Begin typing your search above and press return to search.

ఆనంద్.. గోదావరి.. తర్వాత ఇదే

By:  Tupaki Desk   |   16 Jun 2016 10:54 AM GMT
ఆనంద్.. గోదావరి.. తర్వాత ఇదే
X
హీరోయిన్ పాత్రలకు చాలా ప్రాధాన్యమిచ్చే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకడు. తన తొలి సినిమా ‘ఆనంద్’లో.. ఆ తర్వాత ‘గోదావరి’లో హీరోయిన్ పాత్ర ఎంత బలంగా ఉంటుందో.. ఆ క్యారెక్టర్ల ద్వారా కమలిని ముఖర్జీకి ఎంత పేరొచ్చిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాతి సినిమాల్లో కూడా కమ్ముల హీరోయిన్ క్యారెక్టర్లను బాగానే చూపించాడు కానీ.. తన తొలి రెండు సినిమాల స్థాయిలో మాత్రం ఎఫెక్ట్ చూపించలేదు. ఐతే ‘అనామిక’ తర్వాత బాగా గ్యాప్ తీసుకుని త్వరలోనే వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇందులో మలయాళ భామ సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడా విషయంలో కన్ఫర్మేషన్ వచ్చేసింది.

మలయాళంలో సాయి పల్లవి చేసిన పాత్రలన్నీ కూడా చాలా బలమైనవే. ఆమె సినిమాలన్నీ కంటెంట్ ఓరియెంటెడ్ గా నడిచేవే. ఇప్పటిదాకా ఆమె రెగ్యులర్ కమర్షియల్ సినిమాలేమీ ఆమె చేయలేదు. అలాంటి సినిమాలు పల్లవికి సూటయ్యే అవకాశాలు కూడా లేవు. ఐతే శేఖర్ కమ్ముల ఆనంద్.. గోదావరి లాంటి సినిమాల గురించి తెలుసుకుని.. అతను చెప్పిన పాత్ర నచ్చి ఆమె ఓకే చేసిందట. హీరోతో సమానంగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు. శేఖర్ నుంచి ఆనంద్.. గోదావరి తరహాలో మరో సినిమాను ఆశించవచ్చట. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం జులై నెలలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. వరుస ఫ్లాపులతో అసలు ఇండస్ట్రీ నుంచే అంతర్ధానమయ్యే పరిస్థితికి వచ్చిన కమ్ముల ఈ సినిమాతో తనేంటో రుజువు చేసుకోవాలనే కసితో ఉన్నాడు.