Begin typing your search above and press return to search.

కమల్ మళ్లీ మెస్మరైజ్ చేశాడు

By:  Tupaki Desk   |   29 July 2018 12:27 PM IST
కమల్ మళ్లీ మెస్మరైజ్ చేశాడు
X
చాన్నాళ్ల విరామం తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ మళ్లీ వెండితెరపై కనువిందు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘విశ్వరూపం-2’ చిత్రం ఆగస్టు 10న విడుదలకు సిద్ధమవుతోంది. నాలుగైదేళ్ల కిందటే రావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాలతో మరుగున పడి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐతే ఇంత గ్యాప్ వచ్చినా.. ఆ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏమీ తగ్గలేదు.

మామూలుగా ఇలా బాగా ఆలస్యంగా వచ్చే సినిమాలకు ప్రోమోలు కట్ చేస్తే.. ఏదో పాతబడిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ ‘విశ్వరూపం-2’ విషయంలో అలాంటి భావన ఏమీ కలగలేదు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఒక యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ లాంచ్ చేశారు. అది ‘విశ్వరూపం’ ప్రియుల్ని మెస్మరైజ్ చేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో ట్రైలర్ లాంచ్ చేశారు. అది కూడా ఆకట్టుకుంటోంది. ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచుతోంది.

దేశం కోసం టెర్రరిస్టుల్లో కలిసిపోయి వారి దగ్గర శిక్షణ తీసుకుని.. వాళ్లను తిరుగులేని దెబ్బ తీసిన మేజర్ విసామ్ అహ్మద్ కశ్మీరీ.. అనూహ్య పరిస్థితుల్లో దేశద్రోహిగా ముద్ర పడి ప్రాణాపాయాన్ని ఎదుర్కొంటాడు. ఆ స్థితిలో అతను ఎలా పోరాడి తనపై వచ్చిన ఆరోపణలు తప్పని రుజువు చేశాడు.. ఈ క్రమంలో టెర్రరిస్టుల ఆటలకు ఎలా అడ్డుకట్ట వేశాడన్నది ‘విశ్వరూపం-2’ కథ. తొలి భాగాన్ని మించిన ఉత్కంఠ.. మలుపులు ఇందులో ఉంటాయని రెండు ట్రైలర్లను బట్టి తెలుస్తోంది. పూజా కుమార్.. ఆండ్రియా జెరెమీ.. రాహుల్ బోస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని తమిళం.. తెలుగు.. హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు.