపోతే గతంలో సినిమాలు వారాల తరబడి థియేటర్లలో రన్ అయ్యేవి కాబట్టి.. ఏ సినిమా ఎప్పుడు వచ్చినా ఇబ్బందేమీ లేదు.

కానీ ఇప్పుడు అలా కాదు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోడానికి ఫస్ట్ వీకెండ్ లోనే సాధ్యమైనంత వరకూ కలెక్షన్స్ రాబట్టాలి. టాక్ బాగుంటే రెండో వారంలోనూ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇద్దరు సీనియర్ హీరోలు కూడా తమ సినిమానే ముందు రిలీజ్ చేయాలనుకుంటున్నారట. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలని మైత్రీ టీం మల్లగుల్లాలు పడుతోందట.

అయితే ఎక్కువ శాతం చిరంజీవి సినిమానే ముందుగా థియేటర్లలోకి వస్తుందని టాక్ వినిపిస్తోంది. రవీంద్ర కొల్లి (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వాల్తేరు వీరయ్య' చిత్రాన్ని జనవరి 11న విడుదల చేసి.. గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న 'వీర సింహా రెడ్డి' సినిమాని జనవరి 12న రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. మరి త్వరలోనే ఈ విషయంలో స్పష్టత వస్తుందేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.