Begin typing your search above and press return to search.

లెజెండరీ డైరెక్టర్‌.. ఎన్టీఆర్‌తో ఓకే అంటున్నాడు

By:  Tupaki Desk   |   6 July 2015 12:22 PM IST
లెజెండరీ డైరెక్టర్‌.. ఎన్టీఆర్‌తో ఓకే అంటున్నాడు
X
ఈ తరం తెలుగు హీరోల్లో 'సాగర సంగమం' లాంటి సినిమా చేయగల సత్తా ఉన్న నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేడు. చిన్నప్పుడే కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుని తన సినిమాల్లో అప్పుడప్పుడూ ఆ ప్రతిభను ప్రేక్షకులకు పరిచయం చేశాడు ఎన్టీఆర్‌. మరి 'సాగర సంగమం' సృష్టికర్త కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఓ సంగీత ప్రధానమైన సినిమాలు చేస్తే ఎలా ఉంటుంది? ఎన్టీఆర్‌కు అలాంటి ఆలోచన ఉందో లేదో కానీ.. విశ్వనాథ్‌కు మాత్రం ఆ కోరిక ఉన్నట్లే ఉంది. ఈ మధ్య ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌తో సంగీత ప్రధాన చిత్రం చేయాలన్న ఆశ ఉందని వెల్లడించాడీ లెజెండరీ డైరెక్టర్‌.

నిజంగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందో లేదో కానీ.. విశ్వనాథ్‌ లాంటి దిగ్గజ దర్శకుడు ఎన్టీఆర్‌తో సినిమా చేయాలన్న కోరిక వ్యక్తం చేయడం అతడు గర్వంగా చెప్పుకోవాల్సిన విషయమే. 80లు, 90ల్లో అద్భుతమైన చిత్రాలు తీసిన విశ్వనాథ్‌.. కొత్త శతాబ్దంలో రెండు సినిమాలకు (స్వరాభిషేకం, శుభప్రదం) మాత్రమే దర్శకత్వం వహించారు. అవి రెండూ నిరాశ పరచడంతో సినిమాలు మానుకున్నారు. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వాతికరణం లాంటి సినిమాల్ని రీమేక్‌ చేసే అవకాశాలేమైనా ఉన్నాయా అని విశ్వనాథ్‌ను అడిగితే.. అవి ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి సరిపోవని.. అలాంటి ప్రయత్నాలేమీ చేయబోనని చెప్పారు. తన జీవిత చరిత్ర రాసే ఉద్దేశాలు కూడా తనకేమీ లేవని ఆయన స్పష్టం చేశారు.