Begin typing your search above and press return to search.

‘విశ్వాసం’ స్టోరీ లైన్‌

By:  Tupaki Desk   |   7 Jan 2019 10:11 AM GMT
‘విశ్వాసం’ స్టోరీ లైన్‌
X
తెలుగులో ఈ సంక్రాంతికి ఏ స్థాయి పోటీ ఉందో, తమిళనాట కూడా అదే స్థాయి పోటీ నెలకొని ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ‘పెట్ట’ మూవీకి పోటీగా అజిత్‌ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన ‘విశ్వాసం’ మూవీ విడుదల కాబోతుంది. తమిళ ఆడియన్స్‌ ఈ రెండు చిత్రాలపై కూడా అంచనాలు భారీగా పెంచుకున్నారు. రజినీకాంత్‌ మరియు అజిత్‌ లు తమిళంలో అత్యధిక క్రేజ్‌ ఉన్న హీరోలనే విషయం తెల్సిందే. ఇద్దరు స్టార్‌ హీరోలు పోటీ పడుతున్న నేపథ్యంలో ఆయా హీరోలకు చెందిన ఫ్యాన్స్‌ ప్రస్తుతం ఢీ అంటే ఢీ అంటూ సోషల్‌ మీడియాలో పోటా పోటీగా తమ హీరో మూవీపై ప్రచారం చేసుకుంటున్నారు.

అజిత్‌ నటించిన ‘విశ్వాసం’ చిత్రంలో నయనతార నటించడంతో సినిమా స్థాయి మరింతగా పెరిగింది. గత కొంత కాలంగా కోలీవుడ్‌ లో లేడీ సూపర్‌ స్టార్‌ గా నయనతార దూసుకు పోతుంది. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీస్‌ తో నయన్‌ మంచి ఫామ్‌ లో ఉంది. ఇలాంటి సమయంలో విశ్వాసంలో నటించడంతో సినిమా స్థాయి అమాంతం పెరిగింది. ఇంతగా అంచనాలున్న విశ్వాసం మూవీ స్టోరీ లైన్‌ పై తమిళ సినీ వర్గాల్లో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.

‘విశ్వాసం’ స్టోరీ ఇదే అంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇంతకు ఆ స్టోరీ లైన్‌ ఏంటీ అంటే... అజిత్‌ మరియు నయనతారలు ప్రేమించుకుంటారు. ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్న సమయంలో కొన్ని కారణాల వల్ల విడిపోతారు. విడిపోయిన వారిద్దరు మళ్లీ 12 ఏళ్ల తర్వాత కలుస్తారు. ఆ సమయంలోనే విలన్‌ జగపతిబాబు హీరోయిన్‌ నయనతార కూతురును కిడ్నాప్‌ చేస్తాడు. విలన్‌ నుండి పాపను అజిత్‌ ఎలా కాపాడాడు అనేది సినిమా కథాంశం అని, ఇద్దరు మళ్లీ ఎలా కలిశారు అనేది సినిమా నేపథ్యం అంటూ ప్రచారం జరుగుతుంది. రొటీన్‌ కథగా ఇది అనిపించినా కూడా భారీ ఎత్తున యాక్షన్‌ ఎలిమెంట్స్‌ తో దర్శకుడు శివ అద్బుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా అజిత్‌ ఫ్యాన్స్‌ చెప్పుకుంటున్నారు. ఈనెల 10న రాబోతున్న విశ్వాసం సినిమా ఏస్థాయిలో ఆడుతుందో చూడాలి.