Begin typing your search above and press return to search.

క్రేజీ చిత్రాల‌ని కూడా ఓటీటీకే ఇచ్చేస్తున్నారు

By:  Tupaki Desk   |   20 Jan 2022 7:32 AM GMT
క్రేజీ చిత్రాల‌ని కూడా ఓటీటీకే ఇచ్చేస్తున్నారు
X
కరోనా, ఒమిక్రాన్ దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా ప‌రిస్థితులు మారిపోతున్నాయి. దీనికి త‌గ్గ‌ట్టుగానే జ‌న జీవితంలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సినీ ఇండ‌స్ట్రీ కూడా ఇందుకు త‌గ్గ‌ట్టుగానే అడుగులు వేస్తోంది. ఇటీవ‌ల జ‌న‌వ‌రి 7 సంక్రాంతి భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కావాల్సిన పాన్ ఇండియా మూవీ `ఆర్ ఆర్ ఆర్‌` రిలీజ్ వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. ఇదే త‌ర‌హాలో జ‌న‌వ‌రి 14న ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేసిన మ‌రో పాన్ ఇండియా మూవీ `రాధేశ్యామ్‌` కూడా వాయిదా ప‌డింది.

వ‌రుస‌గా స్టార్ హీరోల చిత్రాల‌న్నీ త‌మ రిలీజ్ డేట్ ల‌ని పోస్ట్ పోన్ చేసుకుంటూ మ‌రో డేట్ ని ప్ర‌క‌టించేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ తాము నిర్మించిన రెండు క్రేజీ చిత్రాల‌ని ఓటీటీలో విడుద‌ల చేసేందుకు రెడీ కావ‌డం ప‌లువురిని షాక్ కు గురిచేస్తోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ క్రేజీ మూవీస్ విరాట ప‌ర్వం, శాకిని డాకిని చిత్రాల‌కు నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

`విరాట ప‌ర్వం` చిత్రంలో రానా హీరోగా న‌టించారు. క్రేజీ హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి ఇందులో నారాకు జోడీగా న‌టించింది. ఉత్త‌ర తెలంగాణ నేప‌థ్యంలో 90వ ద‌శ‌కంలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ మూవీని తెర‌కెక్కించారు. గ‌త కొన్ని నెల‌లుగా టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిన ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా? అని రానా, సాయి ప‌ల్ల‌వి అభిమానులు ఎదురుచూస్తున్నారు. భారీ చిత్రాల రిలీజ్ డేట్ లు ప్ర‌క‌టిస్తున్నా ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించ‌క‌పోడ‌వంతో గ‌త కొన్ని రోజులుగా ఈ మూవీ రిలీజ్ పై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో ఈ మూవీని నిర్మాత డి. సురేష్ బాబు ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలిసి అంతా అవాక్క‌వుతున్నారు. గ‌తంలో విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన నారప్ప‌, దృశ్యం -2 చిత్రాల‌ని ఓటీటీలో విడుద‌ల చేసి స‌క్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే బాట‌లో `విరాట ప‌ర్వం` ని కూడా ఓటీటీలో విడుద‌ల చేయాలని ప్లాన్ చేస్తున్నార‌ట‌. నెట్ ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీని రిలీజ్ చేసే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది.

ఇక ఈ మూవీతో పాటు మ‌రో చిత్రాన్ని కూడా ఓటీటీకే ఇచ్చేస్తున్నార‌ట‌. సుధీర్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న చిత్రం `శాకిని ఢాకిని`. సౌత్ కొరియ‌న్ మూవీ `మిడ్ నైట్ ర‌న్న‌ర్స్` ఆధారంగా ఈ మూవీని సునీత తాటితో క‌లిసి డి. సురేష్ బాబు నిర్మిస్తున్నారు. రెజీనా, నివేదా థామ‌స్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్త‌యి రిలీజ్ కి రెడీ అయిన ఈ మూవీని కూడా ఓటీటీలో విడుద‌ల చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. `విరాట ప‌ర్వం` తో పాటు ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ లేదా నెట్ ఫ్లిక్స్ కి ఇవ్వ‌బోతున్నార‌ని తాజాగా వినిపిస్తోంది.