Begin typing your search above and press return to search.

మళ్లీ కోహ్లి కమాల్.. ముంబై గెలిస్తే బొనాంజానే..

By:  Tupaki Desk   |   20 May 2022 1:30 PM GMT
మళ్లీ కోహ్లి కమాల్.. ముంబై గెలిస్తే బొనాంజానే..
X
విమర్శలకు మాటలతో కాకుండా.. బ్యాట్ తోనే సమాధానం చెప్పేవాడు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్. ఎన్నిసార్లు, ఎంతగా విమర్శలు చేసినా.. అతడి బ్యాటే జవాబిచ్చేది. ఆ తరంలో సచిన్ అయితే.. ఈ తరంలో విరాట్ కోహ్లి. తాజాగా గురువారం మ్యాచ్ లో కోహ్లి ఇలానే బ్యాట్ తో సమాధానం చెప్పాడు. ఐపీఎల్ లో 13 గేమ్ లు అయ్యాక రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు గొప్ప ఉపశమనం.. విరాట్ కోహ్లి ఫామ్ అందుకోవడం. టోర్నీ ప్రారంభం నుంచి పెద్ద స్కోర్లు అందుకోవడంలో కోహ్లి ఇబ్బంది పడుతున్న సంగతి చూశాం. అంతేకాదు.. ఐదారు గేమ్ ల వ్యవధిలో మూడు సార్లు డక్ అవుట్ అయ్యాడు.

స్ట్రయిక్ రేట్ 100 లోపే

టెస్టుల్లో క్రీజులో నిలవడం.. వన్డేల్లో నిలకడగా పరుగులు సాధించడం ఎలాగో.. టి20ల్లో స్ట్రయిక్ రేట్ అలాగ. స్ట్రయిక్ రేట్ ఎంత ఎక్కువగా ఉంటే టి20లకు అంత అతికినట్లు సరిపోయే ఆటగాడిగా భావిస్తారు. అయితే, గత 13 మ్యాచ్ ల్లోనూ కోహ్లి స్ట్రయిక్ రేట్ 100కు అటుఇటుగానే. కానీ, గురువారం కీలక మ్యాచ్ లో విరాట్‌ (73) పాత ఆటను బయటకు తీశాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఈ మ్యాచ్ .. బెంగళూరుకు లీగ్ దశలో చివరిది. ఇందులో ఓడితే ప్లే ఆఫ్స్ ఆశలు ఖతం. అలాంటి సమయంలో కోహ్లి ఖతర్నాక్ ఆట ఆడాడు.

తొలి బంతి నుంచే పాజిటివ్ గా

సాంకేతికంగా, ఫిట్ నెస్ పరంగా వంక పెట్టడానికి వీల్లేని ఆటగాడు కోహ్లి. అలాంటి కోహ్లి కొన్నాళ్లుగా పేలవంగా అవుటవుతున్నాడు. పాజిటివ్ గానూ కనిపించడం లేదు. కానీ, గురువారం గుజరాత్ తో మ్యాచ్ లో తనలోని అమేయ శక్తిని చూపాడు. తొలి బంతి నుంచే పాజిటివ్ గా కనిపించాడు. అద్భుతమైన షాట్లు ఆడడమే కాక.. తనలోని క్లాస్ ను చూపాడు.

ఒకే జట్టుకు 7 వేల పరుగులు..

ఈ మ్యాచ్ లో కోహ్లి (73; 54 బంతుల్లో 8x4, 2x6) స్ట్రయిక్ రేట్ 135. టి20లకు తగిన రేట్ ఇది. కవర్‌ డ్రైవ్‌లు, ఫ్లిక్‌ షాట్లలాంటి చూడచక్కని బ్యాటింగ్‌తో మళ్లీ తనలోని మునుపటి ఆటగాడిని గుర్తుచేశాడు. దీంతో బెంగళూరు జట్టే కాకుండా అతడి అభిమానులు కూడా మురిసిపోయారు. ఈ మ్యాచ్‌తో విరాట్‌ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

బెంగళూరు ఫ్రాంఛైజీ తరఫున 7000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. కాగా, విరాట్‌ ఇప్పటివరకు ఈ లీగ్‌లో మొత్తం 221 మ్యాచ్‌ల్లో 6,592 పరుగులు చేయగా.. మిగతావి ఛాంపియన్స్‌ లీగ్‌లో సాధించాడు. దీంతో ఫ్రాంఛైజీ లీగ్‌ క్రికెట్‌లో ఒకే జట్టు తరఫున ఇన్ని పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగానూ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు.. ఛేజింగ్ లో 3 వేల పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్ మన్ గానూ కోహ్లి నిలిచాడు. కాగా, ఐపీఎల్ ప్రారంభం నుంచి కోహ్లి బెంగళూరుకే ఆడుతున్న సంగతి తెలిసిందే.

అభిమానుల ఆనందం.. సోషల్ మీడియాలో సంబరం

గుజరాత్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఫామ్‌ అందుకోవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన కోహ్లీ.. తన ఆటతీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లో జట్టు కోసం రాణించలేకపోయానని, తీవ్ర నిరాశకు గురయ్యానని చెప్పాడు. గణాంకాలు కాకుండా ఆ విషయమే తనను మనోవేదనకు గురిచేసిందని వెల్లడించాడు. 'ఈ మ్యాచ్‌లో నేను మా జట్టుపై ప్రభావం చూపించగలిగాను. దాంతో మా టీమ్‌ మంచిస్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో నాపై భారీ అంచనాలు ఉండడానికి కారణం ఇంతకుముందు నేను ఆడిన విధానమే.

అలాంటప్పుడు మన ఆలోచనా విధానాన్ని సరైన దృక్పథంలో ఉంచుకోవాలి. అంచనాలకు తగ్గట్టు రాణించాలంటే కొన్ని విషయాలను పట్టించుకోవద్దు. నేనీ మ్యాచ్‌లో రాణించేందుకు చాలా కష్టపడ్డా. మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో 90 నిమిషాల పాటు సాధన చేశా. దీంతో చాలా ప్రశాంతంగా బరిలోకి దిగా. షమి బౌలింగ్‌లో తొలిషాట్‌ నుంచే బాగా ఆడతాననే నమ్మకం కలిగింది. ఫీల్డర్లపై నుంచి ఆడగలననే ఆత్మవిశ్వాసం లభించింది. అలాగే ఈ సీజన్‌లో అభిమానుల నుంచి మంచి మద్దతు లభించింది. వాళ్లందరి ప్రేమా ఆప్యాయతలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా' అని విరాట్‌ హర్షం వ్యక్తం చేశాడు.

ముంబై.. నువ్వు గెలవాలి..

లీగ్ లో ప్రస్తుతం బెంగళూరు తనపై కాకుండా ముంబైపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ముంబై ఈ సీజన్ లో దారుణ ప్రదర్శన చేసి ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఎప్పుడో తప్పుకొంది. అయితే, బెంగళూరు ప్లే ఆఫ్స్ అవకాశాలు మాత్రం ఆ జట్టు చేతిలో ఉన్నాయి. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో ముంబై గెలిస్తే బెంగళూరు నేరుగా ప్లే ఆఫ్స్ కు వెళ్తుంది. అలాకాకుండా ఢిల్లీ గెలిస్తే బెంగళూరుకు ఇంటి బాటే. నెట్‌ రన్‌రేట్‌ (-0.253) తక్కువగా ఉండడమే దీనికి కారణం. కాబట్టి ముంబయి గెలవాలని బెంగళూరు అభిమానులతో సహా ఆ జట్టు ఆటగాళ్లు కూడా ఇప్పుడు కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆ జట్టు మాజీ సారథి విరాట్‌ కోహ్లీనే స్వయంగా వెల్లడించాడు.

గతరాత్రి గుజరాత్‌పై విజయం సాధించాక కెప్టెన్‌ డుప్లెసిస్‌తో మాట్లాడుతూ విరాట్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ముంబయి గెలవాలని, అందుకోసం తాము ఇద్దరం మద్దతు తెలియజేస్తామని చెప్పాడు. మళ్లీ సరిచేసుకొని తాము ఇద్దరమే కాకుండా తమ జట్టులోని 25 మంది మద్దతు కూడా ముంబయికే ఉంటుందన్నాడు. వీలైతే తమని ముంబయి, దిల్లీ మ్యాచ్‌లో చూడొచ్చని కూడా అన్నాడు. ఈ వీడియోను టోర్నీ నిర్వాహకులు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో బెంగళూరు, ముంబయి అభిమానులు సంబరపడుతున్నారు. కాగా, బెంగళూరు ప్రస్తుతం లీగ్‌ స్టేజ్‌లో అన్ని మ్యాచ్‌లు పూర్తిచేసుకొని 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అయితే, దిల్లీ ఇంకా తమ చివరి మ్యాచ్‌ ఆడాల్సి ఉండగా 14 పాయింట్లతో కొనసాగుతోంది. నెట్‌రన్‌రేట్‌ (0.255) బెంగళూరు కన్నా మెరుగ్గా ఉంది. ఈ నేపథ్యంలో ముంబయిపై దిల్లీ గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకొంటుంది.