Begin typing your search above and press return to search.

చ‌రిత్ర సృష్టించిన క‌థ పుట్టుక సీక్రెట్ చెప్పేశాడు

By:  Tupaki Desk   |   17 April 2022 2:30 AM GMT
చ‌రిత్ర సృష్టించిన క‌థ పుట్టుక సీక్రెట్ చెప్పేశాడు
X
ఇండియ‌న్ సినీ చ‌రిత్ర‌లో 'బాహుబ‌లి'ది ప్ర‌త్యేక స్థానం. ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. యావ‌త్ భార‌తీయ సినిమా దిశ‌నే మార్చేసింది. ఇండియ‌న్ సినిమా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సి వ‌స్తే ఎవ‌రైనా 'బాహుబ‌లి'కి ముందు బాహుబ‌లి త‌రువాత అని చెప్పాల్సిందే. అంత‌గా ఈ సినిమా భార‌తీయ సినీ ప్ర‌పంచాన్ని ప్ర‌భావితం చేసింది. ఏ ల‌క్ష్యంతో ఈ సినిమా చేయాల‌ని రాజ‌మౌళి సంక‌ల్పం చేశారో కానీ ఆ ల‌క్ష్యాన్ని చాలా అవ‌లీల‌గా ఈ సినిమా దాటేసి ఆయ‌నని భార‌తీయ సినీమా కీర్తి కిరీటంలో మ‌కుటం లేని మ‌హారాజుగా నిల‌బెట్టింది.

ప్రాంతీయ సినిమా దేశీయ సినిమాతోనే కాకుండా హాలీవుడ్ సినిమాతో కూడా పోటీప‌డ‌గ‌ల‌ద‌ని, ఆ స్థాయిలో మ‌నం కూడా సినిమాలు తీయ‌గ‌ల‌మ‌ని యావ‌త్ ప్ర‌పంచానికి చాటి చెప్పింది. ఇండియ‌న్ సినిమా మ‌న‌తో పోటీప‌డుతుందా? అని హాలీవుడ్ మేక‌ర్స్ సైతం ఈ సినిమాని చూసి నివ్వెర‌పోయేలా చేసింది. వ‌సూళ్ల ప‌రంగానూ చ‌రిత్ర సృష్టించిన ఈ మూవీ ఎంతో మంది మేక‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగా నిలిచి బార‌తీయ సినిమాకు స‌రికొత్త దిశా నిర్దేశాన్ని చేసింది.

భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టిన ఈ సినిమా క‌థ ఎక్క‌డ ఎలా పుట్టింది? ద‌ఈని పుట్టిక సీక్రెట్ ఏంట‌న్న‌ది ఇప్ప‌టికీ సినీ ప్రియుల‌కు ప్ర‌త్యేక‌మే. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఇండియ‌న్ సినీ చ‌రిత్రలో స‌రికొత్త అధ్యాయాన్ని లిఖించిన 'బాహుబ‌లి' క‌థ పుట్టుక సీక్రెట్ ని బ‌య‌ట‌పెట్టారు. అయితే తెర‌పై చూపించిన దానికి కాస్త భిన్నంగా ఓ లైన్ ని ముందు రాజ‌మౌళికి వినిపించార‌ట విజ‌యేంద్ర ప్ర‌సాద్‌. అక్క‌డి నుంచి క‌థా విస్త‌ర‌ణ చేసిన‌ట్టుగా చెప్పుకొచ్చారు.

సుదీప్ - స‌త్య‌రాజ్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు బాహుబ‌లి బిగినింగ్ లో వున్నాయి. అయితే ఆ స‌న్నివేశాల నుంచే అస‌లు క‌థ మొద‌లుపెట్టార‌ట‌. దీనికి ముందు రాజ‌మౌళి క‌థ విష‌యంలో చాలా కండీష‌న్ లు పెట్టార‌ట‌. భారీ సినిమా చేయాల‌నుకుంటున్నాన‌ని, ఇందులో యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు భారీ స్కోప్ వుండాల‌ని, అంతే కాకుండా పాత్ర‌లు కూడా చాలా బ‌లంగా భారీగా వుండాల‌ని, భారీ త‌నంతో క‌థ వుండాల‌ని కండీష‌న్ లు చెప్పార‌ట‌. దాంతో జ‌క్క‌న్న చెప్పిన అన్ని అంశాలు వున్న క‌థలోని తొలి స‌న్నివేశాన్ని చెప్పార‌ట‌.

ఆయుధాలు అమ్ముకోవ‌డానికి విదేశాల నుంచి ఓ వ‌ర్త‌కుడు వ‌స్తాడు. అక్క‌డే ఓ 80 ఏళ్ల ముస‌లాయ‌న చిన్న పిల్ల‌ల‌కు క‌త్తి యుద్ధం క‌గురించి నేర్పిస్తుంటాడు. అది చూసిన ఆయుధాల వ‌ర్త‌కుడు పెద్ద వీరుడిలా వున్నాడే అని మాట‌క‌లుపుతాడంట‌.. అప్పుడే 80 ఏళ్ల ముస‌ల‌త‌ను మీకు బాహుబ‌లి గురించి తెలుసా? అని అడిగి అత‌ని గురించి చెప్ప‌డం మొద‌లుపెడ‌తాడ‌ట‌. బాహుబ‌లి నేను క‌లిసి ఎన్నో ఏళ్లు సాధ‌న చేశాం. ఎన్నో యుద్ధాలు చేశాం. ఒక సారి అడ‌విలో వెళుతుంటే 200 మంది వ‌చ్చి దాడి చేశారు. వాళ్ల‌తో బాహుబ‌లి యుద్దం చేస్తుంటే మ‌హా భార‌తంలో అర్జునుడు గుర్తొచ్చాడు. సాయంత్రం అయ్యే స‌రికి ర‌క్తంతో త‌డిసి ముద్ద‌య్యాడు.

అయితే ఆ ర‌క్తం అత‌నిది కాదు. ఎందుకంటే అత‌ని ఒంటిమీద గాటు పెట్ట‌గ‌ల వీరుడు పుట్ట‌లేదు కాబ‌ట్టి. అంత‌టి వీరుడిని నేను చూడాలి అని ఆ వ‌ర్త‌కుడు అడిగితే.. చ‌నిపోయాడ‌ని చెబుతాడు. ఎలా ఒంటిపై గాటు పెట్ట‌గ‌ల వీరుడు లేడ‌న్నావు అత‌ను ఎలా చ‌నిపోయాడ‌ని అడుగుతాడు వ‌ర్త‌కుడు. క‌త్తిపోటు క‌న్నా వెన్నుపోటు బ‌ల‌మైన‌ది అత‌న్ని నేనే చంపేశా అంటాడు' ఈ సీన్ తో పాటు ఒంటి చేత్తో శివ‌గామి నీళ్ల‌లో 'బాహుబ‌లి'ని కాపాడుతూ త‌ను చ‌నిపోయే సన్నివేశం చెప్పాన‌ని, అక్క‌డి నుంచే క‌థా విస్త‌ర‌ణ మొద‌లైంద‌ని విజ‌యేంద్ర ప్ర‌సాద్ 'బాహుబ‌లి' క‌థ ఎలా పుట్టిందో సీక్రెట్ బ‌య‌ట‌పెట్టారు.